గాంధీ జిల్లా: అమెరికాలోని ఈ జిల్లాకు మహాత్ముడి పేరు పెట్టడానికి కారణమిదే

మహాత్మ గాంధీ డిస్ట్రిక్ట్
    • రచయిత, రజిత జనగామ
    • హోదా, హ్యూస్టన్ నుంచి, బీబీసీ కోసం

భారత్‌లో ఊరికో మహాత్మా గాంధీ విగ్రహం, పట్టణానికో గాంధీనగర్ ఉండటం సర్వసాధారణం. కానీ, అమెరికాలో కూడా గాంధీ పేరుతో ఓ జిల్లా ఉంది.

టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఇది ఉంది. అమెరికాలోని 59వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న హిల్‌క్రాఫ్ట్ ప్రాంతానికి 'మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్'గా స్థానికులు పేరు పెట్టుకున్నారు. ఇదొక వ్యాపార కేంద్రం.

40 ఏళ్ల కిందట ఇక్కడ ఒకటిరెండు దుకాణాలతో భారతీయులు వ్యాపారాలు ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య కొన్ని వందలకు చేరింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

టెక్సస్ రాష్ట్రంలోనే ప్రముఖ భారతీయ వ్యాపార కేంద్రంగా 'మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్' పేరు పొందింది.

ఈ అభివృద్ధి జరగడం వెనుక చాలా కృషి ఉందని అంటున్నారు రమేశ్ లుల్లా. హిల్‌క్రాఫ్ట్‌లో మొదట్లో వ్యాపారం ప్రారంభించినవారిలో ఆయనా ఒకరు.

మహాత్మ గాంధీ డిస్ట్రిక్ట్

''హిల్‌క్రాఫ్ట్ వ్యాపార సంఘం ఏర్పాటు చేసుకుని నలుగురు వ్యాపారులం కలిసి చాలా కష్టపడ్డాం. దక్షిణాసియా చాంబర్ ఆఫ్ కామర్స్, భారత సాంస్కృతిక శాఖ సాయంతో స్థానిక నేతలను కలిశాం.

నగరశాఖ అనుమతులు 40ఏళ్ల కిందట రాగా దానికి పదేళ్ల కిందట గాంధీ పేరు పెట్టేందుకు అనుమతులు సాధించాం. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించగలిగినందుకు గర్వంగా ఉంది'' అని రమేశ్ బీబీసీతో చెప్పారు.

మహాత్మ గాంధీ డిస్ట్రిక్ట్

రమేశ్ వ్యాపారం ఒక బట్టల దుకాణంతో మొదలైంది. ఇప్పుడు ఆయన మరో రెస్టారెంట్, బొటీక్ కూడా తెరిచారు.

ఆయన కుటుంబం అంతా వ్యాపారంలోనే కొనసాగుతోంది.

హ్యూస్టన్‌లో జరిగే భారతీయ వ్యాపార లావాదేవీల్లో 70 శాతం మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్‌లోనే జరుగుతున్నాయని, మిగతా 8 జిల్లాల్లో మిగిలిన 30 శాతం జరుగుతున్నాయని రమేశ్ చెప్పారు.

మహాత్మ గాంధీ డిస్ట్రిక్ట్

బాగా చదువుకున్న వ్యాపారులు ఉండటం, హ్యూస్టన్‌లో భారత సంతతి జనాభా పెరగడంతో ఈ డిస్ట్రిక్ట్ భారతీయ వ్యాపారాలకు కేంద్రంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతోంది.

భారతీయుల అభిరుచి, అవసరాలకు సరిపడేలా ఆహారం, నిత్యావసరాలు, బట్టలు, బంగారం, అలంకరణ, వినోదం, ఆధ్యాత్మికం వంటివాటికి సంబంధించిన వస్తుసేవలన్నీ ఇక్కడ దొరుకుతాయి.

మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్‌లో పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాల నుంచి వచ్చిన వారు కూడా వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే, అత్యధిక వ్యాపారాలు భారత సంతతి వారివే.

హిల్‌క్రాఫ్ట్‌కు 2010 జనవరి 16న మహాత్మా గాంధీ పేరును పెట్టారు. ఇందుకోసం నిబంధనల ప్రకారం 10 వేల డాలర్లను ప్రభుత్వానికి ఇక్కడి వ్యాపారులు చెల్లించారు.

ఈ ప్రాంతానికి గాంధీ పేరును పెట్టడం తాము సాధించిన గొప్ప విజయమని, ఆ పేరు వల్లే ఇతర నగరాల దృష్టి కూడా తమ ప్రాంతంపై పడుతోందని రమేశ్ అంటున్నారు.

ఈ డిస్ట్రిక్ట్‌లో పన్ను చెల్లింపులు బాగా జరుగుతాయని, స్థానిక ప్రభుత్వం తమకు మంచి సహకారం అందిస్తోందని ఆయన చెప్పారు.

''గాంధీ డిస్ట్రిక్ట్‌కు భారతీయులే కాదు.. ఇతర దేశాలవారు, వివిధ జాతులకు చెందినవాళ్లు వస్తుంటారు. దాదాపు 25 శాతం వినియోగదారులు వారే. ఇదొక అంతర్జాతీయ వ్యాపార సముదాయం" అని రమేశ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)