మహాత్మా గాంధీ లండన్లో చేతికర్రతో డాన్స్ చేసిన వేళ...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మధుకర్ ఉపాధ్యాయ్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
మహాత్మా గాంధీ ప్రస్తావన వస్తే, మనకు తరచూ మనసులో రెండు రకాల విషయాలు గుర్తుకొస్తాయి.
ఒకటి మొండి పట్టుదల ఉన్న గాంధీజీ వ్యక్తిత్వం, రెండోది చేతికర్ర, కళ్లజోడు, గడియారం లాంటి ఆయన వస్తువులు.
అయితే, వాటితోపాటు గాంధీకి సంబంధించిన విషయాలు జనానికి పెద్దగా తెలియనివి చాలానే ఉన్నాయి. ఉదాహరణకు సంగీతం అంటే గాంధీకి చాలా ఇష్టం.
సంగీతం భాగం కానంతవరకూ భారత స్వాతంత్య్రోద్యమం సఫలం కాలేదని గాంధీజీ భావించేవారు. సంగీతం లేకపోవడం వల్లే స్వాతంత్ర్య పోరాటం అంత బలంగా నడపలేకపోయామని ఆయన అనుకునేవారు.
సత్యాగ్రహం ప్రజలందరినీ ఏకం చేసే ఒక మార్గంగా గాంధీజీ భావించారు. ఆయన ఎక్కువగా నర్సింహ మెహతా రాసిన 'వైష్ణవ జనతో' గీతాన్ని పాడేవారు. అది ఆయనకు ఇష్టమైన భజన.
'వైష్ణవ జనతో' తర్వాత 'రఘుపతి రాఘవ రాజారాం' పాడేవారు. దానిని మిశ్రా సమాజం వారు ముద్రించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ జస్రాజ్ దానికి బాణీ కట్టి, ఆలపించారు.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ అక్కడితో ఆగిపోలేదు. ఆయనకు మిగతా అన్నిరకాల పాటలంటే కూడా చాలా ఆసక్తి ఉండేది. ఉదాహరణకు, ఆయన యరవాడ జైలులో ఉన్నప్పుడు దళితుల కోసం ఉద్యమం చేశారు. వారి కోసం ఆమరణ నిరాహారదీక్షకు కూర్చునేముందు, ఆయన సర్దార్ పటేల్, మహాదేవ్ దేశాయ్ని పిలిపించి, ఒక పాట పాడడం మొదలెట్టారు.
గాంధీ అప్పుడు 'ఉట్ జాగ్ ముసాఫిర్' (ప్రయాణికుడా మేలుకో..) అనే గీతం పాడారు. సర్దార్ పటేల్, మహాదేవ్ దేశాయ్ కూడా దానిని అందుకున్నారు. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలందరూ వారితో గొంతు కలిపారు. అలా గాంధీ ప్రారంభించిన ఆ గీతం ఆ జైలంతా ప్రతిధ్వనించింది.
గాంధీకి సంగీతం అంటే ఎంత ఇష్టమో చెప్పే ఒక ఆసక్తికరమైన ఘటన ఉంది. హిందుస్థానీ సంగీతంతోపాటు, తనకు విదేశీ, పాశ్చాత్య సంగీతం కూడా ఇష్టమే అని బాపూజీ చెప్పేవారు.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం గాంధీ లండన్లో ఉన్నప్పుడు ఆయన మురియల్ లేస్టర్లో ఉండేవారు. అక్కడ తూర్పు లండన్లో కింగ్స్లే హాల్ అనే ఒక ఆశ్రమం ఉండేది. గాంధీ రోజూ సాయంత్రం తన పనులన్నీ అయిపోయాక తీరిక దొరికినప్పుడు కింగ్స్లే హాలుకు వెళ్లిపోయేవారు.
ఎందుకంటే, అక్కడ ఆడిటోరియంలో స్థానికులు కొంతమంది కలిసి ఒక పాట పాడేవారు. అది స్కాట్లాండ్కు చెందిన ఒక జానపద గీతం. 'అవుడ్ లాంగ్ సైన్' (గతించిన విషయం) అంటూ సాగే ఆ గీతాన్ని తర్వాత రాబర్ట్ బర్న్స్ కొత్త శైలిలో రాశారు. అదంటే గాంధీజీకి చాలా ఇష్టం.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ ఆ పాట వినడానికి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో లెక్కలేదు. ప్రతి శనివారం స్థానికులు ఆ గీతానికి డ్యాన్స్ చేస్తారనే విషయం గాంధీకి తర్వాత తెలిసింది.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు కోసం ఆయనతోపాటు వెళ్లిన కాంగ్రెస్ సభ్యులకు మాత్రం గాంధీజీ అలాంటి వాటిపై ఆసక్తి చూపడం నచ్చేది కాదు.
వాళ్లు ఆయనకు అలా చేయకండి అని చెప్పారు. కానీ, గాంధీ వినలేదు. ఒక రోజు శనివారం ఆడిటోరియానికి చేరుకునేసరికే ఆ పాట, డ్యాన్స్ మొదలైపోయింది. కానీ, ఒక మహిళ హఠాత్తుగా చేయి పైకెత్తి ఆగండి అని అరిచారు.
తర్వాత ఆమె గాంధీని "మీరు కూడా మాతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారా?" అని అడిగారు.
గాంధీ చుట్టూ చూశారు. అక్కడ అందరూ తమ భార్యలతోనో, భర్తలతోనో లేదంటే స్నేహితులతోనో జంటగా నృత్యం చేస్తున్నారు.
గాంధీ 'తప్పకుండా' అన్నారు. "నేను డ్యాన్స్ చేస్తా కానీ, ఒక షరతు నాకు జంటగా నా చేతికర్రే ఉంటుంది" అన్నారు. గాంధీ తన చేతికర్రతోనే కింగ్స్లే హాల్లో ఆడిటోరియంలో డాన్స్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత రోమ్యా రోలాను కలవడానికి ఫ్రాన్స్ వెళ్లినప్పుడు, ఆయన తన డ్యాన్స్ గురించి ఆమెకు చెప్పారు. అప్పుడు ఆయనకు రోమ్యా రోలా పియానో చాలా బాగా వాయిస్తారనే విషయం కూడా తెలిసింది. దాంతో గాంధీజీ ఆమెతో "మీరు నాకు బీథోవిన్ ఐదో సింఫనీ వినిపిస్తారా" అని అడిగారు.
అప్పుడు రోమ్యా రోలా అనారోగ్యంతో ఉన్నారు. లేవలేకపోతున్నారు. చాలా కష్టంమీద పడక మీద నుంచి లేచిన ఆమె పియానో దగ్గర కూచుని, చివరికి గాంధీజీ కోరిన సింఫనీ వినిపించగలిగారు.
తర్వాత గాంధీజీ అడగకపోయినా ఆమె ఆయన కోసం ఒక గ్రీకు గీతం కూడా వాయించారు. కానీ, గాంధీజీ ఆమె వాయిస్తుంటే ఆ పాట పాడుతూ వచ్చారు. అది కూడా ఆయనకు తెలిసిన పాటే.
అందుకే ఏదైనా చెప్పాలంటే వారి గురించి పూర్తి వివరాలు తెలియాలి. కొన్ని గీతాలు, విషయాలతో గాంధీజీ పూర్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేం. దాని కోసం ఆయన గురించి తెలీని చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీజీ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోడానికి, బహుశా ఆయన 150వ జయంతి అయినా సాయం చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- 'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- భారత్లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయం
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- గోదావరిలో మునిగిన బోటు బయటకు వస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









