మామూలు యువకుడి నుంచి
మహాత్ముడి వరకు

మహాత్మా గాంధీ

మోహన్దాస్ కరంచంద్ గాంధీని ‘మహాత్మ’ అని పిలుస్తారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడిన విజ్ఞుడైన రాజకీయవేత్త ఆయన.
గాంధీ అహింసా పోరాటాన్ని నేటికీ ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు. ఆయన భారత పేదల ప్రతినిధి. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఈ శాంతిదూత తన టీనేజ్లో ‘రెబల్’గా ఉండేవారు.
గాంధీ జీవనయానం, మహాత్ముడి దాకా ఆయన సాగించిన ప్రయాణమే ఈ కథనం.

1869: మోహన్దాస్ కరంచంద్ గాంధీ భారత వాయవ్య ప్రాంతంలోని పోరుబందర్ సంస్థానంలో 1869 అక్టోబరు 2న జన్మించారు.

గాంధీది ఉన్నతవర్గానికి చెందిన కుటుంబం. పోరుబందర్ సంస్థానంలో గాంధీ తండ్రి చీఫ్ మినిస్టర్గా పనిచేసేవారు.
తల్లికి దైవచింతన ఎక్కువ.
ఆమె ఎక్కువ సమయం ఆలయాలు సందర్శిస్తూ, ఉపవాసాలు చేస్తూ గడిపేవారు.
శాకాహారం, పరమత సహనం, నిరాడంబర జీవనశైలి, అహింసపై ప్రధానంగా దృష్టి పెడుతూ, ఒక బలమైన హిందూ సాంస్కృతిక భావనను ఆయనకు ఆమె అలవర్చారు.

1883: టీనేజ్ రెబల్
గాంధీ తండ్రి కుటుంబంతో సహా రాజ్కోట్కు మారారు.
ఇక్కడ విద్యాబోధన మెరుగ్గా ఉంది. గాంధీ ఇక్కడ ఆంగ్లాన్ని అభ్యసించారు.

13 ఏళ్ల వయసులో గాంధీ, కస్తూర్బాను పెళ్లాడారు. అప్పుడు ఆమె వయసు 14 ఏళ్లు.
టీనేజ్లో గాంధీ మద్యం తాగేవారు. మాంసాహారం తినేవారు. మహిళలతో తాత్కాలిక లైంగిక సంబంధాల కోసం ప్రయత్నిస్తుండేవారు. ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ, వ్యక్తిగా తనను తాను మెరుగుపరచుకోవాలనే ఆసక్తీ ఆయనలో ఉండేది. తప్పు చేసిన ప్రతిసారీ పశ్చాత్తాప పడేవారు.
తండ్రి మరణశయ్యపై ఉన్నప్పుడు గాంధీ అక్కణ్నుంచి వెళ్లి భార్యతో శృంగారంలో పాల్గొన్నారు. తండ్రి కన్నుమూసినప్పుడు గాంధీ ఆయన పక్కన లేరు.
కస్తూరిబా గర్భం దాల్చి, శిశువు పుట్టి వెంటనే చనిపోగా, దీనిని దేవుడు తనకు విధించిన శిక్షగా గాంధీ భావించారు.

1888-లండన్లో న్యాయవిద్య

బొంబాయిలోని భావ్నగర్ కాలేజిలో చదవడంపై గాంధీ సంతోషంగా లేరు. లండన్లోని ఇన్నర్ టెంపుల్లో న్యాయవిద్య చదివే అవకాశం లభించింది.
విదేశాలకు వెళ్లొద్దని, వెళ్తే నిన్ను వెలివేసినవాడిగా చూస్తారని ఆయన కులానికి చెందిన పెద్దలు ఆయన్ను వారించారు.
వారి మాటలను గాంధీ పక్కనబెట్టి లండన్ వెళ్లిపోయారు. అక్కడ పాశ్చాత్య వస్త్రాలు కూడా ధరించారు. శాకాహార ఉద్యమంలో, థియోసాఫికల్ సొసైటీలో తన లాంటి ఆలోచనలే ఉన్నవారు ఆయనకు తారసపడ్డారు.
ఆయన తిరిగి చిన్ననాటి సంప్రదాయ హిందూ సూత్రాల వైపు మళ్లడంలో వీటి పాత్ర ఉంది. ఆ సూత్రాలు- శాకాహారం, మద్యం తీసుకోకపోవడం, లైంగిక నిగ్రహం. ఈ సొసైటీ ప్రభావంతో మనుషులందరి మధ్య, అన్ని మతాల మధ్య ఐక్యత సాధనకు ఆయన సొంత ఆలోచనలు చేశారు.

1893: దక్షిణాఫ్రికాకు ప్రయాణం

బ్రిటన్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు గాంధీ భారత్కు చేరుకున్నారు.
తొలి కేసులో ఓడిపోయారు. దీంతో ఒక బ్రిటన్ అధికారి తన కార్యాలయంలో విధుల నుంచి ఆయనను తొలగించారు.
ఆ అవమాన భారంతో ఉన్న గాంధీ, దక్షిణాఫ్రికాలో ఒక ఉద్యోగం వస్తే అందులో చేరారు. అక్కడ రైల్లో మొదటి తరగతిలో ప్రయాణిస్తున్న గాంధీని శరీరం రంగు ప్రాతిపదికగా అందులోంచి గెంటేశారు.
దక్షిణాఫ్రికాలో భారత వలసదారుల పట్ల శ్వేతజాతీయుల తీరుతో కలత చెందిన గాంధీ వారు ఎదుర్కొంటున్న వివక్షపై పోరాడేందుకు, అహింసా విధానం ‘సత్యాగ్రహం’తో ఉద్యమించేందుకు నాటల్లో ‘ఇండియన్ కాంగ్రెస్’ ఏర్పాటు చేశారు.
ఆ కాలంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన కీలక పరిణామాలు
- 1895-1899: విన్స్టల్ చర్చిల్ 1895 ఫిబ్రవరిలో ‘ఫోర్త్ క్వీన్స్ ఓన్ హుస్సార్స్’ అశ్విక దళంలో అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
- 1896లో తన రెజిమెంట్తో ఆయన భారత్ చేరుకున్నారు. 1898లో సూడాన్లో పోరాడారు.
- 1909: ఆల్బర్ట్ ఐన్స్టీన్కు యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్లో ప్రొఫెసర్గా అవకాశం లభించింది.
- 1900: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ ఎంపీగా ఎన్నికయ్యారు.



1883లో గాంధీ చిత్రం
1883లో గాంధీ చిత్రం
1914: దక్షిణాఫ్రికా: భారతీయుల పౌరహక్కుల కోసం పోరాటం... విజయం

దక్షిణాఫ్రికాలో భారత సంతతి ప్రజలపై మూడు పౌండ్ల పన్ను విధింపునకు వ్యతిరేకంగా 1913లో గాంధీ సమ్మె నిర్వహించారు.
భారత ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, గనుల్లో పనిచేసేవారికి ఆయన తొలిసారిగా నాయకత్వం వహించారు.
సుదీర్ఘ కాలం ఆందోళనలు సాగించిన గాంధీ, శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా నాటల్ నుంచి ట్రాన్స్వాల్ వరకు 2,021 మందితో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.
అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆయనకు తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. మరోవైపు ఆయన ప్రారంభించిన సమ్మె వ్యాప్తి చెందింది.
ఈ ఒత్తిడికి బ్రిటన్ తలొగ్గి, భారత సంతతి వారిపై విధించిన పన్నును ఉపసంహరించుకొని, గాంధీని విడుదల చేయాల్సి వచ్చింది. గాంధీ విజయంపై ఇంగ్లండ్లో వార్తాకథనాలు వచ్చాయి. ఆయన అంతర్జాతీయ ప్రముఖుడిగా మారడం మొదలైంది.
1915: భారత్కు తిరిగి వచ్చిన గాంధీ

నాడు అవమాన భారంతో భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లిన గాంధీ, సగర్వంగా దేశానికి తిరిగి వచ్చారు. భారత్ చేరుకున్నాక రైల్లో మూడో తరగతిలో తాను, తన భార్య కస్తూరిబాా దేశమంతా పర్యటించాలని గాంధీ నిర్ణయించారు.
ఆయన ఆ పర్యటనలో అసాధారణ రద్దీని, పేదరికాన్ని చూసి ఆయన చలించిపోయారు. సామాన్యులు, బలహీన వర్గాల కోసం కృషి చేయాలని సంకల్పించారు.
ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు బ్రిటిష్ పాలకులు అనుమానించిన ఎవరినైనా అరెస్టు చేసేందుకు వీలు కల్పించే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరసనకు గాంధీ పిలుపునిచ్చారు.
దీనికి స్పందించి అనేక నగరాల్లో వేలు, లక్షల సఖ్యలో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఇవి హింసాత్మకంగా మారాయి.
పంజాబ్లోని అమృత్సర్లో జనరల్ డయ్యర్ 20 వేల మంది నిరసనకారులపై కాల్పులు జరిపించారు.
దాదాపు 400 మంది చనిపోయారు. 1,300 మంది గాయపడ్డారు. ఈ ఊచకోత అనంతరం, గాంధీ భారత స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు.

1921: భారత స్వాతంత్ర్య పోరాటం

గాంధీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్)కు ఆయనే ప్రధాన గొంతుక అయ్యారు. బ్రిటన్ నుంచి రాజకీయ స్వాతంత్ర్యం కోసం ఆయన ఉద్యమించారు.
ఉన్నత వర్గాల గ్రూపుగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను సామాన్య ప్రజల పార్టీగా గాంధీ మార్చారు. పరమత సహనం, అన్ని మతవిశ్వాసాల పట్ల గౌరవం ప్రాతిపదికగా స్వేచ్ఛా భారత్ సాకారం కావాలని ఆయన కోరుకున్నారు.
అహింసా పోరాటాలకు గాంధీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ వర్గాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరూ స్పందించారు. పెద్దయెత్తున వీటిలో పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ చేయాలని ప్రజలకు గాంధీ పిలుపునిచ్చారు. బ్రిటిష్ ఉత్పత్తుల బహిష్కరణ ఇందులో భాగం.
సహాయ నిరాకరణకు పిలుపు ఇచ్చినందుకు రాజద్రోహం అభియోగాలపై గాంధీని బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. ఆయన్ను రెండేళ్లు జైల్లో పెట్టారు.
“నా వస్త్రధారణ అత్యంత సహజంగా ఉంటుంది. భారతీయుడికి ఇది చాలా బాగా నప్పుతుంది. అందుకే నేను ఈ దుస్తులు ధరిస్తాను.” - గాంధీది కపటత్వమంటూ ఒక పత్రిక రాసిన వ్యాసంపై గాంధీ స్పందన

1930: ఉప్పు సత్యాగ్రహం

గాంధీ ఉద్యమాన్ని విస్మరించలేని స్థితికి బ్రిటన్ చేరుకుంది. దీంతో, భారత్ భవిష్యత్తుపై చర్చించేందుకు లండన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారతీయులెవరినీ ఈ చర్చలకు ఆహ్వానించలేదు.
ఇది గాంధీకి ఆగ్రహం తెప్పించింది.

బ్రిటిష్ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా గాంధీ ఉప్పు సత్యాగ్రహం యాత్ర (దండి యాత్ర) చేపట్టారు. భారతీయులు ఉప్పు సేకరించకుండా, అమ్మకుండా ఈ చట్టాలు నిషేధించాయి. భారీగా పన్నులు వేసిన బ్రిటిష్ ఉప్పునే కొనక తప్పని పరిస్థితిని భారతీయులకు కల్పించేలా ఈ చట్టాలు ఉన్నాయి.
గాంధీ వేల మందితో సముద్ర తీరానికి ఈ యాత్రను చేపట్టారు. అక్కడ నిరసనకారులు ఉప్పు నీటిని మరిగించి బ్రిటిష్ చట్టాలకు విరుద్ధంగా ఉప్పు తయారు చేశారు.

ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో సరోజినీ నాయుడుతో గాంధీ
ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో సరోజినీ నాయుడుతో గాంధీ
గాంధీని బ్రిటిష్ అధికారులు అరెస్టు చేశారు. ఉద్యమం తీవ్రతరం అయ్యింది. వేల మంది పన్నులు, శిస్తు చెల్లించేందుకు నిరాకరించారు.
బ్రిటిష్ పాలకులు దిగొచ్చారు. బ్రిటన్ ఆహ్వానం మేరకు, లండన్లో ఏర్పాటైన సమావేశంలో పాల్గొనేందుకు గాంధీ వెళ్లారు.
“దీనితో నేను బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలిస్తున్నా.”
- గుప్పెట్లో ఉప్పు పట్టుకొని, నిరసనకారులనుద్దేశించి గాంధీ చేసిన వ్యాఖ్య
1931: లండన్ రౌండ్ టేబుల్ సమావేశం

భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు గాంధీ లండన్కు వెళ్లారు.
భారత సంప్రదాయ దుస్తులు ధరించి ఆయన ఇందులో పాల్గొన్నారు. తద్వారా ఒక బలమైన సందేశాన్ని పంపారు. గాంధీకి మాత్రం ఈ సమావేశం ఒక వైఫల్యమే.
భారత్కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు నాడు బ్రిటన్ సిద్ధంగా లేదు. ముస్లిం, సిక్కు ప్రతినిధులు, ఇతర ప్రతినిధులు గాంధీకి మద్దతు ఇవ్వలేదు.
ఆయన భారతీయులందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తారనే నమ్మకం వారికి లేకపోవడమే దీనికి కారణం.
గాంధీ బ్రిటన్ పర్యటనలో నాటి రాజు జార్జ్-5తో సమావేశమయ్యారు. లాంకషైర్లో మిల్లుల్లో పనిచేసే కార్మికులను ఆయన కలుసుకున్నారు.
ఈ కార్యక్రమాలతో ఆయనకు చాలా ప్రచారం లభించింది. భారత జాతీయోద్యమ ఉద్యమానికి బ్రిటన్లో సానుభూతి లభించింది.
“విద్రోహపూరిత న్యాయవాది అయిన గాంధీ ఒక ఫకీరులా కనిపించాలని చూస్తున్నారు. ఇది చూస్తుంటే ఆందోళన, వికారం కలుగుతున్నాయి.”
- విన్స్టన్ చర్చిల్, 1930

1942: ‘క్విట్ ఇండియా’ ఉద్యమం

లండన్ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన తరువాత, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని గాంధీ నిర్ణయించుకున్నారు.
నాజీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ చర్చిల్ భారత్కు పిలుపునిస్తే, గాంధీ అందుకు అంగీకరించలేదు.
భారతీయులు తమ సొంత ఇంటిలోనే అణచివేతకు గురవుతున్న తరుణంలో, బ్రిటన్కు భారత్ మద్దతు ఇవ్వదని గాంధీ తేల్చిచెప్పారు. బ్రిటిష్ వారు భారత్ను విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ "క్విట్ ఇండియా" పేరుతో గాంధీ శాంతియుత నిరసనను ప్రారంభించారు.
దాంతో ఆయన్ను, ఆయన సతీమణి కస్తూర్బా గాంధీని బ్రిటిష్ పాలకులు జైలులో పెట్టారు. గాంధీని విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. అయినా, విన్స్టన్ చర్చిల్ వారిని విడుదల చేసేందుకు అంగీకరించలేదు.
1944లో గాంధీ విడుదలవడానికి కొన్ని నెలల ముందు, ఆయన సతీమణి జైలులోనే తుదిశ్వాస విడిచారు.
“భారత దేశాన్ని విడిపించుకుంటాం, లేదంటే ఆ ప్రయత్నంలో చనిపోతాం; ఈ బానిసత్వాన్ని చూసేందుకు బతకలేం” – క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభానికి ముందు గాంధీ

1947: భారత్కు స్వాతంత్ర్యం వచ్చింది

స్వేచ్ఛ కోసం అంతకంతకూ పెరిగిపోతున్న ఉద్యమాలను ఆపలేక, బ్రిటిష్ పాలకులు చివరకు భారత్కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు చర్చలు ప్రారంభించారు.
కానీ, ఫలితం గాంధీ ఆశించిన దానికి చాలా భిన్నంగా ఉంది. మతపరమైన అంశాల ఆధారంగా భారత్, పాకిస్తాన్ రెండు కొత్త స్వతంత్ర దేశాలు ఏర్పాటు చేయాలని మౌంట్ బాటన్ సిఫార్సు చేశారు.
రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య సంబరాలు మిన్నంటాయి. కానీ, గాంధీ కలలుకన్న ఐక్య భారత్ సాకారం కాలేదు.
దేశ విభజన అంశం సరిహద్దుకు ఇరువైపులా లక్షల మంది హత్యలకు, కోటి మంది వలసలకు దారితీసింది. నిరాహార దీక్ష చేపట్టి శాంతిని నెలకొల్పేందుకు గాంధీ దిల్లీ నుంచి కలకత్తా వెళ్లారు.
1948: మహాత్ముడి మరణం

దేశ విభజన అంశం హింసను మరింత పెంచింది. కోల్కతా నుంచి గాంధీ దిల్లీ వచ్చారు. భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్న ముస్లింలకు రక్షణగా నిలిచేందుకు, ముస్లింల హక్కులను కాపాడేందుకు ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు.
బిర్లా హౌజ్లో ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా గాంధీపై హిందూ అతివాది దాడి చేశారు. గాంధీ ఛాతీ భాగంలో మూడు రౌండ్లు కాల్చారు.
బాధాకరమైన విషయం ఏమిటంటే, కొందరు హిందూ అతివాదులు గాంధీ మరణాన్ని వేడుకగా జరుపుకున్నారు. కానీ, అధిక శాతం మంది భారతీయులకు అదొక జాతీయ విషాదం.
గాంధీ అంతిమయాత్రలో దాదాపు పది లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. యమునా నది తీరంలో అంత్యక్రియలు జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు గాంధీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“చావు బతుకుల మధ్య పోరాటంలో జీవితం కొనసాగుతుంది. సత్యం, అసత్యం మధ్య పోరాటంలో సత్యం గెలుస్తుంది. చీకటి మధ్యలో, కాంతి విరజిమ్ముతుంది” - గాంధీ

స్క్రిప్ట్: ప్రొఫెసర్ డేవిడ్ హార్డిమన్, చరిత్రకారుడుష
షార్ట్హ్యాండ్ - పవన్ సింగ్ అతుల్
ఫొటోలు - గెట్టీ ఇమేజెస్
బొమ్మలు- నిఖితా దేశ్పాండే