ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు?

ఫొటో సోర్స్, facebook/lokesh
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ప్రభంజనంలో కొందరు టీడీపీ మంత్రులూ కొట్టుకుపోయారు.
ముగ్గురు నలుగురు మినహా మిగిలిన మంత్రులెవరూ విజయం సాధించలేకపోయారు. చంద్రబాబునాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు.
అక్కడ ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, facebook/ganta srinivasarao
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళావెంకటరావుదీ అదే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ గెలుపు అందుకున్నారు.
విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించగా.. నర్సీపట్నం నుంచి పోటీ చేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓటమి పాలయ్యారు.
టెక్కలి నుంచి బరిలోకి దిగిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించగా.. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్రకు ఓటమి తప్పలేదు.
వీరి పరిస్థితి ఏమిటి?
మంత్రుల్లో కేఈ కృష్ణమూర్తి ఈసారి పోటీ చేయలేదు. ఆయన స్థానంలో కుమారుడు శ్యాంబాబు పోటీ చేశారు. ఆయన వెనుకంజలో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కూడా ఈసారి పోటీలో లేరు. ఆమె స్థానంలో పోటీ చేసిన కుమారుడు శ్రీరామ్ కూడా వెనుకంజలోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- 'ఈవీఎం ధ్వంసం'పై జనసేన అభ్యర్థి బీబీసీతో ఏమన్నారంటే..
- తెలంగాణలో ఒక్క లోక్సభ స్థానానికి 480 మంది అభ్యర్థులు
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








