అలోక్వర్మ పిటిషన్పై సుప్రీంకోర్టు: సీబీఐ వివాదంపై సీవీసీ విచారణ.. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
భారత్ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు(శుక్రవారం) సీబీఐ వివాదంలో విచారణ జరిపింది.
చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం జోసెఫ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
మొదటి పిటిషన్ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వేశారు. తనను బలవంతంగా సెలవుపై పంపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సవాలు చేశారు.
ఇదే కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎన్జీవో 'కామన్ మ్యాన్' ద్వారా మరో పిటిషన్ వేశారు. అవినీతి కేసులో నిందితుడు రాకేశ్ అస్థానాను వెంటనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని, ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరారు.
కాగా, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అలోక్వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షించనున్నారు.
కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమితులైన నాగేశ్వరరావు ఈలోపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, ఆయన సాధారణ (రొటీన్) కార్యకలాపాలు మాత్రమే చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డు కవరులో తమకు అందించాలని ఆదేశించింది.
ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటివరకూ ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది. ఈ టైమ్ లైన్ ఒకసారి చూద్దాం:

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 15
- సీబీఐ లంచం ఇచ్చిన ఒక కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో కుట్ర చేశారని, లంచం తీసుకున్నారని తమ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపైనే ఆరోపణలు చేసింది.
- హైదరాబాద్ వ్యాపారి సతీష్ బాబు ఫిర్యాదుతో సీబీఐ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
- మొయిన్ ఖురేషీ కేసులో తనపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేసేందుకు 3 కోట్లు లంచం ఇచ్చానని సతీష్ బాబు ఆరోపించారు.
- తను దుబైలో ఉన్న ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ సాయంతో ఈ లంచం రాకేశ్ అస్థానా వరకూ చేర్చానని సతీష్ బాబు వాదిస్తున్నారు.
- సతీష్ బాబుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు దానికి రాకేశ్ అస్థానా నేతృత్వం వహిస్తున్నారు.
- అక్టోబర్ 15న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్, దుబయిలో ఉంటున్న మనోజ్ ప్రసాద్, ఆయన సోదరుడు సోమేశ్వర్ ప్రసాద్ పేర్లు కూడా చేర్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 16
- సీబీఐ లంచం కేసులో మధ్యవర్తిగా ఆరోపిస్తున్న మనోజ్ ప్రసాద్ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
- మనోజ్ ప్రసాద్ను అక్టోబర్ 25 వరకు పోలీసుల అదుపులో ఉంచుతామని, ఆయన్ను విచారిస్తామని సీబీఐ చెప్పింది.
- మనోజ్ ప్రసాద్ తనకు సీబీఐలో చాలా మంది పెద్ద వాళ్లు తెలుసని, ఈ దర్యాప్తు ఆగిపోయేలా చేయగలనని అన్నాడని సీబీఐ తమ ఎఫ్ఐఆర్లో తెలిపింది.
అక్టోబర్ 20
- సీబీఐ మేజిస్ట్రేట్ ఎదుట ప్రధాన ఫిర్యాదిదారు సతీష్ బాబు వాంగ్మూలం నమోదు చేసింది.
- సీబీఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మొయిన్ ఖురేషీ కేస్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ కేసులో ఒక సాక్షి అయిన సతీష్ బాబు పేరిట సమన్లు జారీ చేశారు.
- సతీష్ బాబుకు మొయిన్ ఖురేషీ కేసులో ఉపశమనం అందించేందుకు తమ అధికారులు లంచం తీసుకున్నారని సీబీఐ చెబుతోంది.
- అదే రోజు మధ్యాహ్నం తర్వాత సీబీఐ దేవేంద్ర కుమార్ ఇంట్లో, సీబీఐ భవనంలోని ఆయన ఆఫీసులో సోదాలు చేసింది. కొన్ని కీలక పత్రాలు సీజ్ చేసినట్టు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Pti
అక్టోబర్ 22
- దర్యాప్తుకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలో సీబీఐ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ను అరెస్టు చేశారు.
- సతీష్ బాబు కల్పిత వాంగ్మూలం సృష్టించారని, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అస్థానా చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాలని దేవేంద్ర కుమార్ ప్రయత్నించారని ఆరోపించారు.
- దీని ఆధారంగా సీబీఐ తమ ఎఫ్ఐఆర్లో దేవేంద్ర కుమార్ను 2వ నిందితుడుగా, రాకేష్ అస్థానాను 1వ నిందితుడుగా పేర్కొంది.
- అలోక్ వర్మ కూడా సతీష్ బాబు నుంచి రెండు కోట్ల లంచం తీసుకున్నారని రాకేశ్ అస్థానా ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 23
- సీబీఐ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ రాకేశ్ అస్థానా, దేవేంద్ర కుమార్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
- నిందితులైన ఇద్దరు అధికారులు సీబీఐ హెడ్ క్వార్టర్స్లో కూచుని దర్యాప్తు నుంచి ఊరట ఇచ్చినందుకు బదులుగా డబ్బు వసూలు చేసే ఒక రాకెట్ నడిపించారని సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
- కోర్టుకు హాజరు పరిచిన తర్వాత దేవేంద్ర కుమార్ను కోర్టు ఏడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
- దిల్లీ హైకోర్టు అస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయకపోయినా, కొన్నిరోజులపాటు ఆయన అరెస్టును నిలిపివేసింది.
- రాత్రి 9 గంటలకు డైరెక్టర్ అలోక్ వర్మ ఒక ఆర్డర్ ద్వారా స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా అన్ని బాధ్యతలు తిరిగి తీసేసుకున్నారు. ఆయన తన ఆదేశాల్లో "అవినీతి కేసుల్లో దర్యాప్తు ఎదుర్కుంటున్న ఒక అధికారికి, కార్యాలయంలో కీలక బాధ్యతలు ఇవ్వలేం" అన్నారు.
- కాసేపటి తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనపై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో సహకరించడం లేదని సీవీసీ ఒక ఆర్డర్ జారీ చేసింది.
- భారత ప్రభుత్వ 'డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్'(డీఓపీటీ) అర్థరాత్రి రెండు ఆదేశాలు ఇచ్చింది. రాకేశ్ అస్థానాతోపాటు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను కూడా సెలవుపై పంపించింది.
- సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్గా నియమిస్తున్నట్టు డీవోపీటీ కేబినెట్ ఆఫ్ అపాయింట్మెంట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
- సీబీఐ వివరాల ప్రకారం అర్థరాత్రి సుమారు రెండు గంటల సమయంలో నాగేశ్వరరావు సీబీఐ, సీజీవో కాంప్లెక్స్లోని హెడ్ క్వార్టర్స్ చేరుకుని సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మ కార్యాలయం సీల్ చేయించారు.
- రావ్ బాధ్యతలు తీసుకోగానే ఏజెన్సీలోని 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో అస్థానా లంచం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 24
- సెలవుపై పంపించడానికి వ్యతిరేకంగా అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ స్వాతంత్రంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం తనను హఠాత్తుగా తొలగించడం కుదరదని చెప్పారు.
- ప్రభుత్వాన్ని సమర్థించిన ఆర్థిక మంత్రి జైట్లీ "ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం మూడో వ్యక్తి అవసరం ఉంది. దర్యాప్తు పూర్తి చేసేవరకూ అధికారులిద్దరినీ విధులకు దూరంగా ఉంచుతామని అన్నారు.
- దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ మోదీ ప్రభుత్వం సీబీఐ చీఫ్ అలోక్ వర్మను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపించారు. ఆయన్ను సెలవుపై పంపించడం సుప్రీంకోర్టును అవమానించడమే అన్నారు.
- అలోక్ వర్మ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 25
- సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపించినప్పుడు ఆయన దగ్గర ఏడు ముఖ్యమైన కేసులు ఉన్నాయని 'ఇండియన్ ఎక్స్ప్రెస్' ఒక వార్తను ప్రచురించింది. వీటిలో రఫేల్ డీల్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లంచం తీసుకున్న కేసులు, బొగ్గు గనుల కేటాయింపుల కేసులు ఉన్నాయని తెలిపింది.
- బీబీసీతో మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి "నరేంద్ర మోదీ అందరినీ సీబీఐ కర్ర చూపించి భయపెట్టడం చాలా ఆందోళనకరమైన విషయం. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని" ఆరోపించారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ "సీబీఐ డైరెక్టర్ పదవిలోకి రావడం లేదా తొలగించడానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఉండడం తప్పనిసరి. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత అందులో ఉండాలి. రాత్రి 2 గంటలకు సీబీఐ డైరెక్టర్ ను తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టే" అన్నారు.
- "సీబీఐ ఇమేజ్, విశ్వసనీయతకు మేం మచ్చ రానీయం. సీబీఐ ఇమేజ్ పాడైతే, చాలా ముఖ్యమైన కేసులపై దాని ప్రభావం పడుతుంది" అని సీబీఐ ప్రతినిధి అన్నారు.
ఇవికూడా చదవండి:
- దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి?
- జగన్పై దాడి బీజేపీ ఆడిస్తున్న ఆట - చంద్రబాబు
- జగన్పై దాడి: కుట్ర ఉందన్న వైసీపీ, బీజేపీ.. విచారణ జరిపిస్తున్నామన్న హోం మంత్రి
- వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి: శ్రీనివాస రావు ఎవరు? ఎందుకు దాడి చేశాడు?
- బెంగళూరులోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయంపై ఈడీ దాడులు
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








