అఫ్గానిస్తాన్: ఖాళీ చేయడానికి డెడ్లైన్ 7 రోజులే.. అమెరికాపై పెరుగుతున్న ఒత్తిడి

ఫొటో సోర్స్, AFP
తాలిబాన్ మిలిటెంట్ల పాలనలోని అఫ్గానిస్తాన్ను ఖాళీ చేయడానికి, ఆ దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వారిని తీసుకురావడానికి మరింత గడువు కోసం అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది.
తాలిబాన్లతో ఒప్పందం ప్రకారం, అమెరికా దళాలు ఆగష్టు 31లోపు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలి. ఈ గడువును మరింత పొడిగించేలా, తరలింపును జాప్యం చేయాలని అమెరికాను దాని మిత్ర దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
మంగళవారం జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందు అఫ్గాన్ లో గడువును మరింత పెంచడంపై ఫ్రాన్స్, యూకే, జర్మనీలు దృష్టిసారించాయి.
ఉపసంహరణకు గడువు పొడిగించాలా వద్దా అనే విషయాన్ని వచ్చే 24 గంటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించబోతున్నారని ఒక అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ఏదైనా పొడిగింపు అంటే ఇప్పటికే అంగీకరించిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తాలిబాన్లు బీబీసీకి చెప్పారు. ఇంకా దళాలు మిగిలి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అఫ్గాన్ రాజధాని కాబుల్ నుంచి వేలాది మంది ప్రజలను తరలించారు. కానీ పారిపోవడానికి ప్రయత్నించిన మరికొందరు నగరంలోని విమానాశ్రయంలో, సమీప ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాబుల్ విమానాశ్రయం అమెరికా దళాలు, దాని మిత్రదేశ సైన్యాల రక్షణలో ఉంది.
ప్రత్యేకించి విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1996 నుండి 2001 వరకు తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు వారు విధించిన కఠినమైన శిక్షలకు భయపడి వీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
"ఆగస్టు 31న అమెరికా విధించిన గడువు గురించి మేము ఆందోళన చెందుతున్నాము. కొనసాగుతున్న కార్యకలాపాలను పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరం" అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్ యూఏఈలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
తాలిబాన్లతో గడువుకు మించి కాబూల్ విమానాశ్రయాన్ని తెరిచి ఉంచడంపై నాటో మిత్రదేశాలు చర్చించినట్లు జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ చెప్పారు.
యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. ఇతర జీ7 నాయకులతో మంగళవారం వర్చువల్ సమ్మిట్ సమయంలో పొడిగింపు కోసం అమెరికాపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.
యూకే రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ మాట్లాడుతూ "ఉపసంహరణను అమెరికా పొడిగిస్తుందో లేదో చూసి, గడువు పెంచాల్సిన ఆవశ్యకతని ప్రధాన మంత్రి వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా దళాలు లేకుండా కాబుల్ విమానాశ్రయంలో విదేశీ సైనికులను కొనసాగించలేమని యూకే తెలిపింది.
మంగళవారం నాడు ఏదోఒక నిర్ణయం తీసుకుంటేనే.. సైనికులు వారి పరికరాలు, ఆయుధాలతో పాటు తుది గడువులోపు బయలుదేరడానికి వీలుంటుందని అమెరికా సైన్య సలహాదారులు అధ్యక్ష కార్యాలయానికి స్పష్టం చేశారని సీఎన్ఎన్ వార్తాసంస్థ నివేదించింది.
గడువులోగా ఉపసంహరించుకోవాలని బైడెన్ అంగీకరిస్తే, ఈ వారం రోజుల్లో మరికొన్ని రోజులు మాత్రమే ప్రజలను తరలించే అవకాశం ఉందని, ఆ తర్వాత.. అంటే వారాంతంలో సైనిక దళాల విరమణ ప్రారంభమవుతుందని రక్షణ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం 5,800 మంది సైనికులు అక్కడ ఉన్నారన్నారు.
వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11:30, రాత్రి 23:30 మధ్య 10,900 మందిని కాబుల్ నుంచి తరలించారు.
ఆగస్టు 14న వేగంగా ఎయిర్లిఫ్ట్ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 48,000 మందిని తరలించడం కానీ, తరలింపులో సహాయం కానీ చేసిందని వైట్ హౌస్ పేర్కొంది.
వాషింగ్టన్ డాలస్ విమానాశ్రయంలో తీసిన ఫోటోలు అఫ్గాన్లు అమెరికాకు చేరుకున్నట్టు చూపుతున్నాయి.
పునర్నిర్మాణంలో భాగం కావాలని దేశంలోనే ఉన్న అఫ్గాన్లను తాలిబాన్లు కోరారు. గడువు ముగిసిన తర్వాత కూడా పాస్పోర్ట్లతో ప్రజలు వాణిజ్య విమానాల్లో బయలుదేరొచ్చని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ బీబీసీతో చెప్పారు.
"వారు దేశంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము, కానీ వారు వెళ్లాలని అనుకుంటే, అది వారి ఇష్టం" అని ఆయన అన్నారు.
దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ను తమ ఆదీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కాబుల్ ను ఆక్రమించిన తర్వాత అమెరికా ఎయిర్లిఫ్ట్ ప్రారంభించింది.
తాలిబాన్ల ఏలుబడిలోకి వెళ్లని ప్రాంతంగా పంజ్షీర్ ప్రాంతం మాత్రమే మిగిలి ఉంది.
అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద 9/11 దాడులు జరిగిన తర్వాత తాలిబాన్లను అమెరికా, దాని మిత్రరాజ్యాల సైనికులు తరిమికొట్టారు. ఆ తర్వాత వీరి మధ్య 20 సంవత్సరాల సుధీర్ఘ సంఘర్షణ జరిగింది.
ఇవి కూడా చదవండి:
- భారత్కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












