64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు

హెన్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హెన్రీ 1954లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ కనిపించకుండాపోయారు

దాదాపు 64 ఏళ్ల కిందట స్కీయింగ్ చేసే ఓ ఫ్రాన్స్ జాతీయుడు ఇటలీలో కనిపించకుండాపోయారు. ఆయన ఏమయ్యారో ఇటీవలే తెలిసింది.

'స్కీస్' అనే ప్రత్యేక పరికరాలను కాళ్లకు వేసుకుని మంచుపై సరదా కోసమో, పోటీ కోసమో ఆడే ఆటే స్కీయింగ్.

ఇటలీ వాయువ్య భాగంలో ఆవోస్టా అనే పర్వత ప్రాంతం ఉంది. ఇది ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో భాగం.

2005లో ఆవోస్టాలోని లోయ ప్రాంతంలో సముద్రమట్టానికి మూడు వేల మీటర్ల ఎత్తున, స్విట్జర్లాండ్ సరిహద్దులకు సమీపాన అస్థికలు, స్కీయింగ్ పరికరాలు, అద్దాలు దొరికాయి.

అవి ఎవరివో అధికారులు కనుక్కోలేకపోయారు. మృతుడిని గుర్తించలేకపోయారు. తమ వద్ద ఉన్న వివరాలను గత నెల్లో సోషల్ మీడియాలో ఉంచారు. ఈ సమాచారాన్ని ముఖ్యంగా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లలో బాగా వ్యాప్తి చేయాలని కోరారు.

స్కీలు

ఫొటో సోర్స్, www.poliziadistato.it

ఫొటో క్యాప్షన్, చెక్కతో తయారుచేసిన స్కీలు

ఈ సమాచారాన్ని చూసిన ఫ్రాన్స్‌లోని ఒక కుటుంబం స్పందిస్తూ- ఈ అద్దాలు తమ బంధువు హెన్రీ లే మాస్నేవి అని చెప్పింది. అధికారులు ఈ అద్దాలకు ఫోరెన్సిక్ పరీక్ష జరిపించారు.

అస్థికలు హెన్రీవేనేమోనని అనిపించే క్లూలు కొన్ని అధికారులకు లభించాయి. దొరికిన వస్త్రంపై పేరును సూచించేలా ఉన్న 'ఇనిషియల్స్', స్కీయింగ్‌లో ఉపయోగించే చెక్క 'స్కీలు', ఇతరత్రా ఈ సందేహాన్ని కలిగించాయి.

అస్థికలు ఇంచుమించు 1.75 మీటర్ల ఎత్తు ఉన్న దాదాపు 30 ఏళ్ల పురుషుడివి అయ్యుండొచ్చని అధికారులు నిర్ధరించారు.

సోషల్ మీడియాలో ఇటలీ అధికారులు పెట్టిన సమాచారాన్ని ఫ్రాన్స్ మీడియా తమ ఆడియన్స్‌కు చేరవేసింది. ఎమ్మా నసీమ్ అనే మహిళ స్థానిక రేడియో స్టేషన్ వార్తల్లో ఈ వార్త విన్నారు. గుర్తుతెలియని ఈ వ్యక్తి 1954 మార్చిలో ఆచూకీ తెలియకుండా పోయిన తమ అంకుల్ హెన్రీయేనా అనే సందేహం వ్యక్తంచేశారు.

నాడు మ్యాటర్‌హార్న్ పర్వతానికి సమీపంలో తుపానులో స్కీయింగ్ చేస్తూ హెన్రీ కనిపించకుండాపోయారు.

పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో గత నెల్లో ఉంచిన సమాచారం తెలుసుకున్న హెన్రీ తమ్ముడు రోజర్ తన సోదరుడి ఎత్తు, ఇతర వివరాలను వెల్లడిస్తూ సంబంధిత వ్యక్తులకు ఈమెయిల్ పంపారు. ఈమెయిల్ తర్వాత ఇటలీ పోలీసులకు చేరింది.

రోజర్‌కు ఇప్పుడు 94 ఏళ్లు.

హెన్రీ అవివాహితుడని రోజర్ తన ఈమెయిల్‌లో చెప్పారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించేవారని, పారిస్‌లో ఆర్థికశాఖలో పనిచేసేవారని తెలిపారు.

హెన్రీ కుటుంబం ఆయన ఫొటోను ఇటలీ పోలీసులకు పంపింది. ఫొటోలో ఉన్న కళ్లజోడు, అధికారులకు దొరికిన కళ్లజోడు సరిపోలాయి. అస్థికలకు అధికారులు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. ఆల్ప్స్ పర్వతాల్లో చనిపోయిన వ్యక్తి హెన్రీయేనని నిర్ధరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)