కరోనా లాక్‌డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు

రాధేరామ్

ఫొటో సోర్స్, RAGHORAM

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

"భయ్యా... భయం, ఆకలి.. ఎవరిలో ధైర్యం నింపవు చెప్పండి?''

ఈ మాట ఏ తత్వవేత్తదో, ఏదైనా సినిమా డైలాగో కాదు. హరియాణాలోని రోహ్‌తక్ నుంచి ఉత్తరప్రదేశ్‌, బలరాంపూర్‌ జిల్లాలోని తన గ్రామానికి చేరిన రాధేరామ్‌కు ఈ మాటే మంత్రంలా పనిచేసింది. సైకిల్‌పై తన భార్యను ఎక్కించుకుని 750 కిలోమీటర్ల దూరాన్ని అతడు ఐదు రోజుల్లో దాటేలా చేశాయి.

కరోనావైరస్ వ్యాపించకుండా హఠాత్తుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో హరియాణా నుంచి బలరాంపూర్‌ వెళ్లాల్సి వచ్చిన వేలమందిలో రాధేరామ్ ఒకరు.

కరోనావైరస్ భయం, లాక్‌డౌన్‌ కొనసాగినన్ని రోజులు ఎలా బతకాలనే ఆందోళన చివరికి సొంత ఊరికి చేరుకునేలా తనలో ధైర్యం నింపాయని రాధేరామ్ చెప్పారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
రాధేరామ్

ఫొటో సోర్స్, RAGHORAM

"మేం పనిచేస్తున్న కంపెనీ కొన్ని రోజుల ముందే మూతబడింది. కాంట్రాక్టరుకు ఫోన్ చేస్తే, మీకు ఎలాంటి సాయం చేయలేమని చెప్పేశారు. ఇక్కడే ఉంటే అద్దె ఇవ్వాలని ఇంటి ఓనర్ అన్నారు. రోహ్‌తక్‌లో మాకు తెలిసిన కొంతమంది సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. దాంతో మేం కూడా అక్కడి నుంచి వెళ్లడమే మంచిదనుకున్నాం. సొంత ఊరికి చేరుకుంటే కనీసం ఆకలితో చచ్చిపోం. ఎలాగోలా కడుపు నింపుకోవచ్చు అనుకున్నాం" అని రాధేరామ్ చెప్పారు.

రాధేరామ్ ఐదు నెలల క్రితం రోహ్‌తక్‌ వెళ్లారు. కాంట్రాక్టర్ ద్వారా నెలకు రూ.9 వేల జీతంతో ఆయనకు కొన్ని రోజుల ముందే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది.

మార్చి 27న ఉదయం ఆయన తన భార్యను సైకిల్ వెనక ఎక్కించుకుని రోహ్‌తక్‌ నుంచి బయల్దేరారు. నాలుగు రోజుల తర్వాత అంటే మార్చి 31 సాయంత్రం గోండా చేరుకున్నారు. అప్పుడే మొదటిసారి మేం ఆయనతో మాట్లాడాం. అప్పుడు ఆయన గోండా జిల్లా ఆస్పత్రిలో భార్యతో కలిసి చెకప్ చేయించుకుంటున్నారు.

రాధేరామ్

ఫొటో సోర్స్, RAGHORAM

రాధేరామ్

ఫొటో సోర్స్, RAGHORAM

జేబులో 120 రూపాయలతో ప్రయాణం

"రోహ్తక్ నుంచి మేం బయల్దేరినప్పుడు నా జేబులో 120 రూపాయలు ఉన్నాయి. రెండు సంచుల్లో కొన్ని బట్టలు నింపాం. వంట సామాన్లు తప్ప మా దగ్గర వేరే ఏం లేవు. మొదటిసారి సైకిల్లో వస్తున్నాం. అందుకే దారి కూడా తెలీదు. సోనిపట్ వరకూ దారితెలీక ఇబ్బందులు పడ్డాం. అక్కడక్కడ పోలీసులు ఆపేవాళ్లు. కానీ మా పరిస్థితి తెలుకున్న తర్వాత వెళ్లనిచ్చేవారు. సోనిపట్ తర్వాత హైవేపైకి చేరుకున్నాక ధైర్యం వచ్చింది. ఘాజియాబాద్, బరేలీ, సీతాపూర్, బహ్రాయిచ్ మీదుగా గోండా చేరుకున్నాం" అని రాధేరామ్ చెప్పారు.

మార్చి 31న గోండా జిల్లా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాత రాధేరామ్‌కు ఇంటికి వెళ్లడానికి అనుమతి లభించింది. ఆయన గ్రామం బలరాంపూర్ దగ్గర రెహ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. కానీ తన అత్తింటివారు గోండా జిల్లాలో ఉన్నారు. ఆరోజు చీకటి పడుతుండడంతో గోండాలో అత్తవారింటికి వెళ్లిపోయనని రాధేరాం చెప్పారు. తర్వాత రోజు భార్యతో కలిసి తన స్వగ్రామానికి చేరుకున్నారు.

రోహ్‌తక్ నుంచి బలరాంపూర్ వరకూ రోడ్డు మార్గాన వెళ్లాలంటే దాదాపు 750 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతకు ముందు సైకిల్‌పై అప్పుడప్పుడూ తన గ్రామం నుంచి బలరాంపూర్ వెళ్లానని, అంతకు మించి ఎక్కువ దూరం సైకిల్‌పై వెళ్లలేదని రాధేరాం చెప్పాడు.

కానీ, కరోనావైరస్ వల్ల మనసులో ఏర్పడిన భయం తనకు ఇంత దూరం సైకిల్ తొక్కే బలాన్ని ఇచ్చిందన్నాడు.

ఈ ఐదు రోజులూ రాధేరాం సైకిల్ తొక్కుతూనే ఉన్నానని, గంటకోసారి పది నిమిషాలు విశ్రాంతి తీసుకునేవాడినని చెప్పాడు.

"నాతో నా భార్య కూడా ఉంది. అందుకే వరసగా అలా తొక్కుతూనే ఉండడం సాధ్యం కాదు. రాత్రి రెండు గంటలపాటు విశ్రాంతి తీసుకునేవాళ్లం. అప్పుడప్పుడూ పెట్రోల్ పంపుల దగ్గర, మూసేసిన షాపుల బయట కాసేపు కూర్చుని మళ్లీ బయల్దేరేవాళ్లం" అన్నాడు.

సైకిల్ మీద 750 కి.మీ. ప్రయాణం

ఫొటో సోర్స్, RAGHORAM

తోడుగా నిలిచిన సైకిల్

రాధేరామ్ రోహ్‌తక్ నుంచి భార్యను తీసుకుని సైకిల్‌పై బయల్దేరాడు. కానీ ఆ దారిలో తనలాంటి వారు కొన్ని వందల మంది ఉన్నారని అతడికి తెలిసింది.

రాధేరామ్ భార్య సీమా "హైవేపై ఎక్కడ చూసినా మనుషులే కనిపించారు. కొందరు తలపై గోనెసంచి వేసుకుని వెళ్తుంటే, కొందరు బ్యాగులు తగిలించుకుని ఉన్నారు. ఒంటరిగా, గుంపులుగా వెళ్తూ కనిపించారు. వాళ్లను చూడగానే మా కష్టం మర్చిపోయాం. మా దగ్గర కనీసం సైకిల్ అయినా ఉంది, వాళ్లకు అది కూడా లేదే అనిపించింది. సైకిల్ లేకపోయుంటే, మేం కూడా నడిచే రావాల్సి వచ్చేది. అందరికీ మాకు వచ్చిన కష్టమే వచ్చింది" అని చెప్పింది.

రాధేరామ్ దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా, దారిలో తినడానికి కొన్ని తీసుకెళ్లారు. కానీ, సొంతూరికి వెళ్తున్న వారికి మార్గమధ్యంలో ఆహారం అసలు సమస్యే కాలేదు.

"దారిలో, అక్కడక్కడా జనం తినడానికి, తాగడానికి ఏదో ఒకటి ఇస్తూ కనిపించారు. అందుకే తిండి సమస్య రాలేదు. రోడ్డు మీద జనం కూడా చాలామందే కనిపించారు. కానీ సాయం అందించేవారు కూడా చాలామంది వచ్చారు. అందుకే ఎలాంటి సమస్య రాలేదు. కానీ దారిలో నడిచివెళ్తున్న కొందరిని పోలీసులు అడ్డుకున్నారు, కొందరిని కొట్టారు కూడా. మాకు అలాంటి ఇబ్బందులేవీ రాలేదు" అన్నాడు.

రాధేరామ్ చదువుకోలేదు. కొన్నేళ్ల క్రితం అతడికి పెళ్లైంది. రోహ్‌తక్ వెళ్లి ఎంతోకొంత సంపాదిస్తే తన జీవితం గడుస్తుందని, ఇంట్లోవాళ్లకు కూడా సాయంగా ఉండచ్చని అనుకున్నాడు. కానీ, కొన్ని నెలల క్రితం ఉద్యోగం కోసం ఏ ఊరిని వదిలి వెళ్లాడో ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోడానికి అతడు మళ్లీ అదే ఊరికి చేరాడు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)