తిరుమల టీటీడీ ఆలయంపై కరోనావైరస్ ప్రభావం ఎలా ఉంది?

ఫొటో సోర్స్, TTD
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ ప్రభావం ఆలయాల మీద కూడా కనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రాకపై ఇప్పటికే నియంత్రణ విధించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
అయితే.. పెద్ద సంఖ్యలో వస్తున్న యాత్రికులకు టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఏ మేరకు సరిపోతాయనే సందేహాలు వినిపిస్తున్నాయి. చెకింగ్ పాయింట్ల ఏర్పాటు, అవగాహన పెంచే ప్రచారం వంటివి నిర్వహిస్తున్నప్పటికీ రద్దీకి తగ్గట్టుగా సరిపోతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అందరికీ మాస్కూలు అందించాలని కొందరు భక్తులు కోరుతుంటే టీటీడీ యంత్రాంగం మాత్రం రోగులకు, వారి సహాయకులకు మాత్రమే మాస్కులు అవసరం అని చెప్తోంది. మరోవైపు.. తిరుమలకు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యాత్రికులపై ఆధారపడిన వివిధ రంగాల వారు సతమతమవుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది?
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో యాత్రికులు తిరుమలకు తరలివస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా యాత్రికుల సంఖ్య తగ్గింది. విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడం, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం కూడా రద్దీ తగ్గటానికి కారణాలుగా చెప్తున్నారు.
ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కొంత తగ్గుతుంది. ఈసారి ఇదే సీజన్లో భక్తుల సంఖ్య మరింతగా తగ్గినట్లు కనిపిస్తోంది.
''తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య జనవరి తర్వాత కొంచెం తగ్గుదల ఉంటుంది. ఏప్రిల్ నుంచి మే, జూన్ వరకూ క్రమంగా పెరుగుతుంది. జూన్ తర్వాత ఉత్తరాది నుంచి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జులై మధ్య వరకూ ఆ ప్రభావం ఉంటుంది'' అని టీటీడీ ప్రధాన పౌరసంబంధాల అధికారి డాక్టర్ టి.రవి బీబీసీకి చెప్పారు.
ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని.. భక్తుల సంఖ్య గతం కన్నా తగ్గిందని తెలిపారు. ''కరోనావైరస్ కారణంగా కొందరు యాత్రికులు ముందుగా చేసుకున్న రిజర్వేషన్లు కూడా రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వారు రిజర్వేషన్ వాయిదా వేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి టీటీడీ అనుమతిస్తోంది'' అని వివరించారు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యలో ప్రతీ వారం కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో అధికంగా భక్తుల సంఖ్య నమోదవుతుంది. అదే సమయంలో సోమవారం నుంచి గురువారం వరకూ ఆ సంఖ్యలో స్పష్టమైన తేడా ఉంటుందని టీటీడీ లెక్కలు చెప్తున్నాయి.


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


దర్శనం సులువుగా జరిగిపోతుంది..!
ఏటా మార్చి నెలలో సగటున 17 లక్షల నుంచి 18 లక్షల మంది తిరుమలకు వస్తుంటారు. ఈసారి తొలి పది రోజుల్లో 6,98,020 మంది తిరుమలకు వచ్చారు. సహజంగా ఏటా నమోదయ్యే సంఖ్య కనిపిస్తున్నప్పటికీ మార్చి రెండు, మూడు వారాల్లో కరోనావైరస్ కారణంగా మొత్తం సంఖ్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మార్చి 8 తర్వాత క్రమంగా భక్తుల సంఖ్య తగ్గగటంతో దర్శనాలు కూడా సులభంగా జరుగుతున్నాయని భక్తులు అంటున్నారు. గతంలో సాధారణ క్యూ లైన్లలో దర్శనం చేసుకోవడానికి పట్టిన సమయంలో ఇప్పుడు సగం సమయం సరిపోతోందని తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎ.సుదర్శన్ రెడ్డి బీబీసీకి తెలిపారు.
''గత ఏడాది తిరుమల వచ్చాను. అప్పుడు సుపథం దర్శనం చేసుకున్నాం. రూ. 300 టికెట్లు కొని దర్శనానికి వెళితే 2 గంటలు పట్టింది. ఇప్పుడు సర్వదర్శనం చేసుకున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యూ లైన్లోకి వెళితే మధ్యాహ్నం 1.30కి బయటకు వచ్చేశాం'' అని చెప్పారు.

తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు...
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం భక్తులకు అవగాహన పెంచటం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. భక్తుల రాకపోకలపై ఆంక్షలు కూడా విధించింది.
''తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించాం. అందుకు తగ్గట్టు యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం. టీటీడీలో వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది సిబ్బంది ఉన్నారు. వారికి జాగ్రత్తలు సూచించాం'' అని టీటీడీ జేఈఓ ఎ.ధర్మారెడ్డి బీబీసీకి తెలిపారు.
''విదేశాల నుంచి వచ్చే భక్తులు, తాజాగా విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన భారతీయులు కూడా ఈనెలాఖరు వరకూ తిరుమలకు రాకూడదని తెలియజేశాం. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారు కూడా దర్శనాల కోసం వచ్చేముందు పరీక్షలు చేయించుకోవాలి. మాస్కులు సహా తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాం'' అని చెప్పారు.
ముందుగా ఎవరైనా దర్శనాలకు సంబంధించి రిజర్వేషన్లు చేయించుకుని ఇప్పుడు యాత్ర రద్దు చేసుకుంటే రూ. 300 దర్శనం టికెట్ల సొమ్ము తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. అయితే శుక్రవారం వరకూ ఎవరూ రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు.

భక్తులకు కరోనావైరస్ లక్షణాల తనిఖీలు...
తిరుపతిలో కొండ దిగువ నుంచి తిరుమల రాకపోకలకు మూడు మార్గాలున్నాయి. వాటిలో అలిపిరి నుంచి ప్రారంభమయ్యే కాలినడకన వెళ్లే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గం, వాహనాలు వెళ్లేందుకు ఉన్న ఘాట్ రోడ్డు ఆరంభంలోని అలిపిరి టోల్ గేట్, అలిపిరి పాదాల వద్ద కూడా ప్రస్తుతం టీటీడీ ఆరోగ్య విభాగం చెకింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేసింది. థర్మల్ సెన్సార్ల ద్వారా భక్తులను పరీక్షిస్తోంది.
ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక ఎంఎన్ఓతో పాటు నర్సింగ్ విద్యార్థినులను ఈ చెక్ పాయింట్లలో విధులకు కేటాయించారు. కాలినడకన వెళ్లే వారు లేదా బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లే వారికి విడివిడిగా ఈ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
అయితే.. రోజుకి 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు వివిధ మార్గాల్లో తిరుమలకు వస్తుంటే కేవలం ముగ్గురు వైద్యులు, మరో ముగ్గురు స్టాఫ్ నర్సులను మాత్రమే పరీక్షలు చేయడానికి కేటాయించడంతో.. కొద్ది మందిని మాత్రమే తనిఖీ చేయటం సాధ్యమవుతున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా టీటీడీ ధర్మరథం బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళుతున్న వారికి కేవలం కరపత్రాలు పంచి సరిపెట్టుకుంటున్నారు. కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వస్తున్న కొద్ది మంది అనుమానితులను మాత్రమే పరీక్షిస్తున్నామని టీటీడీ అధికారులు కూడా చెప్తున్నారు.
Sorry, your browser cannot display this map

ఈ పరీక్షల్లో యాత్రికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేస్తున్నారు. ఎవరికైనా అసాధారణంగా ఉంటే వారిని రుయా అస్పత్రిలో 100 బెడ్లతో సిద్ధం చేసిన ఐసొలేషన్ వార్డుకి తరలిస్తామని చెప్తున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభించిన ఈ పరీక్షల్లో శనివారం మధ్యాహ్నం వరకూ కరోనావైరస్ లక్షణాలు ఉన్న వారు కనిపించలేదని టీటీడీ వైద్య సిబ్బంది తెలిపారు.
తిరుమలకు వచ్చే సమయంలోనే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు అవసరం అని భక్తులు చెప్తున్నారు. వేల మంది ఒక చోట చేరే సమయంలో ఒకరికి కరోనావైరస్ ఉన్నా సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని.. కాబట్టి మరిన్ని చర్యలు అవసరమని కోరుతున్నారు.
ఆలయ ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచేందుకు తగు చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని టీటీడీ ప్రధాన వైద్యాధికారి ఆర్.ఆర్.రెడ్డి బీబీసీకి తెలిపారు.
''మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు అన్నదానం ట్రస్ట్ , కళ్యాణ కట్ట, క్యూ లైన్లు సహా అన్ని చోట్లా అదనంగా సిబ్బందిని నియమించాం. ఎక్కువ రద్దీ ఉండే క్యూ కాంప్లెక్స్లో గతంలో 500 మందిని ఒక కంపార్ట్ మెంట్లో ఉంచేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 250కి తగ్గించాం. అవసరమైతే అదనంగా సిబ్బందిని నియమించి యాత్రికులకు పరీక్షలు నిర్వహిస్తాం'' అని ఆయన వివరించారు.

మాస్కులు పంపిణీ చేయాలని భక్తుల కోరిక.. అవసరం లేదంటున్న టీటీడీ వైద్యులు
ప్రస్తుతం తిరుమలకు వస్తున్న వారిలో కొంతమంది మాస్కులు ధరించి కనిపిస్తున్నారు.
''మా కుటుంబమంతా కలిసి తిరుమలకు రావాలని చాలాకాలం కిందటే అనుకున్నాం. ఇప్పుడు కరోనావైరస్ కారణంగా కొంత ఆందోళన కలిగింది. అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకూడదని నిర్ణయించుకున్నాం. ముందుగా చేసుకున్న రిజర్వేషన్లు కూడా రద్దు చేసుకుని సొంత వాహనంలో ఇక్కడికి వచ్చాం'' అని హైదరాబాద్కు చెందిన గ్రీష్మ అనే యాత్రికురాలు బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
''తిరుమల క్యూ లైన్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ దర్శనం పూర్తి చేసుకున్నాం. మా పిల్లలు మాస్కులు తీయకుండా జాగ్రత్త పడ్డాం. అందరూ జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్య ఉండకపోవచ్చు'' అని అభిప్రాయపడ్డరు.
కరోనావైరస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్న భక్తులు తగిన సంఖ్యలో మాస్కులు దొరకటం లేదని వాపోతున్నారు. ''తిరుమలకు తొలిసారి వచ్చాం. భక్తులు ఎక్కువగా ఉన్న సమయంలో మాస్కులు ధరించాలని అనుకున్నాం. కానీ అవి అందుబాటులో లేకపోవడంతో ఖర్చీఫ్లు కట్టుకుని తిరుగుతున్నాం'' అని కర్ణాటకకి చెందిన ఆర్.రమేష్ అనే భక్తుడు బీబీసీకి తెలిపారు.
''టీటీడీ అధికారులే చెకింగ్ పాయింట్లలో అందరికీ మాస్కులు అందించే ఏర్పాటు చేస్తే ఉపయోగం అనిపిస్తోంది. ఆలయ ప్రాంగణంలో అలాంటి అవసరం రాకూడదని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.
అయితే.. కరోనావైరస్ లక్షణాలు ఉన్నట్లు భావిస్తున్న వారు తప్ప అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం ఉండదని టీటీడీ వైద్య విభాగం డాక్టర్ కుసుమ కుమారి బీబీసీతో పేర్కొన్నారు. తనిఖీ చేసిన తర్వాత అవసరమైన వారందరికీ మాస్కులు వాడాలనే సూచనలు తామే చేస్తామని చెప్పారు. అందరికీ మాస్కులు అందించడం కూడా ఇప్పటికప్పుడు సాధ్యం కాదన్నారు.

రవాణా, హోటల్ వ్యాపారులపై ప్రభావం
తిరుమల దేవస్థానం ఆధారంగా తిరుమలతో పాటు దిగువన తిరుపతిలో కూడా ట్రాన్స్పోర్ట్, హోటల్ వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం భక్తుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్న కారణంగా తమ వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామని ఈ రెండు రంగాల వారు చెప్తున్నారు.
తిరుపతి నుంచి జీప్, ట్యాక్సీ, సుమో, మినీ బస్సులు సహా సుమారు 2,700 వాహనాలు నిత్యం కొండపైకి వెళుతూ ఉంటాయి. వాటిపై ఆధారపడి 8,000 మంది కార్మికులు ఉన్నారని తిరుపతి ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తెలిపారు.
''ఎయిర్ పోర్ట్ నుంచి కనీసం రానుపోనూ మూడు ట్రిప్పులు వేసేవాళ్లం. రోజుకి అన్ని ఖర్చులూ పోనూ రూ. 1,500 ఆదాయం వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక్క ట్రిప్పు వెళ్లి రావడమే గగనమైపోతుంది. ఇప్పుడు రూ. 500 కూడా రావడం లేదు. భక్తుల సంఖ్య బాగా తగ్గుతోంది. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తింది'' అని చెప్పారు.
హోటళ్లలో కూడా ఆక్యుపెన్సీ బాగా పడిపోయిందని సదరు అసోసేయేషన్ ప్రతినిధి రవీంద్రరెడ్డి తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మరింత తగ్గుతుందని ఆయన అంచనా వేశారు.
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- కరోనావైరస్ భయాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారు ?
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









