రాహుల్ గాంధీ వయనాడ్ కార్యాలయంపై దాడిని ఖండించిన సీతారాం ఏచూరి.. ఈ కేసులో ఎనిమిది మంది అరెస్టు

కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై శుక్రవారం జరిగిన దాడిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. ఈ కేసులో బాధ్యులైన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
“వయనాడ్లో జరిగింది తప్పు, మేం దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే ఖండించారు. బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
వయనాడ్లోని నిరసన ప్రదర్శనలలో 80 నుంచి 100 మంది SFI కార్యకర్తలు పాల్గొన్నారని, వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారని కేరళ పోలీసు శాఖ వెల్లడించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అసలేం జరిగింది?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కేరళలోని అధికార సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం SFI కార్యకర్తలు శుక్రవారం చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కొందరు ఆగ్రహంతో రాహుల్ గాంధీ కార్యాలయంలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ దాడికి కేరళ వామపక్ష ప్రభుత్వం, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలే కారణమని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. కేరళ ప్రభుత్వం గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించింది.
ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో, కొంతమంది జెండాలు పట్టుకుని వెనుక గోడ ఎక్కి కార్యాలయంలోకి ప్రవేశించినట్టు కనిపిస్తోంది. మరో వీడియోలో, కార్యాలయంలో ఉన్న వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టడం కనిపించింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా శుక్రవారం నాడు జరిగిన దాడిని ఖండించారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
