కరోనావైరస్‌: జపాన్‌లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?

జపాన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ ఆగస్ట్‌లో కోవిడ్ మహమ్మారి ఐదో వేవ్‌ను ఎదుర్కొంది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి చూస్తే అత్యధిక కేసులు ఈ వేవ్‌లోనే నమోదయ్యాయి. జపాన్‌లో రోజుకు దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయి.

అయితే, ఈ స్థాయిలో కేసులు పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన డెల్టా వేరియెంట్ కారణమైంది. దానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో, ఇది రోగానికి కారణమయ్యే మ్యుటేషన్లను మార్చుకుంటూ వెళ్లింది.

కానీ, అదే నెలలో జపాన్‌లో మరో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది.

అకస్మాత్తుగా కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. జపాన్ మాదిరిగానే వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసిన కొన్ని దేశాలు కొత్తగా తలెత్తుతున్న ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతుంటే, జపాన్ మాత్రం ఊపిరి పీల్చుకుంటోంది. నవంబరు 23 నాటికి దేశంలో రోజుకు 100కు పైగా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.

అయితే, డెల్టా వేరియెంట్ దానంతట అదే క్షీణించడమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది సాధ్యమేనా? ఇదే విధంగా ఇతర దేశాల్లో కూడా జరుగుతుందా?

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

రకరకాల కారణాలు

జపాన్‌లో ఒక్కసారిగా కేసులు తగ్గడం వెనుక చాలా వాదనలున్నాయి.

జపాన్‌లో 75 శాతం పైగా జనాభా వ్యాక్సీన్ వేయించుకున్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కుల వాడకం లాంటి కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం కూడా ఓ కారణమని, అందుకే ఇది సాధ్యమైందని జాతీయ మీడియా నివేదిక చెబుతోంది.

కానీ, ఇలాంటి చర్యలను పాటిస్తున్న ఇతర దేశాల్లో మాత్రం కేసుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది.

ఉదాహరణకు, స్పెయిన్‌లో 80% జనాభా వ్యాక్సీన్ వేయించుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలో కూడా మాస్కులను వాడుతున్నారు. అయినప్పటికీ, జపాన్‌లో మూడో వంతు జనాభా ఉన్న స్పెయిన్‌లో నవంబర్‌ 23 నాటికి 7000 కేసులు నమోదయ్యాయి.

జపాన్ శాస్త్రవేత్తలు చేసిన కొన్ని జన్యుపరమైన పరిశీలనలు ద్వారా డెల్టా వేరియంట్ దానంతట అదే మాయమైదనే వాదన వినిపించడానికి దారి తీశాయి.

"జపాన్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ ఇతర వేరియంట్‌ల కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కలిగి ఉంది. కానీ, మ్యుటేషన్లు పెరిగే కొద్దీ ఆ మ్యుటేషన్లలో తలెత్తే లోపాలు పెరిగి, రెట్టింపు అయ్యే అవకాశాన్ని కోల్పోతుందని శాస్త్రవేత్తలు భావించారు" అని జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త ఇటురో ఐనౌ 'ది జపాన్ టైమ్స్'తో చెప్పారు.

ఈ కేసుల సంఖ్య పెరగని దృష్ట్యా ఈ వైరస్ మ్యుటేషన్లు సహజంగా అంతమైనట్లు భావిస్తున్నామని ఆయన అన్నారు.

ఆయన చెప్పిన సిద్ధాంతం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

కొన్ని పశ్చిమ దేశాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తైన తర్వాత కూడా మళ్లీ కఠినమైన కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయవలసి వచ్చింది.

కానీ, జపాన్‌లో కేసులు మాత్రం వాటంతట అవే తగ్గుముఖం పట్టడం మొదలుపెట్టాయి. గత అక్టోబరులో కోవిడ్ నియంత్రణ చర్యలను సడలించినప్పటి నుంచి దేశంలో ట్రైన్లు, రెస్టారెంట్లు పూర్తిగా నిండిపోతున్నాయి.

జపాన్ లో రెస్టారెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

సాధారణ ప్రక్రియ

మహమ్మారి మొదలైనప్పటి నుంచి రకరకాల వైరస్‌లు పుట్టి మాయమవడం సాధారణంగా కనిపిస్తోంది.

"జంతు, మానవ వైరస్‌లలో ఇలా జరగడం సాధారణం. ఆల్ఫా, బీటా, గామా వేరియంట్‌లు ఇలాగే మాయమయ్యాయి" అని యూకేలో లీసెస్టర్ యూనివర్సిటీలో వైరాలజిస్ట్ జూలియన్ టాన్గ్ చెప్పారు.

"వైరస్ ప్రవర్తనలో మార్పు రావడానికి జపాన్ జనాభాలో ఉన్న రోగ నిరోధక శక్తి కూడా పాత్ర పోషించి ఉండవచ్చు. ఇలాగే మరో దేశంలో జరుగుతుందో లేదో కాలం మాత్రమే చెప్పగలదు" అని అన్నారు.

ఆసియా జనాభాలో రోగంతో పోరాడే అపోబ్‌సి3ఏ అనే ఎంజైమ్ ఉన్నట్లు గతంలో జరిగిన అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ ఎంజైమ్ కరోనా వైరస్‌తో కూడా పోరాడుతుందని చెప్పారు. ఇది ఆఫ్రికా, యూరోప్‌లోని జనాభాలో అంతగా కనిపించలేదు.

కోవిడ్ 19ను ఎదుర్కోగలిగే జనాభాను కనిపెట్టేందుకు జరుగుతున్న పరిశోధనలు

అయితే, ఈ ఎంజైమ్ కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోగలదేమోనని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, నిఘాతా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.

వీరు జపాన్‌లో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇన్ఫెక్షన్ సోకిన క్లినికల్ శాంపిళ్లలో డెల్టా, ఆల్ఫా వేరియంట్‌ల జన్యుపరమైన వైవిధ్యాన్ని పోల్చి చూస్తున్నారు.

"ఈ అధ్యయనం చేస్తున్న సమయంలో వైరస్ మ్యుటేషన్లు చెందుతూ, అవి అకస్మాత్తుగా ఆగిపోయి ప్రభావరహితంగా తయారైనట్లు గమనించారు. దీంతో వైరస్ రూపాంతరం చెందడం ఆగిపోయింది".

"వాళ్లు ఎన్‌ఎస్‌పీ 14 ప్రోటీన్‌లో మ్యుటేషన్లను గమనించారు. ఈ ప్రోటీన్‌లో సాధారణం కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉంటే అవి వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం గాని, లేదా ప్రభావం లేకుండా గానీ చేస్తుంది. ఇది వైరస్‌ను ఓడిస్తుంది" అని వివరించారు.

అయితే, కేసుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోవడానికి భారీ స్థాయిలో అమలు చేసిన వ్యాక్సీనేషన్‌ కార్యక్రమం, భౌతిక దూరం పాటించడం కూడా కారణం కావచ్చని పరిశోధకులు అన్నారు.

ప్రజలు ఐసొలేట్ అయినప్పుడు కూడా వైరస్ ప్రభావం క్రమేపీ తగ్గుతుంది. అప్పటికే ఇన్ఫెక్షన్ సోకిన వారు కొన్ని రోజుల తర్వాత వివరాలను అందచేస్తారు.

ఒక్కసారిగా ఇలా కేసుల సంఖ్య పడిపోవడం... కాస్త ఎక్కువ చేసి చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. వైరస్ దానంతట అదే మాయమవడం సాధ్యమే అనే సందేశాన్ని ఇస్తోంది" అని ఆయన అన్నారు.

జపాన్‌లో కేసులు ఆశ్చర్యకరమైన రీతిలో తగ్గినప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు.

ఈ మహమ్మారి నిరంతరం రూపాంతరం చెందుతోంది. వ్యాక్సీన్లు, కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించినప్పటికీ ఈ ప్రపంచంలో మహమ్మారి తిరిగి వ్యాప్తి చెందదని పూర్తిగా చెప్పలేం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)