కరోనావైరస్ దెబ్బకు బుధవారం ఒక్క రోజే హుబేలో 242 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్తో చైనాలోని హుబే ప్రావిన్స్లో బుధవారం ఒక్కరోజే 242 మంది చనిపోయారు. మృతుల సంఖ్యతో పాటు కరోనావైరస్ బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఆ ఒక్కరోజే 14వేల 840 కేసులు నమోదయ్యాయి.
వైరస్ లక్షణాలను గతంలో కన్నా మరింత విస్తృతంగా పరిగణనలోకి తీసుకుని హూబేలో రోగ నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానివల్ల కూడా రోగుల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి, అంతకుముందు పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని భావించారు. కానీ, బుధవారం నాటి మరణాలు పరిస్థితి తీవ్రంగానే ఉందని స్పష్టం చేశాయి.
తాజా మృతులతో కలిపి ఇప్పటివరకు చైనాలో కరోనావైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మొత్తంగా 1350కి చేరింది. రోగుల సంఖ్య అయితే 60,000 దాటింది. చైనాలో నమోదైన కరోనావైరస్ కేసుల్లో సుమారు 80 శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో కూడా ఇక్కడి వారే అధికంగా ఉన్నారు.


కొత్త రోగనిర్థరణ విధానం ఏమిటి?
చైనాలో కరోనావైరస్ సోకిన వారిలో 80 శాతం ప్రజలు ఒక్క హుబే ప్రావిన్సులోనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వైరస్ సోకిన వారి సంఖ్యలో ప్రామాణిక న్యూక్లిక్ యాసిడ్ పరీక్షల ద్వారా వైరస్ నిర్థరణ జరిగిన వారితో పాటు 'సాధారణ వైద్య పరీక్షల' ద్వారా నిర్థరించిన రోగులను కూడా చేర్చారు. అంటే, మొత్తం రోగుల సంఖ్యలో వైరస్ లక్షణాలు కలిగి ఉండి, సిటి స్కాన్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలినవారు కూడా ఉన్నారు.
వుహాన్లో చనిపోయిన 242 మందిలో 135 కేసులు అలాంటి 'సాధారణ వైద్య పరీక్షల' ద్వారా నిర్థరించినవే. ఈ కొత్త ప్రమాణాల ప్రకారం కాకుండా పాత పద్ధతిలో లెక్కిస్తే హుబే మృతుల సంఖ్య 107గా నమోదైంది. ఇది కూడా గతంతో పోల్చితే బుధవారమే అత్యధికం.
ఈ ప్రావిన్స్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 14,840 కేసుల్లో 'సాధారణ వైద్య పరీక్షల' ద్వారా నిర్థరించి 13,332 కేసులు కూడా ఉన్నాయి. మొత్తంగా, ఈ ప్రావిన్స్లో ఇప్పటివరకు ధ్రువీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 48,206.

ఫొటో సోర్స్, AFP
కంబోడియాలో వెస్టర్డామ్ నౌక నిలిపివేత
మరోవైపు 2వేల మందితో ప్రయాణిస్తున్న ఓ నౌకను కంబోడియాలో నిలిపేశారు. సుమారు అయిదు దేశాలు చుట్టి రావడంతో అందులో ప్రయాణిస్తున్నకొంత మందికి వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానమే అందుకు కారణం.
అయిదు దేశాలను చుట్టి వచ్చిన ద మెఎస్ వెస్టర్డామ్ నౌక బుధ వారం కంబోడియా చేరకుంది. నౌకలో కొందరు అనారోగ్యం బారిన పడటంతో నౌక ప్రయాణించిన జపాన్, తైవాన్, గువామ్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ .. ఇలా ఏ దేశం కూడా దాన్ని తమ ఓడ రేవుల్లో నిలిపేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రికి రాత్రే వ్యాక్సీన్ తయారు చెయ్యలేం: డబ్యూహెచ్ఓ
కంబోడియా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మేం పదే పదే విజ్ఞప్తి చేస్తున్న అంతర్జాతీయ ఐక్యమత్యానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఈ మహమ్మారి ముగింపు దశకు వచ్చిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని , మున్ముందు ఏదైనా జరగొచ్చని హెచ్చరించింది. నాలుగు రకాల వ్యాక్సీన్లను సిద్ధం చేసేందుకు కూడా నిధులను సమకూర్చినట్టు డబ్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
"మేం తప్పకుండా ఒక వ్యాక్సీన్ను సిద్ధం చేస్తాం. అయితే, దానికి కొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే చేయడం సాధ్యం కాదు"అని డబ్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.
కరోనావైరస్ - ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం
- కరోనా వైరస్ భయాల కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫోన్ షో కేస్గా భావించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రద్దయిందని నిర్వాహకులు వెల్లడించారు. స్పానిష్ నగరమైన బార్సిలోనా నగరంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ప్రధాన టెక్ కంపెనీలు వైదొలగడంతో ఇది రద్దయ్యింది.
- అమెరికా కూడా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 13 కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది.
- సింగపూర్లో అతి పెద్ద బ్యాంక్ డీబీఎస్లో ఒకరికి కరోనావైరస్ సోకడంతో అతను పని చేస్తున్న అంతస్థులోనే విధులు నిర్వహిస్తున్న 300 మంది సిబ్బందిని ఆ సంస్థ ఇంటికి పంపించి వేసింది.
- చైనాలో షాంఘై నగరంలో ఏప్రిల్ 19 నుంచి జరగాల్సిన ఫార్ములా వన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ను వాయిదా వేశారు.
- వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా పిల్లల్ని తిరిగి స్కూలుకి పంపాలన్న విషయంలో ఆలోచిస్తున్నామని చైనా చెబుతోంది. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
- ఇక జపాన్లో నిలిపేసి డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో మరో 39 మందికి వ్యాధి సోకింది. దీంతో మొత్తం ఆ నౌకలో 174మంది కరోనావైరస్తో బాధపడుతున్నారు. చైనాకు బయట ఈ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నది ఇక్కడ మాత్రమే.

ఇవి కూడ చదవండి
- కరోనావైరస్ వైరస్ సోకిన వాళ్ల దగ్గరకు వెళ్లారా లేదా అన్నది చెప్పే యాప్
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ ప్రభావంతో చైనాకు ఏపీ, తెలంగాణల మిర్చి ఎగుమతులు పడిపోయాయా?
- కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీని దాటి ఏదైనా సాధించగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








