మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్

మలేరియా దోమలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకా (వ్యాక్సిన్) కెన్యాలోని శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.

త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది. వచ్చే మూడేళ్లలో కనీసం 3 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ వ్యాక్సిన్ తయారీ, పరిశోధన, పరీక్షలు... అన్నింటికీ కలిపి మొత్తం 30 ఏళ్ల సమయం పట్టింది.

మలేరియా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

మానవుల్లోని రోగ నిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుంది.

మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను రెండేళ్ల వయసు వచ్చేలోపు నాలుగు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కనీసం 10మంది చిన్నారుల్లో నలుగురిలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి.

మలేరియా పారసైట్లు

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన మలేరియా వ్యాధి కేసులు కూడా 1/3 వంతు తగ్గినట్లు వెల్లడైంది.

ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటికే వెల్లడైంది.

కెన్యాలోని కిసుము, కాకమెగా, మోంబాసా ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో మొదటగా ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలించాలి.

ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మలేరియా వ్యాధి నిర్మూలనలో కచ్చితంగా ఇది పెను మార్పులను తీసుకురానుంది.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా బారినపడి మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉంటున్నారు.

మలేరియా వ్యాక్సిన్

మలేరియా ఎందుకు వస్తుంది?

మలేరియా వ్యాధికి ప్రధాన కారణం ప్లాస్మోడియం పారాసైట్లు. దోమకాట్ల వల్లే ఇది ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన జ్వరం, వణుకు కారణంగా నీరసించిపోతారు. కాలేయం పైనా, రక్తంలోని ఎర్రరక్తకణాలపైనా దాడి చేయడం ద్వారా రక్తహీనతకు ఈ పారసైట్ కారణమవుతుంది.

నివాస ప్రాంతాల్లో దోమల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. వీటితోపాటు ప్రభావవంతమైన మందులు అందుబాటులో ఉండటం కూడా మరణాలరేటులో తగ్గుదలకు కారణమైంది.

మలేరియాను పూర్తిగా రూపమాపడం ప్రపంచంముందున్న ఓ పెద్ద సవాలే అనుకోవచ్చు.

2050నాటికి ఇది సాధ్యం కావచ్చు అని మలేరియా వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణుల, ఆర్థిక వేత్తలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 41మంది బృందం తమ నివేదికలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)