కరోనావైరస్: 'పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు' -ఏపీలో తల్లితండ్రులు

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
"మా పిల్లల్ని స్కూల్కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు."
కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్కు చెందిన సరళ ఈ మాట అన్నారు.
"కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్ కోర్సులు చెప్తున్నాం" అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్ రవి అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
2 వారాలు, 13 జిల్లాలు, 232 కేసులు
ఏపీలో కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, అది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అలాంటి స్థితిలో బడులు మొదలవడం, ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయుల్లో కొందరు కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది.
"బడులు మొదలైన రెండు వారాల్లోనే 13 జిల్లాల్లో 232 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అయితే ఈ లెక్కల కంటే పాఠశాల్లో నమోదైన కేసులు ఎక్కువే ఉన్నాయి. ప్రతి రోజు సగటున ఒక్కో స్కూల్లో సరాసరి మూడు, నాలుగు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో టీచర్లు, విద్యార్థులు కూడా ఉంటున్నారు. అయితే టీచర్లలో ఎక్కువ మంది వ్యాక్సీన్ వేసుకున్నారు. దీంతో ఎక్కువగా పిల్లల్లోనే కేసులు నమోదవుతున్నాయి" అని విశాఖ జిల్లా యుటీఎఫ్ అధ్యక్షులు జి.చినబ్బాయి చెప్పారు.
"ఇప్పటీకే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో రోజూ పాఠశాలల్లో కేసులు నమోదవుతున్నాయి. 700 మంది విద్యార్థులు, 23 మంది ఉపాధ్యాయులున్న ఒంగోలు దోనెపూడి రాఘవరావు మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డీఆర్ఆర్ఎం)లో 10 మందికి పాజిటివ్ వచ్చింది. పెద్ద స్కూల్ కావడంతో ఎంత మందికి కరోనా సోకిందో అనే భయం నెలకొంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుతుందనే తరుణంలో మళ్లీ ఇలా పాఠశాల్లో కేసులు పెరగడం అందోళన కలిగిస్తోంది. థర్డ్వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలతో మరింత ఆందోళన పెరుగుతుంది." అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
తేడా తెలుస్తోంది... వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్పలేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి.
"కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్ లైన్ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్ ప్రొటోకాల్ పాటించి తరగతులు నిర్వహించాలి" అని ఏపీ మున్సిపాల్ టీచర్స్ ఫేడరేషన్ (ఎఫ్ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్ చెప్పారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
పాఠశాల అభివృద్ధి నిధులెక్కడ...
ఏ ప్రభుత్వ పాఠశాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్ బిల్లులు చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుతుంటారు.
ఈ నిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులు కొనడానికి వాడమంటున్నారని...కానీ నాడు-నేడు పథకం ప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.
"థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ కిట్ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదు. ఒకటిరెండు నెలలంటే, టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం. కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్ వెంటనే పూర్తి చేయాలి. మిడ్ డే మిల్స్ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశముంది. అందుకే పిల్లలకు డ్రై రేషన్ ఇవ్వడం మంచిది" అని చినబ్బాయి బీబీసీతో అన్నారు.
"శ్రీకాకుళంలో 57, విజయనగరం 31, విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49, పశ్చిమగోదావరిలో 48, కృష్ణాలో 36, గుంటూరులో 55, ప్రకాశం 13, నెల్లూరు 30, చిత్తూరు 55, కర్నూలు 44, కడప 42, అనంతపురం 28...ఇలా మొత్తం 556 మంది ఉపాధ్యాయులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణించిన వారిని కూడా కలుపుకుంటే మరో 20 శాతం పెరుగుతారు. విద్యార్థుల్లో కూడా కొందరు చనిపోయారు. అయితే ప్రస్తుతం పిల్లలు, ఉపాధ్యాయులలో ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకకుండా కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది" అని ఎఫ్ఏపీటీవో ప్రతినిధి రవి సిద్ధార్ధ్ చెప్పారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
భయాలున్నా...హాజరు పెరిగింది
కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్ వేవ్ తర్వాత బడులు ప్రారంభిచగానే తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయంలోనే కరోనా థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది.
"బడులు ప్రారంభించినప్పుడు 20 శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85 శాతానికి చేరుకుంది. మళ్లీ ఇప్పుడు థర్డ్ వేవ్ భయం మొదలైంది. కోవిడ్ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు. అయితే, ప్రభుత్వం కోవిడ్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదండ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు" అని విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వరరెడ్డి చెప్పారు.
కరోనా నిబంధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్ మార్గదర్శకాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్యవేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే క్వారంటైన్ పీరియడ్ కింద 14 రోజులు మూసివేస్తున్నామ" అని విశాఖ డీఈవో లింగేశ్వరరెడ్డి వెల్లడించారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
తప్పో... ఒప్పో తెలియడం లేదు
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపకపోతే పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోతారనే భయం, పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది.
"కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్ గేటు దగ్గర థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు వంటివి చూస్తున్నా...బడి లోపల, తరగతి గదుల్లో ఎలా ఉంటుందో...? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రొటోకాల్ పాటించకపోవడం కూడా చూస్తున్నాం" అని విశాఖ మురళీనగర్ కు చెందిన సరళ బీబీసీతో చెప్పారు.
సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ఆన్ లైన్ తరగతులే మంచిదని సరళ భావిస్తున్నారు.
"మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపి వాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో, కాదో అర్థం కావడం లేదు. అన్ లైన్ తరగతులే బెటరని మాకు అనిపిస్తుంది" అన్నారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
ట్రయల్స్ నిర్వహించాలి
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని పాఠశాలల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే పిల్లలకు ఇంకా వ్యాక్సీన్ రాలేదు.
అవి ఇంకా ట్రయిల్స్ దశలోనే ఉన్నాయి. ఏదైనా స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా పాజిటివ్ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడం కష్టం.
పైగా బడిలో కరోనా సోకిందా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా? అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు.
"ఫస్ట్ వేవ్లో పెద్దలు, సెకండ్ వేవ్లో యువత, మధ్యవయస్కులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్ అవడంతో, థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి. ఆ డేటా ప్రతి స్కూల్లో ఉండాలి. రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకోని తల్లిదండ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు...వారి నుంచి మిగతా పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉంది" అని విశాఖలోని చిన్నపిల్లల వైద్యులు సతీష్ చెప్పారు.

ఫొటో సోర్స్, L. Srinivas/BBC
పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్ సతీష్ భావిస్తున్నారు.
"ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్ డిస్టైన్సింగ్, శానిటైజేషన్, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్ రన్ నిర్వహించాలి. కోవిడ్ ప్రొటోకాల్పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి" అన్నారు.
థర్డ్ వేవ్ పై ఇంకా స్పష్టత రాలేదని డాక్టర్ సతీష్ చెప్పారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ రావడం ఖాయమని, ప్రస్తుతం కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా, రాకపోయినా కనీసం మరో ఏడాది పాటైనా కోవిడ్ ప్రొటోకాల్ పాటించడం మంచిదని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిషర్లకు పిచ్చెక్కించి, వందేళ్లకు ముందే ‘విముక్తి’ పొందిన భారతీయ పట్టణం
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








