కరెన్సీ: కొత్త నోట్లు ముద్రిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్ మహమ్మారి వల్ల కుదేలైన ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించడం గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ మరింత కరెన్సీ ముద్రించాలా, వద్దా అనే విషయంలో ఎక్కువగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థికవ్యవస్థ సంతులనం కోసం చాలాసార్లు ద్రవ్య సంబంధిత చర్యలు తీసుకుంటారు. అధికంగా కరెన్సీని ముద్రించడాన్ని టెక్నికల్ భాషలో 'క్వాంటిటేటివ్ ఈజింగ్' అంటారు. అంటే, స్థూలంగా కరెన్సీ లభ్యతను పెంచడమని అర్థం.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పద్ధతిని అవలంబించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల దీనిని విజయవంతంగా అమలు చేసింది. కానీ వెనెజ్వెలా, జింబాబ్వే లాంటి దేశాల్లో ఈ చర్యల వల్ల చాలా ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తాయి.
కరోనా సెకండ్ వేవ్ వల్ల కుదేలైన ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు కరెన్సీ ముద్రించాల్సిన అవసరం ఉందని గత వారం దేశంలోని అగ్రస్థాయి బ్యాంకర్లలో ఒకరైన ఉదయ్ కొటక్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
భారత్లో కరెన్సీ ముద్రించే బాధ్యతను రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఈ ప్రక్రియలో దానికి ప్రభుత్వం నుంచి కూడా సలహాలు సూచనలు అందుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే సరైన సమయం
"కరెన్సీ ముద్రణను రెండు స్థాయిల్లో చేయాల్సిన అవసరం ఉంది. మొదట ఆర్థికవ్యవస్థ దిగువ శ్రేణి కోసం, రెండోది సెకండ్ వేవ్ వల్ల ప్రభావితమైన రంగాల్లో ఉద్యోగ భద్రత కోసం".. అని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ అన్నారు.
"నాకు తెలిసి ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్ను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి ఆర్బీఐ సాయం చేయవచ్చు. కరెన్సీ ముద్రణ కోసం ఏదైనా చేయండి. ఇప్పుడు కాకుండే ఇంకెప్పుడు" అని చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తకాంత దాస్ మాత్రం ప్రస్తుతం కరెన్సీ ముద్రించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. కానీ, అలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అది ఆర్థికవృద్ధిని దెబ్బతీస్తుందని శక్తికాంత దాస్ అంటున్నారని తెలిపారు.
"చాలా ఎక్కువ కరెన్సీ సరఫరా అనేది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. అలా కాకుండా ప్రభుత్వం నోట్లు ముద్రించాలనే భావిస్తే, కరెన్సీ, రుణ మార్కెట్ రెండిట్లో అనిశ్చితి ఏర్పడుతుంది. కరెన్సీ విలువ భారీగా పతనం అవుతుంది" అని రిజర్వ్ బ్యాంక్కు సంబంధించిన ఒక అధికారి చెప్పారు.
వేర్వేరు వాదనలు
రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్లు మార్కెట్లోకి హఠాత్తుగా భారీగా రావడం వల్ల ధరలు పెరగడం, కరెన్సీ వాస్తవ విలువ పడిపోవడం లాంటి ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ సాధారణ పరిస్థితుల్లో అలా జరుగుతుందని, కానీ, దేశంలో ప్రస్తుత స్థితి సాధారణంగా లేదని కొంతమంది ఆర్థికవేత్తలు అంటున్నారు.
కరెన్సీ ముద్రించాలా వద్దా అనే విషయంలో ఆర్థిక ప్రపంచం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ఆర్థిక స్థితి ఘోరంగా ఉందని, కరెన్సీని ముద్రించడానికి ఆర్బీఐకి ఇది సరైన సమయం అని చాలామంది నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం మార్కెట్లో లిక్విడిటీ(నగదు) కొరత లేదని వాదిస్తున్నారు. అందుకే అదనపు నోట్లు ముద్రించి ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని కొనితెచ్చుకోకూడదని అంటున్నారు.
ముంబయి షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన విజయ్ భబ్వానీ కరెన్సీ ముద్రించాలనే నిర్ణయం చివరి ఆప్షన్గా ఉండాలి అన్నారు. వేరే ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే నోట్లు ముద్రించాలని భావించడం మంచిదని చెప్పారు.
ఆర్బీఐ డబ్బులు ముద్రించడం లేదనడం సరికాదని, అది ఇన్డైరెక్ట్గా ఉంటుందని ఆర్థిక అంశాల నిపుణులు 'బ్యాడ్ మనీ' పుస్తక రచయిత వివేక్ కౌల్ అంటున్నారు.
"ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 2.2 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ఆర్బీఐ చెప్పింది. అది ఆ బాండ్లను ఎలా కొంటుంది. కరెన్సీ ముద్రణ ద్వారా. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇలాగే నోట్లు ముద్రిస్తుంది. ఆ కరెన్సీని ఆర్థికవ్యవస్థలోకి పంప్ చేస్తుంది. అందుకే ఆర్బీఐ ముందు నుంచే ముందు నుంచే కరెన్సీ ముద్రిస్తోంది. అది గత ఏడాది కూడా నోట్లు ముద్రించింది" అన్నారు.
ప్రభుత్వం సాధారణంగా చాలా ఆర్థిక ప్రణాళికలు అమలు చేస్తుంటుంది. దాని కోసం ప్రభుత్వానికి నిధులు అవసరం అవుతాయి. మహమ్మారిని ఎదుర్కోడానికి దానికి ఇప్పుడు ఎన్నో రెట్లు నిధులు అవరం ఉంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
పథకాల కోసం చాలా డబ్బు కావాలి
ఇవి కాకుండా ప్రభుత్వం ముందు నుంచి అమలు చేస్తున్న ఎన్నో పథకాలకు కూడా నిధులు అందించాల్సుంటుందని విజయ్ భంబ్వానీ చెప్పారు. వీటిలో నరేగా, ఎఫ్ఎస్బీ, పీడీఎస్ లాంటి పథకాలు ఉన్నాయి.
ఇలాంటి పథకాలన్నింటికీ చాలా నిధులు కావాలి. ఆ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి. జీఎస్టీ వల్ల గత కొన్ని నెలలుగా నెలకు ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమవుతున్నాయి.
ఆర్బీఐ 99 వేల కోట్ల రూపాయలకు పైగా నగదును ఒక్కో ప్రత్యేక నిబంధన ప్రకారం ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసిందని విజయ్ భంబ్వానీ చెప్పారు.
ప్రభుత్వ కంపెనీల్లో వాటాల పెట్టుబడుల ఉపసంహరణ, కొన్ని పీఎస్యూలను ప్రైవేటీకరణ వల్ల కూడా ప్రభుత్వానికి డబ్బు తెచ్చిపెట్టవచ్చు. ఎల్ఐసీ, ఐపీఓ వల్ల దాదాపు లక్ష కోట్లు సేకరించవచ్చని ఆశిస్తున్నారు. బీపీసీఎల్, మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలో టాప్లో ఉన్నాయి.
ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు
బాండ్ మార్కెట్ నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు సేకరించనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వస్తాయి. అయితే, ఇలా ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటే, అంత సేకరించవచ్చు. బహుశా, అందుకే కరెన్సీ ముద్రించే సలహాను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వారిలో ఆర్బీఐ గవర్నర్ కూడా ఒకరు.
అది కాకుండా ఆర్బీఐ దగ్గర బ్యాంకుల జమ చేసిన డబ్బు కూడా ఉంది. వ్యాపారులు, పరిశ్రమలకు రుణాలు ఇచ్చిన తర్వాత బ్యాంకులు మిగిలిన డబ్బును ఆర్బీఐ ఖాతాలో తిరిగి జమ చేస్తాయి. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర 5 లక్షల కోట్లకు పైగా బ్యాంకుల డబ్బు ఉంది.
మార్కెట్లో అవసరానికంటే ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటే, ద్రవ్యోల్బణం పెరగడానికి పూర్తి అవకాశం ఉందని ఆర్బీఐ చెబుతోంది.
1997 తర్వాత నుంచి రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ ముద్రించడానికి, ఆ డబ్బును ఖర్చు చేయడానికి నేరుగా ప్రభుత్వానికి అప్పగించడానికి అనుమతి లేదు. కానీ, పరోక్షంగా అది అలా చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని వివేక్ కౌల్ చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఆర్థిక వ్యవస్థకు ఊతం
"ఆర్బీఐ ప్రభుత్వం కోసం ఇప్పుడు కూడా కరెన్సీ ముద్రించవచ్చు. కానీ నేరుగా అది చేయకూడదు" అని కౌల్ అన్నారు.
ఆర్బీఐ కరెన్సీ ముద్రించినప్పుడు, ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేసినపుడు, ఆర్థిక వ్యవస్థలో డబ్బుల సరఫరా పెరుగుతుంది. దీంతో బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, మిగతా ఆర్థిక సంస్థలు ఈ కొత్త డబ్బును కొత్త ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.
"ప్రభుత్వ బాండ్ అంటే ఆర్థిక సెక్యూరిటీలు. ఆర్థిక లోటును భర్తీ చేయడానికి లేదా ఆదాయం వ్యయాల మధ్య అంతరం సమం చేయడానికి ప్రభుత్వం వాటిని జారీ చేస్తుంది. ఆ సెక్యూరిటీలను బ్యాంకులు, బీమా కంపెనీలు లాంటివి కొనుగోలు చేస్తాయి" అని కౌల్ చెప్పారు.
నగదు ముద్రించడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ముఖ్యంగా పన్ను వసూళ్లు మందగించే అవకాశం ఉన్నప్పుడు అది అలా చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 12.1 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవచ్చని ఆయన అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం
"కరెన్సీ ముద్రించం వల్ల ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ వస్తుంది. దానివల్ల వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. దాంతో ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుంది. కానీ, ఇందులో మరో కోణం కూడా ఉంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారు తక్కవ వడ్డీ రేట్ల వల్ల నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే, అదనపు కరెన్సీ ముద్రించడం వల్ల పొదుపు చేసేవారికి నష్టం కలుగుతుంది అని విజయ్ భంబ్వానీ అన్నారు.
కరెన్సీ ముద్రణ విషయానికి వస్తే ద్రవ్యోల్బణం చుక్కలనంటే ప్రమాదం ఉందని విజయ్ భంబ్వానీ చెబుతున్నారు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఖర్చు చేయడం తగ్గుతుంది. దాంతో డిమాండ్ మీద దారుణమైన ప్రభావం పడుతుంది. అది దేశం రేటింగ్కు నష్టం కలిగిస్తుందని ఆయన అంటున్నారు.
ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వం దగ్గర వేరే ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే కరెన్సీ ముద్రించడానికి ప్రయత్నించాలి.
ఇవి కూడా చదవండి:
- కేరళ: బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్న ఆ ‘‘బ్లాక్ మనీ కేసు’’ అసలు కథ ఏంటి....ఎందుకు మలుపులు తిరుగుతోంది?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా.. ఇంతకీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది
- తిండి పెట్టకుండా తల్లిదండ్రులను చంపేసి కరోనా మరణంగా చూపారన్న ఆరోపణలతో దంపతుల అరెస్ట్
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- కరోనావైరస్: కోవిడ్ వ్యాక్సీన్లు ఎంతవరకు సురక్షితం?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కోవిడ్-19: ఆనందయ్య కరోనా మందు వివాదంతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందా?
- ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










