కరోనావైరస్: చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...

కరోనావైరస్

ఫొటో సోర్స్, NILESH KATKE

ఫొటో క్యాప్షన్, మరణించిన వ్యక్తి బతికే ఉన్నారంటూ ఆస్పత్రి నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు
    • రచయిత, భార్గవ్ ఫారిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం నాడు జరిగిన ఘటన అందర్నీ నివ్వెరపరచింది.

ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ రోగి మరణించారంటూ ఆయన బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఓ రోజు గడిచిన తర్వాత అదే ఆస్పత్రి నుంచి మరో ఫోన్ వచ్చింది. ఈ సారి వచ్చిన సమాచారం ముందు ఇచ్చిన సమాచారానికి పూర్తి విరుద్ధంగా ఉంది.

వారి బంధువుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, మీరు ఇంటికి తీసుకువెళ్లవచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. తీరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆయన మృతికి సంబంధించిన డాక్యుమెంట్లను చేతుల్లో పెట్టారు.

నికోల్ ప్రాంతానికి చెందిన 71 ఏళ్ల వయసున్న దేవ్రం భిస్కర్ డయాబెటిక్ రోగి. నాలుగు రోజుల క్రితం శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తగా ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో చేర్చుకునే ముందే భిస్కర్ అల్లుడు నిలేష్ నిక్తేతో ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే తమ బాధ్యత కాదంటూ ఓ లేఖ రాయించుకున్నారు.

“మా మామయ్యను కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చిన స్థానిక ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చాం. ఆ సమయంలో నిర్వహించిన డయాబెటిక్ పరీక్షలో ఆయన షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా (575) ఉన్నాయి. నన్ను ఆ లెటర్‌పై సంతకం పెట్టమన్నప్పుడు నేను ఓ సారి ఆయన్ను చూడాలని అడిగాను. దాంతో ఆస్పత్రి సిబ్బంది వీడియో కాల్ ద్వారా ఆయన్ను చూపించారు. ఆయన్ను చూసిన తర్వాత నేను సంతకం పెట్టాను” అని నీలేష్ బీబీసీకి చెప్పారు.

వైద్యులు చికిత్స ప్రారంభించిన తర్వాత వారికి ఆయన ఆరోగ్యంపై ఆశలు చిగురించాయి.

“అన్ని విధివిధానాలను పూర్తి చేసుకొని మేం ఇంటికి తిరిగి వచ్చాం. మర్నాడే కరోనావైరస్ కారణంగా ఆయన మరణించారంటూ ఆస్పత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఆస్పత్రికి వెళ్లగానే నీలి రంగు పీపీఈ కిట్‌ చుట్టిన ఓ మృతదేహాన్ని మాకు అప్పగించారు. అయితే అప్పటికి ఇంకా ఆయన కరోనావైరస్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఆయన వేసుకున్న దుస్తులు చూపించగానే ఆయన ముఖం కూడా చూడకుండా మా మామయ్య ఇక లేరని బాధపడ్డాం. ఆపై ఆయన అంత్యక్రియల హడావుడిలో పడిపోయాం” అని నీలేష్ చెప్పారు.

దేవ్రం భిస్కర్ కుటుంబంలో ఆయన భార్య సహా ఆరుగురు కుటుంబసభ్యులున్నారు.

ఆయన బతికే ఉన్నారంటూ ఆస్పత్రి నుంచి ఫోన్

“ఓ రోజు గడిచిన తర్వాత మాకు ఆస్పత్రి నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. మా మామయ్యకు కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని, ఆయన్ను సాధారణ వార్డులోకి మారుస్తున్నామని, ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారు” అని నీలేష్ బీబీసీతో అన్నారు.

ఆ ఫోన్ కాల్‌తో మొత్తం కుటుంబం అంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది. ఆస్పత్రి వర్గాలు చెప్పినట్టు భిస్కర్ ప్రాణాలతోనే ఉంటే ముందు రోజు వాళ్లు ఎవరికి అంత్యక్రియలను నిర్వహించినట్టు?

ఇదే ప్రశ్నతో నీలేష్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్లాక అధికారులు భాస్కర్ చనిపోయారని చెప్పడమే కాదు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వారికి అందజేశారు. దీంతో పొరపాటు జరిగి ఉంటుందనుకొని ఊసురుమంటూ ఇంటికి వచ్చిన నీలేష్ కుటుంబ సభ్యులు ఆ వార్తను తమ కుటుంసభ్యులకు చేరవేయడంలో బీజీ అయిపోయారు.

అక్కడితో ఈ ఘటన ముగిసిపోలేదు. మళ్లీ ఆదే ఆస్పత్రి నుంచి వారికి మరో సారి ఫోన్ వచ్చింది. దేవ్రం ఆరోగ్యం మెరుగుపడుతోందన్నది ఆ ఫోన్ సారాంశం.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనావైరస్

ఫొటో సోర్స్, NILESH KATKE

ఆ తర్వాత ఏం జరిగిందో నీలేష్ ఇలా చెప్పుకొచ్చారు.

“ఇది మాకు ఆస్పత్రి నుంచి వచ్చిన మూడో ఫోన్ కాల్. ఈ సారి ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. అయితే గతంలో వచ్చిన ఫోన్ కాల్స్ గురించి వాళ్లకు చెప్పి ఆయన మరణానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని కోరాం. రెండు గంటల క్రితమే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తమకు నివేదికలు అందాయని చెప్పారు. ఓ సారి ఆయన చనిపోయారంటూ మృత దేహాన్ని కూడా అప్పగించిన ఆస్పత్రి వర్గాలు మరోసారి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు” అని ఆయన వివరించారు.

క్షమాపణ కోరిన ఆస్పత్రి వర్గాలు

ఇదే విషయమై ఆస్పత్రి డీన్‌ డా.శశాంక్ పాండ్య తో మేం మాట్లాడాం. అందుకు ఆయన సమాధానమిస్తూ... సమాచార లోపం జరగడం వాస్తవమేనని స్పష్టం చేశారు.

“దేవ్రం భిస్కర్‌ను మే 28న ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన అనారోగ్య లక్షణాలను చూసిన మేము గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 వార్డుకు తరలించాం. ఆ పై ఆయన శాంపిళ్లను పరీక్షల కోసం పంపించాం. మే 29న ఆయన మరణించారు. దాంతో ఆయన కుటుంబానికి భిస్కర్ మృతదేహాన్ని అందజేశాం. ముందు జాగ్రత్తలో భాగంగా మేం కోవిడ్-19 కారణంగా మరణించిన రోగి శరీరాన్ని పీపీఈ కిట్ చుట్టి ఇస్తాం. అందుకే ఆ రోజు ఆయన కుటుంబం ఆ రీతిలో భిస్కర్ మృతదేహాన్ని తీసుకున్నారు.”

ఫోన్ కాల్స్ గురించి డా.పాండ్యాను అడగ్గా ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

“ఆయన మరణించినప్పటికీ ఆయన రిపోర్ట్ అప్పటికీ ఇంకా రాలేదు. ఆయన రిపోర్ట్‌లో నెగిటివ్ అని రాగానే ఆయన మరణ వార్త తెలియని సిబ్బంది వారి కుటుంబానికి ఫోన్ చేసి సాధారణ వార్డులోకి మారుస్తున్నట్టు చెప్పారు” అని పాండ్యా వివరించారు.

మృతదేహాలు తారుమారై ఉంటాయన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఇది కేవలం సమాచార లోపం కారణంగానే జరిగిందని డా.పాండ్యా అన్నారు.

ఆ తరువాత భిస్కర్ కుటుంబానికి డాక్టర్ పాండ్యా క్షమాపణ కోరారు. “ఆయన మాకు క్షమాపణ కోరారు. అందుకే మేం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలనుకుంటున్నాం. అయితే వాళ్ల మధ్య జరిగిన సమాచార లోపం కారణంగా మానసికంగా మేం చాలా ఇబ్బందికి గురయ్యాం. ఇంకెవ్వరికీ మాలాంటి పరిస్థితి రాకూడదని మేం కోరుకుంటున్నాం” అని నీలేష్ బీబీసీకి తెలిపారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)