మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఎందుకు కలవాలనుకుంటున్నారు - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, రిపోర్టింగ్: దీప్తి బత్తిని, కెమెరా: నవీన్ కుమార్, ఎడిటింగ్: సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నయ్గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు.
"తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మా గ్రామాల్లోనూ అమలు చేయాలి. అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపాలి" అనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్కు వివరించి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు.
తాము టీఆర్ఎస్ టికెట్పై మహారాష్ట్రలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపారు. 'మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ, మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది" అని వారు చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు వెంట మహారాష్ట్రలో ఉన్న గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఏమంటున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.
హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని ధర్మాబాద్ తాలూకా సహా... 5 నియోజకవర్గాలలోని పలు గ్రామాల ప్రజలతో, రాజకీయ నాయకులతో బీబీసీ మాట్లాడింది.

ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
"ఇక్కడ మాకు ప్రతిదీ సమస్యే. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా" అని నయ్గావ్ నియోజకవర్గానికి చెందిన గంగాధర్ అన్నారు.
"మా ప్రాంతంలో గ్రామాలకు సరిగా రోడ్లు లేవు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు" అని డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన చిన్నా రెడ్డి చెప్పారు.
"నీటి సమస్య ఉంది. నాలాలు శుభ్రం చేయరు. రోడ్లు బాగుండవు" అని బోకర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు చెప్పారు.

డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన రాజు మాత్రం తమకు సమస్యలేమీ లేవని అన్నారు.
"గతంలో సమస్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో సమస్యలేమీ లేవు. అంతా బాగా ఉంది. మా మహారాష్ట్ర కూడా అభివృద్ధి అవుతుంది" ఆయన వివరించారు.
"సరైన వైద్య సదుపాయాలు లేవు. కరెంటు, విద్య, ఇవన్నీ ఇక్కడ సమస్యలే" అని కిన్వట్కు చెందిన సూర్యవంశీ గజానంద్ చెప్పారు.
"మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపం ఏంటంటే, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, ఆ పథకాల ప్రయోజనాలు అందాల్సిన వారికి అందవు" అని బోకర్ నియోజకవర్గం వాసి స్వరూప అన్నారు.

మహారాష్ట్ర సీఎం ఏం చేస్తున్నారు?
ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పార్టీ టికెట్పై ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న స్థానిక నాయకులతో బీబీసీ మాట్లాడింది.
"సరిహద్దులో ఉండటంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. తెలంగాణను కేసీఆర్ అంత అభివృద్ధి చేసినప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా" అని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ ప్రశ్నించారు.

"మా తాలూకా మాత్రమే కాదు, సరిహద్దులో ఉన్న అన్ని తాలూకాల్లోనూ నాయకుడిగా నిలబడి ప్రజలందరికీ సౌకర్యాలు అందేలా చూడాలని కేసీఆర్ నాకు సూచించారు. కేసీఆర్ చెప్పడంతోనే (ఎన్నికల) పనిలో దిగాము" అని బాబురావు గణపతిరావు చెప్పారు.
"ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల, నాకు తెలిసి పెద్దగా ఏం జరగదు. ఓట్లను చీల్చడం తప్పితే, ఆ పార్టీ గెలిచే అవకాశాలైతే లేవు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఒక స్పాయిలర్గా వచ్చి మహారాష్ట్రలో బీజేపీని బలపరిచే పని చేయటానికి ఇష్టపడదు అనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యతలు ఏంటో తెలుసు. ఒక స్పాయిలర్గా కాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిస్తే ఇంకా మంచిది" అని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు.

టీఆర్ఎస్ పోటీపై ఏమంటున్నారు?
"ఇది ఒక పొలిటికల్ స్టంట్ కూడా అయి ఉండవచ్చు. ఇక్కడ చాలా మంచి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అందరికి ప్రయోజనాలు అందుతున్నాయి. కాబట్టి, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఎన్నికలలో పోటీ ఇవ్వలేదు" అని శివసేన నేత కునాల్ నాగర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలన్న నినాదంతో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధులు ప్రయత్నించారు.
"టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయడం చాలా మంచిది" అని నయ్గావ్కు చెందిన గంగాధర్ అన్నారు.
"అంతటా పోటీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. కేవలం సరిహద్దు వెంట ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాలలో నిలబడితే ఏం ఫలితం ఉంటుంది?" అని డెగ్లూర్ వాసి చిన్నా రెడ్డి ప్రశ్నించారు.
"టీఆర్ఎస్ వాళ్లను ముందు తెలంగాణను బాగు చేసుకోమనండి. ఆ తర్వాత మా మహారాష్ట్ర వైపు రమ్మనండి" అని రాజు అన్నారు.

భిన్నాభిప్రాయాలు
"తెలంగాణ అధికారులు ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడి అధికారులు మాత్రం పక్కకు పో అని కసురుకుంటారు" అని హథ్గావ్ నియోజకవర్గానికి చెందిన కమలా భాయ్ చెప్పారు.
"మహారాష్ట్రలో మాకు ఏమీ తక్కువ లేదు. మా ప్రభుత్వం అన్నీ ఇస్తోంది" అని బోకర్ నియోజకవర్గానికి చెందిన గణపతి రావు అన్నారు.
"మా ఎమ్మెల్యేను గెలిపించుకుని రోడ్ల కోసం పోరాడుతాం. మాకు తెలంగాణ వాళ్లు ఏమీ అవసరం లేదు" అని నయ్గావ్ వాసి శివాజీ వ్యాఖ్యానించారు.

కిన్వట్కు చెందిన సూర్యవంశీ గజానంద్ మాత్రం... "మేము మహారాష్ట్రలో కాకుండా, తెలంగాణలో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాం. నేను ఒక్కడిని కాదు. మా దగ్గర చాలామంది అలాగే అనుకుంటున్నారు" అని చెప్పారు.
"మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఆ పథకాలను లబ్ధిదారులకు అందేలా చేస్తే చాలు" అని స్వరూప అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- టిక్టాక్ యాప్ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)










