#Balakot: కొందరు భారత్, పాకిస్తాన్ జర్నలిస్టుల్లో 'యుద్ధోన్మాదం' ఎందుకు? - జర్నలిస్టుల సమాధానం ఇదీ

ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఫొటో క్యాప్షన్, మిరాజ్ 2000 యుద్ధవిమానం

బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఉభయ దేశాల్లో మీడియా వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. వార్తలు అందించడంలో యుద్ధోన్మాదాన్ని విడనాడాలని జర్నలిస్టులను సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు. కశ్మీర్ వివాదంపై వార్తలు అందించేటప్పుడు ఇరు దేశాల్లోని కొందరు జర్నలిస్టులు ఎందుకు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరని భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను బీబీసీ ప్రశ్నించింది.

భారత జర్నలిస్టు సాగరికా ఘోష్ మాట్లాడుతూ- ఉద్రిక్తతల సమయంలో భారత వార్తాఛానళ్ల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, తనను సిగ్గుతో తలదించుకొనేలా చేసిందని విచారం వ్యక్తంచేశారు. కొందరు జర్నలిస్టులు తమ దేశభక్తిని, జాతీయభావాన్ని నిరూపించుకోవాలని భావిస్తారని, వారు ఇలా వ్యవహరించడానికి ఇదే కారణమని ఆమె చెప్పారు. జాతీయభావాన్ని మెడలో వేసుకొని తిరగనివారిని దేశద్రోహులుగా పిలుస్తారని, ఇది మూక స్వభావమని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ న్యూస్ యాంకర్ తలత్ హుస్సేన్ మాట్లాడుతూ- తమలో వృత్తిపరమైన భావోద్వేగాలు పెరగడానికి సంబంధిత వార్తల స్వభావం కూడా ఓ కారణమన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కొందరు భారత్, పాకిస్తాన్ జర్నలిస్టుల్లో 'యుద్ధోన్మాదం' ఎందుకు? - జర్నలిస్టుల సమాధానం ఇదీ

ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల వాహన శ్రేణిపై కశ్మీరీ మిలిటెంట్ ఆత్మాహుతి దాడి తర్వాత అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

ఉభయ దేశాల్లోనూ వార్తాఛానళ్లు ఎక్కువ. వాటి మధ్య పోటీ కూడా అధికమే.

ఇరు దేశాల్లో అధిక భాగం మీడియా తామే వార్తలు బాగా అందించామని చెప్పేందుకు రకరకాల దృశ్యాలతో హడావిడి చేసిందని తలత్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి సంక్షోభ సమయంలో రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేయడం కంటే నిజానిజాలను ఉన్నది ఉన్నట్లు చూపించడమే ప్రజల పట్ల జర్నలిస్టుల బాధ్యతని సాగరిక చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)