భారత్ - పాక్: భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది: త్రివిధ దళాధికారులు

ఎఫ్ 16
ఫొటో క్యాప్షన్, పాక్ ఎఫ్-16 విమానానికి చెందిందిగా భారత్ చెబుతున్న శకలం

త్రివిధ దళాల సంయుక్త మీడియా సమావేశంలో త్రివిధ దళాధికారులు మాట్లాడారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన పరిణామాలను వివరించారు.

సమరానికైనా.. శాంతికైనా.. దేనికైనా రెడీగా ఉన్నామని వివరించారు.

గగన, భూ, సముద్రతలం అన్నింటా పూర్తి సన్నద్ధతతో.. భారత్ అప్రమత్తంగా ఉందని తెలిపారు.

భారత సైనిక స్థావరాలపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్పారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఫొటో క్యాప్షన్, మిరాజ్ 2000

ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం భారత్‌లోకి వస్తున్న పాక్ విమానాలను గుర్తించింది. పాక్ ఎఫ్-16 విమానాలు రాజోరీ ప్రాంతంలో మన గగనతలంలోకి వచ్చాయి.

పాక్ విమానాలు మన సైనిక స్థావరాలపై దాడులకే వచ్చాయి. భారత వైమానిక దళం వాటిని తిప్పికొట్టింది.

ఆ సమయంలో ఒక పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని మన మిగ్ 21 బైసన్‌ ఫైటర్‌తో కూల్చేశాం. అది పాక్ పాలిత కశ్మీర్‌లో కూలిపోయింది.

ఈ పోరాటంలో భారత వైమానిక దళానికి చెందిన ఒక మిగ్ 21 ఫైటర్‌ను కూడా కోల్పోయాం. అందులోని పైలెట్ ప్యారాచూట్ సాయంతో తప్పించుకున్నా గాలి వీస్తుండడంతో సరిహద్దుకు అవతల పడిపోయారు.

తర్వాత పాకిస్తాన్ మొదట మూడు విమానాలు కూల్చామంది, ముగ్గురు పైలెట్లు తమ అదుపులో ఉన్నారని చెప్పింది. తర్వాత మాట మార్చింది.

ఇప్పుడు చివరికి ఒక పైలెట్ తమ కస్టడీలో ఉన్నారని ఒప్పుకుంది. వాస్తవాలను ధ్రువీకరించడానికి పాకిస్తాన్‌కు ఇంత సమయం పట్టిందా.

మన సైనిక స్థావరాల పరిసర ప్రాంతాల్లో పాక్ వైమానిక దళం బాంబులు పడ్డాయి. మన ఎయిర్ ఫోర్స్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది.

పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలు ఉపయోగించలేదని చెబుతోంది. తమకు ఏ నష్టం జరగలేదంటోంది. కానీ వారి విమానాలు దాడులకు దిగాయి.

వాటిలో ఒకదాన్ని భారత వైమానిక దళం కూల్చేసింది. పాకిస్తాన్ ఉపయోగించే ఎఫ్-16లో మాత్రమే ఉపయోగించే ఒక భాగం మన రాజోరీ సెక్టార్‌లో పడిపోయింది.

వింగ్ కమాండర్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాక్ చెబుతోంది. దీనిపై వైమానిక దళం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ట్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

మేజర్ జనరల్ సురేందర్ సింగ్ మహల్ - ఇండియన్ ఆర్మీ

పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాం.

జమ్ము కాశ్మీర్లోని ఒక సైనిక స్థావరం లక్ష్యంగా చేసుకునే పాక్ వైమానిక దళం బాంబు దాడులు చేసింది. మన బలగాలు సమర్థంగా ఎదుర్కోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

వాస్తవాధీన రేఖ వెంట మన బలగాలను సన్నద్ధంగా ఉంచాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, శాంతికి కూడా కట్టుబడి ఉన్నాం.

భారత నావికా దళం

ఫొటో సోర్స్, Getty Images

రేర్ అడ్మిరల్ దల్బీర్ సింగ్ గుజరాల్, నావికా దళం

ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి భారత నౌకాదళం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉంది.

గాలిలోగానీ, నేలమీదగానీ, నీటిపైగానీ ఎలాంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కుంటాం.

పాకిస్తాన్ ఫిబ్రవరి 14 తర్వాత చాలాసార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఆర్మీ చీఫ్ చెప్పారు.

భారత వైమానిక దళం మిలిటెంట్ స్థావరాలపై జరిపిన దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగిందని ఎంతమంది చనిపోయారో చెప్పలేమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)