Australia: భూమిలో 200 అడుగుల లోతున 1300 కాళ్ల ప్రాణి

ఫొటో సోర్స్, Reuters
ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు, అత్యధిక కాళ్లను కలిగిఉన్న మిల్లీపెడ్(రోకలిబండ పురుగు)ను కనుగొన్నారు. ఇప్పటివరకు భూమి మీద ఉన్న జీవ రాశులలో అత్యధిక సంఖ్యలో కాళ్లను కలిగి ఉన్న జీవి ఇదేనని చెబుతున్నారు.
లేత రంగులో, 95 మిల్లీ మీటర్ల పొడవు ఉన్న ఈ జీవికి 1300కి పైగా కాళ్లు ఉన్నాయి.
ఈ జీవికి 'యుమిల్లిపెస్ పెర్సెఫోన్' అని పేరు పెట్టారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక మైనింగ్ ప్రాంతంలో 60 మీటర్ల (సుమారు 200 అడుగులు) లోతున దీన్ని గుర్తించారు.
కాలిఫోర్నియా మిల్లీపెడ్కు 750 కాళ్లు ఉంటాయి. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో కాళ్లను కలిగిన జీవిగా కాలిఫోర్నియా మిల్లీపెడ్ గుర్తింపు పొందింది.
కానీ ఇప్పుడు ఈ రికార్డు 'యుమిల్లిపెస్ పెర్సెఫోన్'కు వచ్చింది.
''మిల్లీపెడ్ అంటే '1000 కాళ్లు' అని అర్థం. కానీ గతంలో కనిపెట్టిన ఏ జీవికి కూడా నిజానికి 1000 కాళ్లు లేవు'' అని రాయిటర్స్తో వర్జీనియా టెక్ ఎంటామాలజిస్ట్ పాల్ మరెక్ చెప్పారు. ఈయన, సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనకు ప్రధాన రచయిత కూడా.
ఈ జీవి శాస్త్రీయ నామానికి 'నిజమైన వెయ్యి కాళ్లు' అని అర్థం. పర్సెఫోన్ అంటే, గ్రీకు పురాణాల ప్రకారం ఒక అండర్ వరల్డ్ రాణి పేరు. ఆమె పేరు 'పర్సెఫోన్'.
భూగర్భంలో ఉండే అనేక జీవుల తరహాలోనే ఈ ప్రాణికి కూడా కళ్లతో పాటు రంగు ఉండదు. శిలీంధ్రాలపై ఇది జీవిస్తుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
ఆడజాతికి చెందిన బాగా ఎదిగిన ఒక మిల్లీపెడ్ 1306 కాళ్లను కలిగిఉందని, మరొకటి 998 కాళ్లను కలిగి ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది. మగజాతికి చెందిన వాటిలో ఒకటి 818, మరొకటి 778 కాళ్లను కలిగి ఉన్నాయి.
మిల్లీపెడ్లు 40 కోట్ల ఏళ్ల కిందటి నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ప్రస్తుతం 13,000 రకాల జాతులు ఉన్నాయి.
''నా అభిప్రాయం ప్రకారం ఇదొక అద్భుతమైన ప్రాణి. పరిణామ క్రమానికి చెందిన అద్భుతం. మిల్లీపెడ్లలో ఇప్పటివరకు కనుగొన్న జీవులలో అత్యంత పొడవైనది ఇదే. ఇవి భూమిని జయించిన మొదటి జీవులు'' అని పెర్త్లోని బెన్నెలోంజియా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్స్ ప్రధాన జీవశాస్త్రవేత్త, అధ్యయన సహ రచయిత బ్రూనో జజాట్టో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో వేల మంది గృహిణులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు
- మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి ఈ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయా? యాంటీ రేడియేషన్ నిజమేనా?
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాధి లక్షణాలు ఏమిటి? జలుబు వస్తే ఏం చేయాలి?
- విశాఖ తీరాన్ని సముద్రం ఎందుకిలా కోసేస్తోంది, కారకులెవరు, పరిష్కారమేంటి?
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- భర్త చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత భారత్కు పాకిస్తాన్ లేఖ.. అందులో ఏముందంటే..
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









