కరోనావైరస్: అమెరికాలో 1,00,000 దాటిపోయిన కోవిడ్-19 మరణాలు

అమెరికాలో లక్ష దాటిపోయిన కోవిడ్ మరణాలు

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కోవిడ్-19 మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ఇక్కడ నమోదైన 16.9 లక్షల ఇన్ఫెక్షన్లు ప్రపంచ మొత్తంలో పోల్చి చూస్తే 30 శాతం.

చైనాలో కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 56 లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా, ఇప్పటి వరకు మొత్తం 3,54,983 మరణాలు చోటు చేసుకున్నాయి.

ఒక్క అమెరికాలోనే 1,00,276 మంది మరణించినట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఈ సంఖ్య 44 సంవత్సరాల వ్యవధిలో కొరియా, వియత్నాం, అఫ్గానిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో మరణించిన అమెరికన్ సైనికులు, స్త్రీలతో సమానమని బీబీసీ నార్త్ అమెరికా ఎడిటర్ జోన్ సోపెల్ చెప్పారు.

కానీ, అమెరికా తలసరి లెక్కల ప్రకారం చూస్తే మరణాల రేటులో అమెరికా 9వ స్థానంలో ఉన్నట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. బెల్జియం, యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ కన్నా వెనక స్థానంలో అమెరికా నిలుస్తోంది.

జాతీయ చిత్రం ఏమిటి?

రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం గత వారాంతానికి 20 రాష్ట్రాలలో వైరస్ కేసులు పెరిగినట్లు నమోదైంది.

నార్త్ కరోలినా, విస్కాన్సిన్, ఆర్కన్సాస్ రాష్ట్రాలలో వైరస్ సోకే వారి సంఖ్య పెరిగింది.

చికాగో, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీలో కూడా కేసులు ఎక్కువగానే ఉన్నాయి.

వైరస్‌కి కేంద్రంగా మారిన న్యూ యార్క్‌లో మరణాల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఒక్క న్యూ యార్క్‌లోనే 21000 మంది మరణించారు.

న్యూయార్క్‌లో ఒక సమయంలో ప్రతి రోజు వందల కొద్దీ మరణాలు చోటు చేసుకున్నాయి. హాస్పిటళ్లు రోగులతో నిండిపోగా , హాస్పిటళ్ళ బయట కూడా తాత్కాలిక మార్చురీలని నిర్మించే పరిస్థితి ఏర్పడింది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

ప్రభుత్వం ఏమంటోంది?

ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇంతకు 25 రెట్లు మరణాలు చోటు చేసుకునేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. విమర్శకులు మాత్రం ప్రభుత్వం ఈ విపత్తుకి సకాలంలో స్పందించలేదని ఆరోపించారు.

వైరస్ వలన వచ్చే ముప్పుని రాష్ట్ర గవర్నర్లు కూడా కనిపెట్టి చర్యలు తీసుకోలేకపోయారని నిందించారు.

మొదట్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ట్రంప్ ఇది కూడా సాధారణ జలుబు లాంటిదే అంటూ ఈ వైరస్ పట్ల అలసత్వం ప్రదర్శించారు. వైరస్ వ్యాప్తి తమ దేశంలో నియంత్రణలోనే ఉందని ఏప్రిల్ కల్లా ఈ వైరస్ అంతమైపోతుందని ఫిబ్రవరిలో ప్రకటించారు.

ఆయన 50000 నుంచి 60000 వరకు మరణాలు ఉండవచ్చని తర్వాత లక్ష లోపు ఉండవచ్చని అంచనా వేశారు.

అమెరికాలో ఎక్కువ ఇన్ఫెక్షన్‌లు ఉండటానికి కారణం తాము విస్తృతంగా పరీక్షలు నిర్వహించడమే అని చాటుకున్నారు.

అమెరికా ఇంకా కొంచెం ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇంకొక 36000 మరణాలు నివారించగలిగి ఉండేదని కొలంబియా విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనం పేర్కొంది.

ట్రంప్ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు జో బిడెన్ వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకి తన సంతాప సందేశాన్ని తెలియచేసారు. మరణించిన వారి కుటుంబాల బాధని దేశం అంతా పంచుకుంటుందని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

నెమ్మదిగా తెరుచుకుంటున్న పబ్లిక్ స్థలాలు

ఫొటో సోర్స్, REUTERS

లాక్ డౌన్‌ని ఎలా సడలిస్తున్నారు?

ఒక వైపు మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థకి ఊతమివ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రాల వారీగా అన్ని వ్యాపారాలు, సేవలని తెరవమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ మహమ్మారి వలన ఇప్పటికే 3.9 కోట్ల మంది ప్రజలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు.

ఫ్లోరిడా రాష్ట్రంలో నెలకొన్న ప్రపంచంలోనే అతి పెద్ద థీమ్ పార్క్ వాల్ట్ డిస్నీ వరల్డ్ కూడా జూలై 11వ తేదీ నుంచి తెరవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

జులై 4వ తేదీ నుంచి లాస్ వేగాస్‌లో ఉన్న క్యాసినోలు కూడా తెరుచుకుంటాయి. ఇక్కడ ఉద్యోగులకి తరచుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సంస్థ చెబుతోంది.

ప్రస్తుతం కోవిడ్ 19కి వ్యాక్సిన్ కానీ,ప్రత్యేక చికిత్స కానీ అందుబాటులో లేదు.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ఏమిటి?

గత 24 గంటల్లో బ్రెజిల్‌లో 1086 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాలు 25,598 కి చేరాయి. బ్రెజిల్‌లో 411821 మంది వైరస్ బారిన పడ్డారు.

ఆస్ట్రేలియాలో గురువారం నుంచి జాతీయ రగ్బీ లీగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ, ఆటగాళ్లు, అధికారులు అవసరమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది.

దక్షిణ కొరియాలో సుమారు 24 లక్షల మంది పిల్లలు స్కూళ్ళకి వెళ్లడం మొదలు పెట్టారు. ఈ దేశంలో తక్కువ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.

యూరోపియాన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ సభ్య దేశాలకి గ్రాంట్లు, లోన్లు ఇవ్వడానికి 825 బిలియన్ డాలర్ల రికవరీ నిధిని ప్రతిపాదించింది.

యూకేలో భారీగా వైద్య పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మెడిటరేనియన్ దేశాలకి విహార యాత్రకి వచ్చిన వారెవరికయినా వారి దేశంలో ఉండగా వైరస్ సోకితే వారి వైద్యానికయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సైప్రస్ దేశం ప్రకటించింది.

కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల ధరని ఎక్కువ చేసి సరఫరా చేస్తున్నారనే అభియోగంపై వైద్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రి కేంద్రాల పై ఈక్వెడార్ పోలీసులు రైడ్లు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)