హర్మన్‌ప్రీత్ కౌర్: టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

వెస్టిండీస్‌ గయానాలో శుక్రవారం ప్రారంభమైన ఐసీసీ మహిళా వరల్డ్ టీ-20 టోర్నీ మొదటి మ్యాచ్‌లో భారత్ న్యూజీలాండ్‌ను 34 పరుగుల తేడాతో ఓడించింది.

ఈ మ్యాచ్‌లో సెంటరీ చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త చరిత్ర సృష్టించారు.

ఆమె కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు న్యూజీలాండ్‌ ముందు 195 పరుగుల లక్ష్యం ఉంచింది.

హర్మన్‌ప్రీత్ చేసిన ఈ సెంచరీ మహిళా టీ-20 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున మొదటి శతకంగా నిలిచింది.

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Reuters

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 103 పరుగులు చేసింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. భారత జట్టు ప్రారంభంలో తడబడింది. రెండో ఓవర్ మొదటి బంతికే తానియా భాటియా 9 మాత్రమే పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యింది.

మొదటి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 59 పరుగులు చేసింది. జెమీమా, హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం అందించారు.

19వ ఓవర్‌లో రోడ్రిగ్స్‌ను జెస్ వాట్కిన్ బౌలింగ్‌లో స్టంప్డ్ అయ్యింది. 20 ఓవర్ ఐదో బంతికి హర్మన్‌ప్రీత్ డివైన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చింది.

భారత జట్టు నిర్ధారిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ ఓపెనర్ సుజీ బేట్స్ 67 పరుగులు చేసింది. తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కేటీ మార్టిన్(39) మినహా ఆటగాళ్లెవరూ అద్భుతాలు చేయలేకపోయారు.

దీంతో, న్యూజీలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

హర్మన్‌ప్రీత్ ఎవరు?

పంజాబ్‌లోని మోగాలో 1989 మార్చి 8న పుట్టిన హర్మన్‌ప్రీత్‌కు క్రికెట్‌తో పాటు సినిమాలు, పాటలు, కారు నడపడం అంటే ఇష్టం. బాలీవుడ్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేను ఆమె చాలా సార్లు చూసింది.

హర్మన్‌ప్రీత్ 2009లో తొలి వన్డే ఆడింది. 2013లో ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి మహిళా క్రికెట్‌లో తనదైన ముద్ర వేసింది.

28 ఏళ్ల కుడిచేతి బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

మిడిలార్డర్‌లో జోరుగా ఆడే హర్మన్‌ప్రీత్‌తో ఒకేసారి మూడు బిగ్ బ్యాష్ లీగ్ జట్లు సైన్ చేయించుకోవాలని తహతహలాడాయి.

హర్మన్ ప్రీత్

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఆమె 'సిడ్నీ థండర్స్‌'తో ఆడేందుకు ఒప్పుకుంది. హర్మన్‌ప్రీత్ సిడ్నీ థండర్స్‌తో ఏకంగా ఏడు కాంట్రాక్టులు సైన్ చేసిన తొలి భారతీయ(మహిళలు, పురుషుల్లో) క్రికెటర్‌గా నిలిచింది.

2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళా టీ-20 క్రికెట్‌లో అతిపెద్ద విజయం నమోదు చేసింది. 31 బంతుల్లో 46 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ ఈ మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించింది.

2013లో హర్మన్‌ప్రీత్ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో మిథాలీరాజ్‌కు విశ్రాంతి ఇచ్చారు. 2016లో మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారత టీ-20 జట్టు పగ్గాలు అప్పగించారు.

టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్. అది ఎందుకో హర్మన్ టీ-20 వరల్డ్ టోర్నీ మొదటి మ్యాచ్‌తోనే చెప్పింది.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)