వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దినేష్ ఉప్రేతి
- హోదా, బీబీసీ ప్రతినిధి
షేర్ల ద్వారా లాభం ఎలా వస్తుంది? దీనికి కచ్చితమైన సమాధానం ఎవరి వద్దైనా ఉందీ అంటే, అది వారెన్ బఫెట్ వద్దే.
ఆయన ప్రపంచంలోనే అతి ధనవంతుడైన మదుపుదారుడు లేదా ఇన్వెస్టర్.
వారెన్ బఫెట్ వద్ద కోట్ల రూపాయల ధనం ఉంది. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.
ఇటీవల ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం, ఆయన హోల్డింగ్ కంపెనీ బెర్క్షైర్ హాతవే వద్ద సుమారు రూ.7.75 లక్షల కోట్ల నగదు ఉంది. అది భారతదేశంలోని బ్యాంకులన్నిటి వద్దా ఉన్న మొత్తం రూ.9 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల కన్నా కొద్దిగా మాత్రమే తక్కువ.
బెర్క్షైర్ హాతవే వద్ద ఉన్న నగదుతోనే ఆయన ప్రస్తుత షేరు ధర ఆధారంగా భారతదేశంలోని టీసీఎస్ కంపెనీని సులభంగా కొనేయగలరు. టీసీఎస్ మార్కెట్ విలువ ఇటీవలే రూ.6.7 లక్షల కోట్లకు (100 బిలియన్ డాలర్లు) చేరింది. వంద బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన మొదటి భారత కంపెనీ అదే.
2017, డిసెంబర్ 31న ప్రకటించిన బెర్క్షైర్ హాతవే పోర్ట్ఫోలియో ప్రకారం వారెన్ బఫెట్కు అమెరికన్ ఎయిర్ లైన్స్లో 10 శాతం వాటా ఉంది. యాపిల్లో 4.75 శాతం, అమెరికన్ ఎక్స్ప్రెస్లో 17.5 శాతం షేర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మరి భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
పెట్టుబడులు పెట్టడంలో వ్యూహకర్తగా పేరొందిన వారెన్ బఫెట్ ఎందుకు అభివృద్ధి చెందుతున్న భారత్, చైనా లాంటి దేశాలలో పెట్టుబడులు పెట్టడం లేదు? అదీ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ రెండూ కూడా అతి వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలు అని చెప్పిన తర్వాత కూడా?

పేటీయంలో బెర్క్షైర్ హాతవే రూ.2500 కోట్ల పెట్టుబడి
భారత్కు చెందిన పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికాకు చెందిన బెర్క్షైర్ హాతవే సంస్థ 27 ఆగస్టు 2018వ తేదీన ప్రకటించింది. అయితే, ఈ ప్రక్రియలో వారెన్ బఫెట్ జోక్యం చేసుకోలేదని తెలిపింది. బెర్క్షైర్ సంస్థ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు వారెన్ బఫెట్ ఎందుకు విముఖంగా ఉన్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదికే ముందు, వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ రారాజుగా ఎలా ఎదిగారన్నది పరిశీలించాలి.

ఫొటో సోర్స్, Getty Images
వారెన్ బఫెట్ నేపథ్యం ఏమిటి?
వారెన్ బఫెట్ 1930, ఆగస్టు 30న నెబ్రెస్కాలోని ఒమాహా నగరంలో జన్మించారు.
ఆయనకు యాపిల్లో షేర్లు ఉన్నా, ఆయన వద్ద మాత్రం యాపిల్ ఫోన్ లేదు. ఆయన ఐఫోన్ కాదు కదా, కనీసం స్మార్ట్ ఫోన్లు కూడా వాడరు. ఇంకా పాత ఫ్లిప్ ఫోన్లే వాడతారు.
2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన, ''నేను 20-25 ఏళ్లు వాడిన తర్వాత కానీ దేన్నీ పారేయను'' అన్నారు.
87 ఏళ్ల వారెన్ బఫెట్ మొట్టమొదటిసారిగా 11 ఏళ్ల వయసులో షేర్లు కొన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు మొదటిసారి పన్ను చెల్లించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేట్ జెట్ ఉన్నా పాతకారులోనే ప్రయాణం
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వారెన్ బఫెట్ పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తున్నారు కానీ ఒకప్పుడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆయనకు సీటు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ ఆయనను మాస్టర్స్ డిగ్రీతో సత్కరించింది.
ఫోర్బ్స్ పత్రిక ప్రకారం బఫెట్ తన మొదటి 3-బెడ్ రూం అపార్ట్మెంట్ను 1958లో కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఆయన అందులోనే నివసిస్తున్నారు.
2014 వరకు బఫెట్ ఎనిమిదేళ్ల క్రితం కొన్న పాత కారులోనే ప్రయాణించేవారు. ఆ తర్వాత జనరల్ మోటార్స్ సీఈఓ ఎలాగోలా అప్గ్రేడెడ్ కార్ తీసుకునేలా ఆయనను ఒప్పించారు. బఫెట్కు సొంత ప్రైవేట్ జెట్ ఉంది. దానిని వ్యాపార అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
తన జీవితంలో ఆయన ఎంతో సంపాదించినా, ఖర్చు చేయడం అంటే మాత్రం ఆయనకు ఇష్టం లేదు. తన ఆదాయంలో 99 శాతాన్ని ఆయన విరాళాలుగా ఇస్తున్నారు. ఆయన పేరుతో ట్రస్ట్ లేకున్నా ఆయన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2010-11లోనే భారత్లో ప్రవేశించే యత్నం
ఇక మనం మొట్టమొదట లేవనెత్తిన ప్రశ్న వైపు వెళ్దాం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో బఫెట్ ఎందుకు పెట్టుబడి పెట్టరు అన్న దానికి కారణాలను పరిశీలిస్తే - రిస్క్ ఉన్న చోట పెట్టుబడులు పెట్టడానికి వారెన్ బఫెట్ దూరం. ఆయన ఎప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడులనే పెడతారు.
అయితే భారత్ లాంటి దేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఆయనేమీ వ్యతిరేకం కాదు. ఆయన హోల్డింగ్ కంపెనీ బెర్క్షైర్ హాతవే 2010-11లోనే భారత్లోని బీమా రంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. భారతదేశం ఆనాడు బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అయితే రెండేళ్లు ప్రయత్నించిన తర్వాత వారెన్ బఫెట్ తన ప్రయత్నాలను విరమించుకున్నారు.
భారత్లోని రెడ్ టేపిజం ఒక సమస్య కాగా, అమెరికా, జపాన్ లాంటి ఆర్థిక వ్యవస్థలతో లావాదేవీలు నిర్వహించిన బఫెట్కు భారతదేశంలో ఉండే పేపర్ వర్క్ చాలా కష్టంగా అనిపించింది.
భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుండవచ్చు కానీ, విధానాలు, నిర్వహణా వ్యవస్థ విషయానికి వస్తే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని ఆర్థికవేత్త సునీల్ సిన్హా అంటారు.
ఇక్కడ ప్రతి అంశం రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువస్తే, ఎన్నికల్లో మరో పార్టీ దాన్ని తోసిపుచ్చుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం చాలా కష్టం.

ఫొటో సోర్స్, Getty Images
వారెన్ బఫెట్ రూటే వేరు!
ఒక బ్రోకరేజీ సంస్థలో రీసెర్చ్ హెడ్గా పని చేస్తున్న ఆసిఫ్ ఇక్బాల్, వారెన్ బఫెట్ వ్యూహాలు చాలా భిన్నమైనవని అంటారు. ఆయన పెట్టుబడులను ఎక్కువగా సమర్థమైన మేనేజ్మెంట్ కలిగిన కంపెనీలలో పెడతారు. అంతే కాకుండా ఆయన పెట్టుబడి పెట్టే కంపెనీల వాల్యుయేషన్ కూడా బాగుండాలి.
''వారెన్ బఫెట్కు భారత, చైనాల ఆర్థిక వ్యవస్థ గురించి అంచనా లేదని కాదు. కానీ ప్రత్యక్షంగా భారత్, చైనాలలో పెట్టుబడి పెట్టే బదులు అదే రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలలో ఆయన పెట్టుబడి పెడతారు. అందుకే ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్, గ్యాస్ కంపెనీ ఎక్సన్లో పెట్టుబడులు పెట్టారు. ఎక్సనే భారతదేశంలోని రిలయెన్స్ లాంటి కంపెనీలలో భాగస్వామి అవుతున్నపుడు ఇక వేరేగా భారతదేశంలో ఎందుకు పెట్టాలి?'' అని ఇక్బాల్ అన్నారు.
''మరో ప్రమాదం - ఎక్స్చేంజ్ రేటు. అది దేశంలోని ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్, కంపెనీల పారదర్శకత కూడా మరో కారణం. భారత్ చైనాలలో అవి అంత బాగా లేవు. కింగ్ ఫిషర్, జేపీ గ్రూప్లనే తీసుకోండి. అవి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని మునిగిపోయాయి'' అని సిన్హా వివరించారు.
భారతదేశంలో పెట్టుబడులకు బఫెట్ దూరంగా ఉండడానికి ఇక్కడ రెగ్యులేషన్లలో పారదర్శకత లేకపోవడం కూడా ఒక కారణమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒడిశా: పార్సల్ బాంబు నిందితుణ్ని అతడి ఉత్తరమే పట్టించింది
- సావిత్రిని తలచుకుంటే బాధ, సంతోషం రెండూ చుట్టుముడతాయి - కీర్తి సురేష్
- సెక్స్ ఎడిక్షన్: ఇది నిజంగా ఒక సమస్యా? లేక అపోహా?
- కాలాన్ని అరగంట ముందుకు జరిపిన ఉత్తరకొరియా
- #లబ్డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- దేశ ఆర్థిక వృద్ధిపై పాస్పోర్ట్ల ప్రభావం ఎంత?
- పవన్ కల్యాణ్కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
- అమెరికా-చైనా ట్రేడ్ వార్: భారత్పై ప్రభావం ఎంత?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








