గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి

ఫొటో సోర్స్, AFP
గాజాలోని హమాస్ లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. తమపై రాకెట్లతో దాడులకు దిగిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
శనివారం ఉదయమే అక్కడి సైనిక స్థావరాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది.
కాల్పుల వల్ల ఇద్దరు చనిపోయినట్లు గాజాలోని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ, కాల్పులకు దిగడంతో ఇప్పటికే నలుగురు చనిపోయారు.
శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ లక్ష్యంగా గాజా నుంచి మూడు రాకెట్లతో దాడులు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించినప్పటి నుంచీ ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
జెరూసలేం తమ రాజధాని అని ఇజ్రాయెల్ భావిస్తుంది. కానీ, తూర్పు జెరూసలేంను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిందని పాలస్తీనియన్లు ఆరోపిస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
తాజా పరిణామాలు
- రెండు రోజుల నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతోంది. ఆయుధగారాలే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది.
- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో హమాస్ మిలిటరీ కేంద్రం వద్ద ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజాలోని షిఫా ఆస్పత్రి వెల్లడించింది. వైమానిక దాడులు ప్రారంభమైన 24 గంటల్లోనే నలుగురు మృతి చెందగా, 160 మంది గాయపడ్డారు. శుక్రవారం గాజాలో ఘర్షణలు చెలరేగడంతో ఇజ్రాయెల్ సైనికులు అక్కడి గుంపుపై కాల్పులు జరపగా ఇద్దరు చనిపోయారు.
ఇజ్రాయెల్ పై మూడు రాకెట్లు దూసుకొచ్చాయని, అయితే ఇందులో ఒక రాకెట్ను తమ రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది.
మిగిలిన రెండింటిలో ఒకటి నిర్మానుష్యప్రాంతంలో పడిందని, మరొకటి స్డేరోట్ పట్టణంలో పడిందని తెలిపింది.
కాగా, శుక్రవారం హమాస్ నేత ఫతీ అహ్మద్ మాట్లాడుతూ, ఎవరైనా తమ దౌత్య కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించడానికి ప్రయత్నిస్తే వాళ్లు పాలస్తీనియన్లకు శత్రువులవుతారని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ, జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా స్పష్టంగా గుర్తించామని చెప్పారు.
సుస్థిర శాంతి ఒప్పందం సాధించేందుకు అమెరికా కట్టుబడి ఉన్నదని ఆమె స్పష్టం చేశారు. ఐరాస పక్షపాత వైఖరితో ఉందని ఆరోపించారు.
ఇజ్రాయెల్ పట్ల అత్యంత ప్రతికూల వైఖరి అవలంభిస్తున్న వాటిల్లో ఐరాస ముందువరుసలో ఉందని నిందించారు.
'ఇజ్రాయెల్ భద్రతను పట్టించుకోనివారెవైనా సరే.. అది ఐక్యరాజ్యసమితి కావొచ్చు, వివిధ దేశాల కూటమైనా కావొచ్చు.. ఒప్పందం చేసుకునేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి చేయడం తగదు' అని హేలీ అన్నారు.
శుక్రవారం ప్రార్థనల అనంతరం పాలస్తీనా నేతలు ఆందోళనకు పిలుపునివ్వడంతో వెస్ట్ బ్యాంక్ వైపు జరగబోయే హింసను అడ్డుకునేందుకు అదనపు దళాలను ఇజ్రాయెల్ మోహరించింది.
వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఘర్షణలు చెలరేగడంతో 217 మంది పాలస్తీనియన్లు గాయపడినట్లు వైద్యులు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ ప్రకటన తర్వాత శుక్రవారం అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి.
వేలాదిమంది పాలస్తీనియన్ల మద్దతుదారులు జోర్డాన్, ఈజిప్ట్, ఇరాక్, టర్కీ, ట్యునీషియా, ఇరాన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘనిస్థాన్, ఇండియా పాలిత కశ్మీర్, ఇండోనేసియాలలో కూడా ఆందోళనలు జరిగాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








