కాటలోనియా వివాదంలో మరో మలుపు

ఫొటో సోర్స్, Reuters
కాటలోనియా వివాదం మరో మలుపు తిరిగింది. స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారో.. లేదో చెప్పాలని స్పెయిన్ ప్రధాన మంత్రి మరినో రజాయ్ కాటలోనియాకు తేల్చిచెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు డైరెక్ట్ రూల్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమని సంకేతాలిఇచ్చారు.
రాజ్యాంగం ప్రకారం కాటలోనియా స్వయంప్రతిపత్తిని రద్దు చేసే చర్యల్లో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. కాటలోనియా స్వాతంత్ర్య ప్రకటనపై ఆదేశ నాయకులు మంగళవారం సంతకాలు చేశారు.
కానీ చర్చల కోసం దాని అమలును వాయిదా వేశారు.
కాటలోనియాలో వివాదాస్పద ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పటి నుంచి స్పెయిన్లో సంక్షోభం తలెత్తింది.
ఈ రెఫరెండం చట్ట విరుద్దమని స్పెయిన్ రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఓటేసిన 43శాతం మంది ప్రజల్లో సుమారు 90 శాతం మంది కాటలోనియా స్వాతంత్రానికి మద్దతు తెలిపారు.
స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకిస్తున్న చాలామంది ఓటర్లు రెఫరెండాన్ని బహిష్కరించారు.
పోలింగ్లో అక్రమాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
కాటలోనియా అధ్యక్షుడు కార్లెస్ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని స్పెయిన్ ప్రధాని రజాయ్ చెప్పారు.
పరిస్థితి చక్కబడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్టికల్ 155 ప్రకారం అందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








