హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విధాన్షు కుమార్
- హోదా, బీబీసీ కోసం
ఆయన తల మీద ఒత్తయిన నల్లని జుట్టు, ఒంటి మీద ఆకర్షణీయమైన పచ్చబొట్లు, క్రికెట్ ఆడేటప్పుడు ప్రదర్శించే ప్రత్యేక శైలి వివియన్ రిచర్డ్స్ను తలపిస్తుంది. "జీవితాన్ని రాజాలా జీవించాలి" హార్దిక్ పాండ్యా జీవితాదర్శం.
హార్దిక్ ఆకర్షించే వ్యక్తిత్వం ఆయన క్రికెట్ ఆడే శైలిలో కనిపిస్తుంది. ఆయన ఆటను గెలవడం మాత్రమే కాదు, ఆడే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది.
భారత జట్టులో పాండ్యా ప్రాధాన్యాన్ని ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి చాటుకున్నారు.
పాండ్యా బౌలింగ్ ధాటితో 3 ముఖ్యమైన పాకిస్తాన్ వికెట్లను పడగొట్టారు. ఆట కీలకమైన దశలో బరిలోకి దిగి ప్రశాంతంగా బ్యాటింగ్ మొదలుపెట్టి 17 బంతులకు 33 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్ లో ఆరు పరుగులు చేసి భారత్ కు విజయాన్ని చేకూర్చారు.
ఈ విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ, ఆఖరి ఓవర్ లో 15 పరుగులు అవసరమైనా కూడా చేసి ఉండేవాడినని అన్నారు.
ఈ ఆట ఆఖరి ఓవర్లలో ఉండగా క్రికెట్ అభిమానుల ఉత్కంఠ పెరిగింది. "హార్దిక్ పాండ్యా ఆట నుంచి తప్పుకుంటే తప్ప పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలుస్తుందని ఊహించడం కష్టం. ఆయన ఎలాంటి స్కోర్ అయినా చేయగలరు" అని క్రికెట్ వ్యాఖ్యాత వకార్ యూనస్ అన్నారు.
జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని ప్రత్యర్థి జట్టు ప్రశంసించడం హార్దిక్కు దక్కిన అత్యంత పెద్ద గౌరవం అని చెప్పొచ్చు.
ఒకప్పుడు సచిన్ గురించి ఇలాంటి మాటలే వినిపించేవి. విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి గౌరవాన్నే దక్కించుకున్నారు. ప్రస్తుతం తక్కువ ఓవర్ల క్రికెట్ లో ఈ ట్యాగ్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్రౌండర్
"బ్యాట్, బంతి రెంటితోనూ మ్యాచ్కు విజయాన్ని తేగలగడం హార్దిక్ పాండ్యా ప్రత్యేకత. ఆసియా కప్ మ్యాచ్లో భారత్ కు పాకిస్తాన్కు మధ్య ఉన్న తేడా ఇదే" అని మాజీ పాకిస్తాన్ కెప్టెన్, వ్యాఖ్యాత వసీం అక్రమ్ అన్నారు.
బరిలోకి ఆరవ బౌలర్గా, బ్యాట్స్మ్యాన్గా ఐదవ స్థానంలో అడుగుపెట్టి మ్యాచ్ ను గెలిపించారు. ఇలాంటి ప్రతిభ చాలా కొన్ని జట్లకు మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఇటువంటి నైపుణ్యం లేదని అన్నారు.
పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు మంది బౌలర్లతోనే ఆడుతోంది. అందులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు.
ఆఖరి ఓవర్లలో పాకిస్తాన్ నాల్గవ ఫాస్ట్ బౌలర్ మిస్ అయ్యారు. నసీం షా, రౌఫ్లకు కండరాలు పట్టేయడంతో చాలా కష్టంగా ఓవర్లను పూర్తి చేశారు.
పాకిస్తాన్ ఆఖరి ఓవర్లో స్పిన్నర్తో ఆడించాల్సి వచ్చింది. పాకిస్తాన్ దగ్గర కూడా హార్దిక్ లాంటి ఆల్రౌండర్ ఉండి ఉంటే పాకిస్తాన్ 147కు పైగా పరుగులు చేసి ఉండేది.

ఫొటో సోర్స్, ANI
షార్ట్ బాల్స్
సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్ లో పాకిస్తాన్ ఉత్తమమైందని, ఈ దేశం ఫాస్ట్ బౌలర్లకు కర్మాగారం లాంటిదని అంటారు.
ఈ మ్యాచ్ లో కూడా నసీం షా, దహానీ లాంటి నైపుణ్యవంతులైన యువ బౌలర్లు ఉన్నారు. కానీ, భారత్ జట్టులో ఉన్న పేసర్లు ఫాస్ట్ బౌలర్లను కూడా ఓడించారు. ఈ మొత్తం ఆటలో పాండ్యా కీలకమైన పాత్ర పోషించారు.
భారత్ జట్టులో పేసర్లు మొత్తం 10 వికెట్లను పడేయడం మాత్రమే కాకుండా, మొదటి 5 వికెట్లను కూడా షార్ట్ పిచ్ బాల్స్, బౌన్సర్ల తో ఓడించారు.
ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ రిజ్వాన్ వికెట్లను పాండ్యా షార్ట్ బాల్స్ ద్వారానే పడగొట్టారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
గుర్తు పెట్టుకునే కొన్ని క్షణాలు
హార్దిక్ పాండ్యా గతంలో చాలా సార్లు ఓటమి అంచుల వరకూ వెళ్లిన ఆటను కూడా విజయం వైపు నడిపించిన సందర్భాలున్నాయి.
2018లో టీ 20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచేందుకు ఆఖరి 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన అవసరముంది. ఆ సమయంలో పాండ్యా ఒకే ఒక్క పరుగు ఆధిక్యంతో బంగ్లాదేశ్ పై విజయం అందించారు.
ఆఖరు 3 బంతుల్లో భారత్ 3 వికెట్లను పడగొట్టింది.
పాండ్యా 19 ఓవర్ 4వ బంతికి వేగంగా పరుగులు చేస్తున్న ముష్ఫికర్ను అవుట్ చేశాడు. తర్వాత బంతికే మహ్మదుల్లా వికెట్ తీశాడు. ముస్తాఫిజుర్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు.
మూడు బంతుల్లో, రెండు పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో మహమ్మదుల్లా, ముష్ఫికర్ లాంటి ఆటగాళ్లు బరిలో ఉండగా, విజయం వారిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థితిలో కూడా హార్దిక్ పాండ్యా తన ప్రయత్నాన్ని వదలలేదు. ఆయనకు ఓడే అలవాటు లేదు. ప్రయత్నించడాన్ని ఆయన ఎన్నడూ విరమించుకోలేదు. ఈ వైఖరి ఈ మ్యాచ్ లో భారత్ కు ప్రయోజనాన్ని చేకూర్చింది.
పాకిస్తాన్తో జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాండ్యా తన సత్తాను చాటుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో 338 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఫకార్ జమాన్ 100 పరుగులు చేశారు. మొహమ్మద్ అమీర్ వేగం ముందు రోహిత్, కోహ్లీ, 33 పరుగులకే వెనక్కి రావల్సి వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లో కూడా పాండ్యా ఆశలు వదులుకోలేదు. వరుస పెట్టి నాలుగు, ఆరు పరుగులు చేశారు. జడేజాతో కలిసి ఆడుతున్నప్పుడు రన్ అవుట్ అయ్యారు.
భారత్ జట్టు 30 ఓవర్లలో 158 పరుగులు మాత్రమే చేసింది. కానీ, పాండ్యా చివరి వరకు ఆడి ఉంటే ఆట గెలిచేందుకు లక్ష్యాన్ని తప్పకుండా సాధించి ఉండేవాడు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ టైటన్లకు ఐపీఎల్ ట్రోఫీ
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ తొలి టోర్నమెంట్లోనే గుజరాత్ టైటన్ ట్రోఫీని గెలుచుకున్నారు.
ఆయనను ముంబయి ఇండియన్స్ జట్టులోకి తీసుకోలేనప్పుడు హార్దిక్ గుండె ముక్కలయింది. కానీ, గుజరాత్ జట్టులో మాత్రం భయపడకుండా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు.
ఆయన గుజరాత్ టైటన్కు కెప్టెన్గా వ్యవహరిస్తూ చెన్నై, ముంబయి జట్టులను ఓడించారు.
గత ఏడాది జరిగిన టీ- 20 ప్రపంచ కప్లో పాండ్యా గాయపడ్డారు. ఆ గాయం తర్వాత ఆయన చాలా రోజుల పాటు క్రికెట్ ఆడలేదు.
కానీ, తర్వాత జరిగిన టోర్నమెంట్లో బ్యాట్, బంతితో ఆయన తన ప్రతిభను చాటారు. ఈ టోర్నమెంట్ లో 487 పరుగులు సాధించి 8 వికెట్లను పడగొట్టారు.
ఆదివారం పాకిస్తాన్లో జరిగిన మ్యాచ్లో కూడా హార్దిక్ ఇదే విధమైన ప్రతిభను కనబరిచారు.
నాలుగేళ్ల క్రితం హార్దిక్ దుబాయిలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడ్డారు.
ఆయన నడుముకు గాయం అవ్వడంతో ఆట మధ్యలోనే స్ట్రెచర్ పై మైదానం లోంచి బయటకు తీసుకుని వెళ్లారు.
గత ఆదివారం జరిగిన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్తో భారత్ జట్టుకు విజయాన్ని చేకూర్చారు. అభిమానులు, తోటి క్రీడాకారులు చేసిన అభివాదాన్ని స్వీకరించారు.
హార్దిక్ పాండ్యా కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఆయనకు అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాతీ సంగీతంతో స్వాగతం పలికారు
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం హార్దిక్ పాండ్యాకు దక్కుతున్న జనాదరణను ఆసక్తితో చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













