చైనాతో భారత్ వ్యాపారం సరిహద్దు ఉద్రిక్తతలో సంబంధం లేకుండా ఎందుకు పెరుగుతోంది?

ఫొటో సోర్స్, @MEAINDIA
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ నెల ప్రారంభంలో, భారతదేశం తన తొలి మేడ్ ఇన్ ఇండియా తేలికపాటి విమానం 17-సీట్ల డోర్నియర్ను వినియోగంలోకి తెచ్చింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు మారుమూల నగరాలను అస్సాంలోని దిబ్రూఘర్తో కలుపుతుంది. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.
భారతదేశం స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఇది తాజా ఉదాహరణ. రెండేళ్ల కిందట అంటే 2020 మే 12న, భారతదేశాన్ని స్వావలంబన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. ఇందుకోసం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించారు.
దీనిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ "వోకల్ ఫర్ లోకల్" వంటి ఆకర్షణీయమైన నినాదాన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసి దేశం మెచ్చుకుంది. ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలు దీనిని 'గేమ్ ఛేంజర్' అని అభివర్ణించారు.
చైనాతో ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో స్వయం సమృద్ధిగా మారాలన్నది ప్రధాని తీసుకున్న పెద్ద నిర్ణయం. భారతదేశంలోని ప్రజలు చైనాపై అకస్మాత్తుగా కోపం తెచ్చుకోవడం, చాలామంది తమ 'మేడ్ ఇన్ చైనా' వస్తువులను ధ్వంసం చేయడం, చైనా వస్తువులను కొనకూడదని నిర్ణయించుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అదే క్రమంలో, మోదీ ప్రభుత్వం డజన్ల కొద్దీ చైనీస్ యాప్లను నిషేధించింది. చైనా నుంచి వచ్చే అనేక ఎలక్ట్రానిక్ వస్తువులకు కస్టమ్స్ నుండి క్లియరెన్స్ పొందడంలో ఇబ్బంది మొదలైంది. చైనా వస్తువులకు బదులు భారత్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించింది ప్రభుత్వం.
అయితే గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చైనాలో తయారైన వస్తువుల దిగుమతి వేగంగా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఇటీవల భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు, ఈ వాణిజ్యం సుమారు $130 బిలియన్లు (రూ.99,45,44,85,00,00,)కు చేరుకుంది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 44 శాతం ఎక్కువ.
ఈ కాలంలో, భారతదేశం చైనా నుండి $ 103.47 బిలియన్ల (రూ. 79,14,86,52,21,000) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇది గత సంవత్సరం $ 66 బిలియన్ల (రూ. 50,48,59,08,00,000) కు దగ్గరగా ఉంది. చైనాకు భారతదేశం ఎగుమతులు కూడా 202-21లో $17.51 బిలియన్ల (రూ.13,39,40,64,38,000 )నుండి 2021-22 నాటికి $26.46 బిలియన్ల( 20,24,02,59,48,000) కు పెరిగాయి.

భారత్-చైనా లలోని నిపుణులు ఈ తాజా గణాంకాలను ఎలా చూస్తారు?
చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం పెరగనుంది. ఇది మూడు కారణాల వల్ల జరుగుతుంది.
ఒకటి, స్కేల్ ఆఫ్ ఆపరేషన్, టెక్నాలజీ, గ్లోబల్ వాల్యూ చెయిన్స్ (GVC) పరంగా చైనా ఈ ప్రాంతంలోని ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. రెండవది, భారతదేశపు స్వావలంబన విధానం చైనాకు వ్యతిరేకంగా లేదు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా పరిమితులను తగ్గించడమే దీని లక్ష్యం.
అందువల్ల, స్వావలంబన అనేది ఇతర దేశాల మీద ఆధారపడటానికి ముగింపు కాదని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మూడవది, మనం ఒక ఎగుమతి ప్రధాన దేశంగా ఉండాలంటే, ఒక దిగుమతి ప్రధాన దేశంగా కూడా ఉండాలి. దాని ధర కారణంగా చైనా భారతదేశానికి అత్యంత ముఖ్యమైన దిగుమతి వనరు. అలాగే చాలా వస్తువులకు ఇప్పటికే సప్లై చైన్లు ఉన్నాయి.
చైనాతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి ఉన్న మార్గం ఏమిటంటే, సప్లై చైన్ రెసిలియెన్స్ ఇనిషియేటివ్ (ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం ఉన్నాయి), ఇంకా చైనా ప్లస్ వన్ (చైనాలో మాత్రమే పెట్టుబడి పెట్టకుండా ఉండే వ్యాపార వ్యూహం)పై దృష్టి పెట్టడం. అయితే, ఈ రెండింటిలో భారతదేశానికి ఆశించిన ఫలితాలు రాలేదు.
చైనాతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి మరో మంచి మార్గం కొత్తగా భారత్-చైనా వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కోసం చర్చలు జరపడం. ఇందులో సరుకులే కాకుండా పెట్టుబడులు కూడా ఉండాలి. సేవలలో వ్యాపారం కోసం మార్కెట్లకు యాక్సెస్ను కూడా పెంచాలి.
ఇటువంటి ఒప్పందం రెండు దేశాలు ఒకదానికొకటి సుంకంలో ఎంత రాయితీని ఇవ్వగలదో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
RCEP (ది రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్) ఒప్పందంలో ఇది ఒక ప్రధాన అవరోధంగా ఉందని మనకు తెలుసు. ఎందుకంటే భారతదేశం RCEP లో చేరడం వల్ల చైనా నుండి దిగుమతులు గణనీయంగా పెరుగుతాయని భారతీయ పరిశ్రమ విశ్వసించింది.
నవంబర్ 2019లో చర్చల నుండి భారతదేశం వైదొలిగిన తర్వాత ఇప్పుడు కేవలం 15 దేశాలు మాత్రమే ఈ గ్రూపులో ఉన్నాయి. ఈ దేశాల మధ్య వర్తకం సాగే 90% కంటే ఎక్కువ వస్తువులపై సుంకాలను తొలగించాలని RCEP బ్లాక్ ప్రయత్నిస్తోంది.
అటువంటి పరిస్థితిలో, భారతదేశం, చైనా కొత్త ఒప్పందంపై చర్చలు జరిపితే, భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాల కోసం బాగా ప్రయత్నించవచ్చు. అలాగే చైనాకు భారతీయ ఎగుమతులను పెంచడానికి మెరుగైన మార్కెట్ యాక్సెస్ను కనుగొనవచ్చు.
ఈ విధంగా చైనాతో వాణిజ్య అసమతుల్యతను భారత్ తగ్గించుకోవచ్చు. ఇంకా వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ప్రోత్సహించాలి.
అలాగే, చైనా సేవల రంగంలో భారత్ మెరుగైన మార్కెట్ యాక్సెస్ను పొందగలిగేలా సేవలను కూడా ఈ ఒప్పందంలో చేర్చాలి. RCEP లో చర్చల సమయంలో ఇండియా కోరిన ఈ సేవల ఒప్పందం విజయవంతం కానప్పటికీ, చైనాతో ద్వైపాక్షిక స్థాయిలో ఇది బాగా సాధ్యమవుతుంది.
భారత్-చైనా వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం కుదిరితే అది పెద్ద విషయమే. ఇది అనేక స్థాయిల్లో పరస్పరం ఆధారితంగా ఉంటుంది.
ఇదే కాకుండా, రాబోయే కాలంలో భారతదేశం RCEPలో చేరడానికి అవకాశాలను సృష్టిస్తుంది. తద్వారా భారత్కు, చైనాకు లాభదాయకంగా ఉంటుంది. ఇటీవల ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఈ వాణిజ్య ఒప్పందం ఇండియా-చైనాల మధ్య కూడా ఇది జరగొచ్చు అనడానికి ఉదాహరణగా మారింది.

భారత్-చైనా సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం పురోగమిస్తోంది. ఇక్కడ మూడు విషయాలు ముఖ్యమైనవి. మొదటిది, ఇండియా- చైనా భారతదేశ వాణిజ్య సంబంధాలు భౌగోళిక రాజకీయ పరిస్థితుల కంటే ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటాయి.
రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారం వారి జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నంత వరకు, దాని అభివృద్ధిని అంతర్గత, బాహ్య శక్తులు ఏవీ సులభంగా ఆపలేవు.
రెండవది, సరిహద్దు సమస్య. ఇది చైనా-భారత్ సంబంధాలలో ఒక చిన్నభాగం మాత్రమే. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా సరిహద్దు పరిస్థితిని నియంత్రించినట్లయితే, ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా క్షీణించవు. ఈ విషయాన్ని చైనా పదే పదే నొక్కి చెప్పింది.
మూడవది, భారత్, చైనాలు ఆర్థిక, వాణిజ్య రంగంలో పరస్పరం ఆధారపడటం, వాణిజ్య సంబంధాల సౌలభ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులకు, ముఖ్యంగా ఎనర్జీ, ఫెర్టిలైజర్స్, ఫుడ్ విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంది.
దురదృష్టవశాత్తు, యుక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా, నాటో, యూరోపియన్ యూనియన్లు అనుసరిస్తున్న విధానం శాంతియుత పరిష్కారానికి మార్గం చూపడం లేదు. ఇది ప్రపంచ సరఫరా గొలుసు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పైగా ఇది చైనా, ఇండియాల జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండదు.
రష్యా ప్రధాన వస్తు సరఫరాదారులలో ఒకటి కాబట్టి, రష్యాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడం భారత్, చైనాలకు ఖచ్చితంగా సరైన ఆప్షన్. నిరాధారమైన ఆరోపణలు, పశ్చిమ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ చైనాలు తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి.
ఈ రెండూ ఉమ్మడి ప్రయోజనాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి లేదా జాతీయ స్థాయిలో సానుకూల మార్పు తీసుకురావడంలో వీటికి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి.
చైనా, భారత్లు పరస్పరం వ్యతిరేకంగా పనిచేస్తే ఈ లక్ష్యం కలగానే మిగిలిపోతుంది. అందువల్ల, ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధిని ఆపడానికి ఈ రెండు దేశాలకు ఎలాంటి కారణం లేదు.
ఇవి కూడా చదవండి:
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల రీకాల్: ‘విదేశీ టెక్నాలజీ’ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయా?
- LIC ఐపీఓ వచ్చేసింది... షేర్లకు ఎలా దరఖాస్తు చేయాలి, పాలసీదార్లకు రాయితీ ఎంత?
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













