Kajal Aggarwal: బాడీ షేమింగ్‌, ట్రోలింగ్‌పై స్పందించిన హీరోయిన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ - ప్రెస్ రివ్యూ

కాజల్ అగర్వాల్

ఫొటో సోర్స్, instagram/kajalaggarwalofficial/

బాడీ షేమింగ్‌కు సంబంధించి జరిగిన ట్రోలింగ్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ స్పందించారని సాక్షి ఒక కథనం రాసింది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌పై బాడీ షేమింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఇటీవల ట్రోలింగ్ జరిగింది. ఈ విషయంపై కాజల్ ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఇలా ఉంది.

'వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా జీవితంలోనే అత్యంత కీలకమైన దశలో ఉన్నాను. ఈ సమయంలో నాపై కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్స్ నాకు నిజంగా ఏ విధంగానూ ఉపయోగపడవు.

కొంచెం దయతో ఉండటం నేర్చుకోండి. అది కష్టంగా అనిపిస్తే మీ జీవితాన్ని మీరు జీవించండి. పక్కవారిని జీవించనివ్వండి.

గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట పెద్దదవుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్‌ మార్క్స్‌ కూడా ఏర్పడుతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. సాధారణ సమయంలో కంటే ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా అలిసిపోతాం, మూడ్‌ స్వింగ్స్‌ కూడా ఉంటాయి.

బిడ్డ పుట్టాక మళ్లీ మునుపటిలా అవడానికి కొంత సమయం పట్టవచ్చు, లేదంటే మునుపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు కూడా. అయినా సరే, ఏం పర్లేదు. ఈ మార్పులన్నీ సర్వసాధారణమే.

మన జీవితాల్లోకి ఓ పాపాయి రాబోతుందన్నప్పుడు వాటన్నింటినీ పట్టుకుని వేలాడుతూ అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవకండి. చిన్నారికి జన్మనివ్వడం అనేది వేడుక అన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చారు కాజల్ అగర్వాల్.

2020 అక్టోబరులో గౌతమ్ కిచ్లూతో కాజల్ వివాహం జరిగింది.

మహిళ

ఫొటో సోర్స్, ugc

చెంప పగలగొట్టి..కాలితో తన్ని..

తన ద్విచక్ర వాహనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో విజయవాడ నగరం గవర్నర్‌పేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఒక మహిళ వీరంగం సృష్టించిందని ఈనాడు కథనం ప్రచురించింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్. విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం బస్సు తీసుకుని ప్రకాశం రోడ్డులో వెళ్తున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆంధ్ర ఆస్పత్రికి ఎదురుగా నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డొచ్చింది. ముసలయ్య బ్రేకు వేయగా బస్సు మహిళ సమీపంలోకి వెళ్లి ఆగింది.

ఈ ఆకస్మిక పరిణామంతో సదరు మహిళ ఆగ్రహంతో తిట్టుకుంటూ బస్సు ఎక్కి డ్రైవర్‌పై దాడి చేసింది. డ్రైవర్‌ను కొట్టి, చొక్కా చింపి, కాలితో తన్నింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అప్పలరాజు

ఫొటో సోర్స్, twitter/Telugu Desam Party

'చొక్కా పట్టుకుని లాగేస్తా..'

తనను అవమానించారంటూ ఏపీ పశు సంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులను తిట్టారని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. బుధవారం ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ శారదా పీఠం సందర్శన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ముఖ్యమంత్రి రావడానికి అరగంట ముందే మంత్రి అప్పలరాజు కొందరు అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. వారంతా పీఠంలోనికి వెళ్లబోగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆరిలోవ ఇన్‌చార్జి సీఐ సీహెచ్‌ రాజులనాయుడు అభ్యంతరం వ్యక్తంచేశారు.

నిబంధనల ప్రకారం మంత్రిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని చెప్పారు. మిగిలిన వారిని అనుమతించలేమని స్పష్టం చేశారు.

తన వెంట ఉన్న వారిని కూడా లోపలకు పంపించాలని మంత్రి కోరగా... సీఐ ససేమిరా అన్నారు.

అయితే... ఈ సందర్భంగా సీఐ తనను ఉద్దేశించి అనుచిత పదం వాడారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.

అప్పటికే లోపలికి వెళ్లిపోయిన సీఐని బయటికి రప్పించాలని డిమాండ్‌ చేశారు. మంత్రితోపాటు ఉన్న అనుచరులు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో సమీపంలోనే ఉన్న ద్వారకానగర్‌ ఏసీపీ మూర్తి వచ్చి... తెలియక జరిగిపోయిందని, లోపలికి రావాలని కోరినప్పటికీ మంత్రి ససేమిరా అన్నారు.

''నచ్చితే రా... లేకుంటే దొబ్బేయ్‌ అంటాడా? వాడిని రమ్మనండి. వాడికి తెలియక కాదు...పోయేకాలం! ఏయ్‌ బాబూ ఏయ్‌! తమాషా చేస్తున్నావా? చొక్కా పట్టుకుని లాగేస్తా! ఎలాక్కనిపిస్తున్నా నీకు? ఎలాక్కనిపిస్తున్నా?'' అని అక్కడున్న పోలీసులను చేత్తో తోశారు.

ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ అక్కడకు వచ్చి మంత్రికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా... 'అన్నా...నీకు తెలియదు. ఆ సీఐ ఎంతగా అవమానించాడో. ఆ భాష ఏమిటి'' అంటూ పీఠం లోపలకు వెళ్లేందుకు నిరాకరించారు.

''నేను లోపలకు రావాలంటే... అతను బయటకు రావాలి! మీరు ఏం చేయనక్కర్లేదు. సీపీని రమ్మనండి'' అంటూ భీష్మించుకు కూర్చున్నారు.

అక్కడే ఉన్న మరొక సీఐ కల్పించుకుని 'ఆ సీఐ బయటికి రారు' అని చెప్పడంతో... 'మా సీఎం గారిని కలిసేందుకు వచ్చాం. మీరు ఇచ్చిన గౌరవానికి ధన్యవాదాలు' అంటూ అప్పలరాజు తన అనుచరులతో వెళ్లిపోయారు అని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

వీడియో క్యాప్షన్, కోవిడ్ మాత్రల వచ్చేశాయి

'ఒక్క రోజులోనే కరోనావైరస్ తం'

కరోనావైరస్‌ ట్రీట్‌మెంట్‌కు కొత్త మందు అందుబాటులోకి వచ్చిందని వెలుగు కథనం రాసింది.

వైరస్‌ను ఒక్కరోజులోనే ఖతం చేసే నైట్రిక్ ఆక్సైడ్‌ నాసల్ స్ప్రేను గ్లెన్‌మార్క్ ఫార్మా బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

కెనడాకు చెందిన శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన ఈ నాసల్ స్ప్రేని ఫాబిస్ప్రే పేరిట మార్కెట్ చేయనున్నట్లు గ్లెన్‌మార్క్ ప్రకటించింది.

అయితే, మందు ధర ఎంతన్నది మాత్రం సంస్థ ప్రకటించలేదు.

ఇది ఒకే రోజులో వైరస్ లోడ్‌ను 94శాతం తగ్గిస్తుందని కంపెనీ చెప్పింది. పేషెంట్లకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ రావని ప్రకటించింది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)