'ఆర్ఆర్ఆర్' మార్చి 25న రిలీజ్, 'ఆచార్య' విడుదల ఏప్రిల్ 29కి వాయిదా: ప్రెస్ రివ్యూ

ఆర్ఆర్ఆర్

ఫొటో సోర్స్, Twitter/RRR movie

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటూ మరిన్ని తెలుగు సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది.

ఈ సినిమాను కోవిడ్ పరిస్థితులను బట్టి మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ రెండు తేదీలు కాకుండా మరో కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మార్చి 25న ఆర్ఆర్ఆర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించిన సినిమా ఆచార్య. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా పరిస్థితుల వల్ల ఏప్రిల్ 1కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"భారీ అంచనాలున్న రెండు చిత్రాలు ఇలా తక్కువ గ్యాప్‌లో విడుదల కావడం సరికాదు. అందుకే మా ఇరు చిత్ర నిర్మాతలు చర్చలు జరిపి విడుదల తేదీల్ని సర్దుబాటు చేసుకున్నాం" అని ఆ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

పరిస్థితులన్నీ కుదుటపడితే అదే తేదీకి సినిమా తీసుకొస్తామని, లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది.

మరోవైపు మొదటి నుంచీ అనుకున్నట్లు ఎఫ్3 సినిమాను ఏప్రిల్ 28నే విడుదల చేస్తామని ఆ చిత్ర బృందం మరోసారి స్పష్టత ఇచ్చిందని ఈనాడు రాసింది.

దోపిడీ

ఫొటో సోర్స్, Getty Images

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర దోపిడీ

సిద్ధిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర పట్టపగలు కాల్పులు జరిపిన కొందరు దుండగులు భారీగా నగదు దోచుకున్నారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన వకుళాభరణం నర్సయ్యకు స్థానిక హౌసింగ్‌బోర్డులో ఓపెన్‌ ప్లాటు ఉంది.

దీన్ని తొగుట మండలం గుడికందులకు చెందిన శ్రీధర్‌రెడ్డికి విక్రయించారు. సోమవారం సిద్దిపేట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పెట్టుకున్నారు.

శ్రీధర్‌రెడ్డి అప్పటికే కొంత నగదును నర్సయ్యకు అందజేయగా.. మిగతా మొత్తం రూ.43.50 లక్షల నగదును రిజిస్ట్రేషన్‌కు కొద్ది సమయం ముందు అప్పగించారు.

ఈ మొత్తాన్ని నర్సయ్య తన కారులో పెట్టి డ్రైవర్‌ పరశురామ్‌కు జాగ్రత్తలు చెప్పి.. సంతకం పెట్టేందుకు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వెళ్లారు.

రెండే రెండు నిమిషాల్లో..డ్రైవర్‌ పరశురాం తన సీట్లో కూర్చుని ఉండగా ఇద్దరు ఆగంతుకులు బైక్‌పై వచ్చారు. కారు డోర్లు దించాలని పరశురామ్‌కు సైగ చేశారు.

అతను అడ్డంగా తలూపుతూ వారి తీరును అనుమానించాడు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో కారును స్టార్ట్‌ చేసి, ముందుకు పోనిచ్చాడు.

అంతే.. ఇద్దరు ఆగంతుకుల్లో ఒకడు తుపాకీతో డ్రైవర్‌ వైపున్న కారు విండోను పగులగొట్టాడు. డబ్బున్న బ్యాగును తీసుకునేందుకు యత్నించగా.. పరశురామ్‌ అడ్డుకున్నాడు.

దాంతో.. డ్రైవర్‌ తొడపై దుండగుడు తుపాకీతో కాల్చాడు. మరో దుండగుడు వెనకవైపు డోర్‌ నుంచి డబ్బు సంచీని తీసుకున్నాడు. ఇద్దరు ఆగంతుకులు డబ్బు సంచీతో బైక్‌పై పారిపోయారు.

డ్రైవర్‌ పరశురామ్‌ బుల్లెట్‌ గాయంతోనే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి పరుగెత్తి.. తన యజమాని నర్సయ్యకు విషయం చెప్పాడు.

ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారుతుందని తెలిసిన వ్యక్తులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అమ్మిన వ్యక్తి నర్సయ్య తనకెవరూ శత్రువులు లేరని.. ప్లాటు కొన్న వ్యక్తి శ్రీధర్‌రెడ్డిపైనే అనుమానం ఉందని చెప్పారు.

శ్రీధర్‌రెడ్డి మాత్రం తనకేం సంబంధం లేదని కొట్టిపారేస్తున్నట్లు తెలిసింది. డాక్యుమెంట్‌ రైటర్లు, ఇతర సిబ్బంది, మధ్యవర్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు.

సిద్దిపేట సీపీ శ్వేత రంగంలోకి దిగి, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో దుండగులను పట్టుకునేలా ఓ బృందాన్ని నియమించారు. క్లూస్‌ టీంతో కొన్ని ఆధారాలు సేకరించారు.

9 ఎంఎం పిస్టల్‌తోపాటు సంఘటన వద్ద పడిన బుల్లెట్‌(పరశురామ్‌ తొడలోంచి దూసుకుపోయి.. బయట పడ్డ తూటా), బుల్లెట్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరశురామ్‌ను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, FB/@DGPTELANGANA

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ స్టేషన్

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఒక పటిష్టమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తులు చేస్తోందని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటుపై పోలీస్‌ శాఖ రూపకల్పన చేస్తోంది.

అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విభాగాలపై అధ్యయనం చేస్తున్న పోలీస్‌ శాఖ పటిష్టమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు రూపుదిద్దుకోబోతున్న విభాగానికి ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ హోదా కలిగి ఉండాలని భావిస్తోంది.

ఎందుకంటే ప్రత్యేకమైన నేరాలను విచారించబోతున్న ఈ విభాగానికి కేసు నమోదు చేసుకొని చార్జిషీట్‌ వేసే అధికారం కల్పిస్తేనే వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడం సులభతరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో ఉన్న నేర పరిశోధన విభాగం (సీఐడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లాగా నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ (ఎన్‌ఓసీసీసీ) విభాగం కూడా విధులు నిర్వర్తించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది.

ఇలా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్, సంబంధిత ఇతర నేరాల కేసులు నమోదు చేసే అధికారం, స్థానిక పోలీస్‌స్టేషన్ల నుంచి కేసులు బదలాయించుకొని విచారణ చేసే అధికారం ఈ యూనిట్‌కు ఉంటుంది.

పదవీ విరమణ జీవో జారీ

ఫొటో సోర్స్, fb/ap govt

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంచుతూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిందని ప్రజాశక్తి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చేలా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్దీకరణ) చట్టం - 1984ను సవరించారు.

ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌-1ను సోమవారం విడుదల చేసింది. ఆ వెంటనే ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పదవీ విరమణ వయస్సును పెంచాలని తీర్మానం చేసిన రాష్ట్ర మంత్రిమండలి, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించగా, ఆయన చట్ట సవరణ ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు.

అనంతరం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో 2014 వరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఉండగా, అప్పటి ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో, పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు.

తాజాగా మరోసారి చట్టాన్ని సవరించి, రిటైర్మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. రాష్ట్రంలో సగటు జీవిత కాలం 73 ఏళ్లగా ఉండటంతోపాటు సాధారణ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడినట్లు ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)