నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్: లతా మంగేష్కర్ ఇక లేరు.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాయని

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం 8.12 గంటలకు ముంబయిలో మరణించారు. ఆమె వయస్సు 92 ఏళ్లు. కోవిడ్19 సోకడంతో గత 28 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పలు అవయవాలు పనిచేయకపోవడం వల్ల తుదిశ్వాస విడిచారని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సందాని ప్రకటించారు.
లతా మంగేష్కర్. ఆమె పాట వినని భారతీయులు ఉండరు. ఆమె భారత జాతీయ సంపద. భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక. సినీ సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి. ఎనిమిది దశాబ్దాల పాటు కొన్ని తరాలను తన గాన మాధుర్యంలో ఓలలాడించారు. అతి తక్కువే అయినా కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
‘నైటింగేల్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలుచుకునే లతా మంగేష్కర్.. 36 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడారు. ఆమె పాటల రికార్డులు లక్షల్లో అమ్ముడయ్యాయి.
బాలీవుడ్ గాయనిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన లతాకు.. క్రికెట్ అన్నా, కార్లు అన్నా చాలా ఇష్టం. వేగాస్ కేసినోల్లో సరదాగా జూదమాడటమూ ఆమెకు ఇష్టమే.
సినిమా పాటల్లో అనేక భావోద్వేగాలను పలికించే లతా మంగేష్కర్, జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.

ఫొటో సోర్స్, facebook/LataMangeshkar
ఎన్నడూ బడికి వెళ్లలేదు...
1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జన్మించారు లతా మంగేష్కర్. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్తానీ సంగీతంలో దిట్ట. మరాఠీ రంగస్థల నటుడు కూడా. ఐదుగురు పిల్లల్లో ఆమే పెద్దది. ఆమె ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు. తమ ఇంట్లో పని మనిషి ఆమెకు మరాఠీ అక్షరమాల నేర్పించారు. స్థానిక పూజారి ఒకరు ఆమెకు సంస్కృతం నేర్పారు. బంధువులు, ట్యూషన్లు చెప్పే గురువులు ఇతర పాఠ్యాంశాలు బోధించారు.
లతా మంగేష్కర్కు తొలి సంగీత గురువు ఆమె తండ్రే. దీనానాథ్ శిష్యులకు సంగీతం నేర్పుతూ ఉంటే గమనిస్తూ ఉండేది చిన్నారి లత. ఒకసారి శిష్యులు తప్పుగా ఆలపిస్తున్న రాగాన్ని తాను సరి చేస్తుండగా తన తండ్రి గమనించారని లతా మంగేష్కర్ చెప్పే వారు.
అప్పుడే లతలోని సంగీత ప్రతిభను ఆయన గుర్తించారు. తొమ్మిదేళ్ల వయసులో తొలిసారి తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చారు లతా మంగేష్కర్.
అయితే ఆమె తండ్రి ఆర్థికంగా దెబ్బతిని, తన నాటకాల కంపెనీని మూసేయటంతో కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో వారి ఇంటిని వేలం వేయటంతో.. కుటుంబం పూనా (ఇప్పుడు పుణె) నగరానికి నివాసం మారింది.

ఫొటో సోర్స్, facebook/LataMangeshkar
ఇష్టం లేని ‘నటన’...
లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 1942లో మరణించారు. అప్పటికి లతా మంగేష్కర్ వయసు 13 ఏళ్లు. పెద్ద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక కష్టాలు. లతా మంగేష్కర్కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. పెద్ద కూతురుగా తల్లికి అండగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత తీసుకున్నారు లతా మంగేష్కర్.
వారి కుటుంబం బొంబాయి (ఇప్పుడు ముంబై) నగరానికి వలసొచ్చింది. లత సంగీతం నేర్చుకుంటూనే మరొక వైపు సినిమాల్లో పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించారు.
అయితే.. 1940వ దశకం తొలి నాళ్లలో పాటలు ఎక్కువగా ఉండేవి కాదు. దీంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించటం మొదలు పెట్టారు.
కానీ సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె మనసంతా పాట మీదనే ఉండేది. ఎనిమిది మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు.
తొలి బ్రేక్...
లతా మంగేష్కర్ కుటుంబానికి సన్నిహితుడైన నాటి మరాఠీ సినిమా దర్శకుడు మాస్టర్ వినాయక్ ఆమెకు అండగా నిలిచారు. ఆయన సాయంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేయడం, పాటలు పాడటం ప్రారంభించారు లతా మంగేష్కర్.
1942లో తీసిన మరాఠీ చిత్రం పహెలీ మంగళ గౌర్లో చిన్న వేషం వేయడంతో పాటు ఒక పాట కూడా పాడారు లత. మాస్టర్ వినాయక్ తన మకాంను ముంబయికి మార్చడంతో ఆయనతోపాటు అక్కడకు చేరుకున్నారు లతా మంగేష్కర్.
ముంబయిలో లతా మంగేష్కర్కు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ హిందుస్తానీ సంగీతం నేర్పారు. ఆ సమయంలోనే సినిమాల్లో పాటలు పాడటానికి చిన్నచిన్న అవకాశాలు రావటం మొదలైంది. 1947లో ఆమె నెలకు 200 రూపాయలు సంపాదించేవారు.
1948లో మాస్టర్ వినాయక్ చనిపోవడంతో లతకు మెంటార్గా మారారు సంగీత దర్శకుడు గులాం హైదర్. లత సంగీత జీవితంలోకి గులాం హైదర్ ప్రవేశం ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. సింగర్గా ఆమెను తీర్చిదిద్దడంతోపాటు లత కెరియర్లో తొలి బ్రేక్ కూడా ఇచ్చారు గులాం హైదర్.
1948లో విడుదలైన మజ్బూర్ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘దిల్ మేరా తోడా’ అనే పాట ఓ సూపర్ హిట్. ఆ తరువాత 1949లో అశోక్ కుమార్, మధుబాల నటించిన మహల్ మూవీతో మరొక హిట్ సాధించారు లతా మంగేష్కర్.

ఫొటో సోర్స్, facebook/LataMangeshkar
సినిమా స్వర్ణయుగంలో...
బాలీవుడ్ అప్పుడే స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోంది. సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్నారు లతా మంగేష్కర్. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఆమె పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి.
1950ల నాటికి హిందీ సినిమాలో సింగర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు లతా మంగేష్కర్. పాకీజా, మజ్బూర్, ఆవారా, ముఘల్-ఎ-ఆజం, శ్రీ 420, ఆరాధన.. 20 ఏళ్ల పాటు ధియేటర్లలో ఆడిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే.. వంటి ఎన్నో సినిమాల్లో ఆమె చిరకాలం నిలిచిపోయే పాటలు పాడారు.
చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళులర్పిస్తూ.. ‘ఎ మేరె వతన్ కె లోగో...’ అంటూ ఆమె ఓ బహిరంగ సభలో పాట పాడినప్పుడు నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
1940లలో మధుబాల మొదలుకుని 1990లలో కాజోల్ వరకూ బాలీవుడ్లో ప్రతి కథానాయికకూ లతా మంగేష్కర్ తన గొంతుతో పాట పాడారు. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి అగ్ర గాయకులతో గొంతు కలిపారు. రాజ్ కపూర్ నుంచి గురుదత్ వరకూ, మణి రత్నం నుంచి కరణ్ జోహార్ వరకూ అగ్రస్థాయి దర్శకులతో కలిసి పనిచేశారామె.

ఫొటో సోర్స్, Getty Images
మకుటం లేని మహారాణి...
భారతీయ సినిమా 2023 నాటికి 110 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ప్రయాణంలో దాదాపు 75 ఏళ్లు భారతీయ సినిమాలో విడదీయలేని భాగంగా కొనసాగారు లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలకుపైగా సాగిన లత సంగీత కెరియర్లో ఆమె గాన మాధుర్యాన్ని ఎన్నో తరాలు ఆస్వాదించాయి.
మొహమ్మద్ రఫీ వంటి అగ్రస్థాయి గాయకుడిని సవాల్ చేసేంత సాహసం లతా మంగేష్కర్ సొంతం. మెరుగైన పారితోషికం, రాయల్టీలు కావాలని డిమాండ్ చేసిన తొలి గాయని ఆమే.
‘‘నేను సొంతంగా ఎదిగిన మనిషిని. పోరాటం నేర్చుకున్నాను. నాకు ఎప్పుడూ, ఎవరన్నా భయం లేదు. నాకసలు భయమే లేదు’’ అని ఆమె ఒక సందర్భంలో చెప్పారు.
‘‘అతి శుద్ధమైన ముత్యంలాగా ఆమె స్వరం, గానం స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది’’ అని ప్రఖ్యాత బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అక్తర్ అభివర్ణించారు.
లతా మంగేష్కర్ తన సోదరి, మరో ప్రముఖ సినీ గాయని ఆశా భోంస్లేతో కలిసి కూడా అప్పుడప్పుడూ పాటలు పాడారు.
1988లో వచ్చిన నాగార్జున, శ్రీదేవిల ఆఖరి పోరాటం సినిమాలో ఎస్పీ బాలుతో కలిసి ఆమె ఒక పాట పాడారు. ఇళయరాజా ఆ సినిమాకు మ్యూజిక్ అందించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతరత్న పురస్కారం...
సినీ పరిశ్రమకు చేసిన లతా మంగేష్కర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి.
1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, 1999లో పద్మవిభూషణ్ ఆమెను వరించాయి. 2001లో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు లతా మంగేష్కర్.
కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత భారతరత్న అందుకున్న ఏకైక గాయకురాలు లతా మంగేష్కరే.
ప్రముఖ తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పేరు మీద నెలకొల్పిన నేషనల్ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. ఇవే కాక అనేక నేషనల్, ఫిలింఫేర్ అవార్డులతోపాటు ఫ్రాన్స్, రష్యా, నేపాల్ వంటి దేశాల నుంచి కూడా పురస్కారాలు అందుకున్నారు ఆమె.

ఫొటో సోర్స్, facebook/LataMangeshkar
క్రికెట్, కార్లు, కాసినోలు...
సినిమా పాటలకు ఆవల.. లతా మంగేష్కర్ సంగీత రుచులు చాలా ఉద్విగ్నభరితంగా ఉంటాయి.
మొజార్ట్, బీథోవెన్, చోపిన్, నాట్ కింగ్ కోల్, బీటిల్స్, బార్బరా స్ట్రీసాండ్, హారీ బెలాఫోంట్ వంటి దిగ్గజాల సంగీతం, పాటలు ఆమెకు చాలా ఇష్టం. మార్లీన్ డీట్రిక్ స్టేజి మీద పాడుతుండగా చూడటానికి వెళ్లారు. ఇనగ్రిడ్ బెర్జ్మన్ నాటకాలను ఆమె ఎంతో అభిమానించారు.
సినిమాలు చూడటం కూడా లతా మంగేష్కర్కు చాలా ఇష్టం. ‘ద కింగ్ అండ్ ఐ’ ఆమె ఫేవరేట్ హాలీవుడ్ మూవీ. కనీసం పదిహేను సార్లు ఆ సినిమా చూశానని లతా చెప్తారు. అలాగే ‘సింగింగ్ ఇన్ ద రెయిన్’ కూడా ఆమెకు బాగా నచ్చిన సినిమా. జేమ్స్ బాండ్ సినిమాలు, షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ నవలలూ ఇష్టపడతారు.
కార్లంటే లతకు చాలా మక్కువ. ఒక గ్రే హిల్మన్, ఒక బ్లూ షెవర్లె షిజ్లర్, ఒక మెర్సిడిస్ ఆమె దగ్గర ఉండేవి. ఆమె ఇంట్లో తొమ్మిది కుక్కలు కూడా పెంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లతా మంగేష్కర్ క్రికెట్ అభిమాని కూడా. అప్పుడప్పుడూ పాటల రికార్డింగులకు విరామమిస్తూ.. టెస్ట్ మ్యాచ్లు చూసేవారు. డాన్ బ్రాడ్మన్ సంతకం చేసిచ్చిన ఫొటో ఆమె దగ్గరుంది.
వంట చేయటం, ఫొటోలు తీయటం కొంత కాలం ఆమె హాబీలుగా ఉండేవి. అమెరికాకు సెలవులకు వెళ్లినపుడు.. లాస్ వేగాస్ కాసినోల్లో రాత్రంతా జూదమాడటమూ ఇష్టపడేవారు.
‘‘ఇది చిత్రంగా అనిపించొచ్చు. కానీ సెలవులకు అమెరికా వెళితే లాస్ వేగాస్లో గడపటం నాకు చాలా ఇష్టం. స్లాట్ మెషీన్ల దగ్గర ఆడేదానిని. నాకు అదృష్టం కలిసొస్తుంది. చాలాసార్లు గెలిచాను కూడా’’ అని ఒక ఇంటర్వ్యూలో లత అంగీకరించారు.
‘‘సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోవాలి.. బాధను సొంతానికి ఉంచుకోవాలి.. అని నేను ఎప్పుడూ అనుకుంటాను’’ అని లతా మంగేష్కర్ ఓ సందర్భంలో చెప్పారు.
కలకాలం నిలిచిపోయే ఆమె గానం.. కోట్లాది మంది భారతీయులకు సంతోషాన్నిచ్చింది. నస్రీన్ మున్నీ కబీర్ చెప్పినట్లు ‘‘ఆమె గానం జనం జీవన నేపథ్య సంగీతమైంది’’.
ఇవి కూడా చదవండి:
- షేక్ రషీద్: టీమిండియాను చాంపియన్గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ
- వరుసగా రెండు సిక్స్లు కొట్టి.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
- గాలిచొరబడకుండా సీల్ చేసిన బబుల్.. లోపల జీవితం ఎలా ఉందంటే..
- ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ వివాదం: సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఉద్యోగ సంఘాలు
- 600 రోజులుగా జూమ్లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- ‘నేను ప్రేమించటానికి ఎవరైనా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














