ఏపీ, తెలంగాణ: పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 4,570 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి.

మొత్తం 30,022 మందికి చెందిన శాంపిల్స్ పరీక్షించగా 4,570 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 పాజిటివ్ కేసులు నమోదు కాగా విశాఖపట్నంలో 1,028 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒక్క పశ్చిమ గోదావరి(95) తప్ప మిగతా 12 జిల్లాలలో 100కి పైగా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 53,073 మందికి పరీక్షలు నిర్వహించగా 1,963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,075 కేసులు రికార్డయ్యాయి.

ప్రస్తుతం 22,017 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఏపీ కోవిడ్ బులెటిన్

ఫొటో సోర్స్, APGovernment

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 8 నుంచి మొదలైన సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగిసి సోమవారం(17.01.2022)తో విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉంది.

అయితే, సెలవులు పొడిగించడం మంచిదని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫారసు చేయడంతో జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి, చేపట్టాల్సిన నియంత్రణ చర్యలపై సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది.

ఆదిమూలపు సురేశ్

ఫొటో సోర్స్, FB/AUDIMULAPU SURESH

సెలవులు పొడిగించే ఆలోచన ప్రస్తుతానికి లేదు: ఏపీ విద్యాశాఖ మంత్రి

కాగా తెలంగాణలో సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ అలాంటి నిర్ణయం వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

గుంటూరు జిల్లా కాకమానులోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన దీనిపై స్పందిస్తూ ప్రస్తుతానికి సెలవుల పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటి?

కరోనా కేసుల తీవ్రత కారణంగా అన్ని రాష్ట్రాలలో చర్యలు చేపడుతున్నారు. తమిళనాడులో జనవరి 31 వరకు 10, 11, 12 తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 23,989 కేసులు నమోదవడంతో పాటు 11 మంది మరణించారు.

రాజస్థాన్‌లో వారాంతపు కర్ఫ్యూ కొనసాగుతోంది. శనివారం రాత్రి 11 గంటలకు మొదలైన ఈ కర్ఫ్యూ సోమవారం ఉదయం 5 వరకు ఉంటుంది.

దిల్లీలోనూ వారాంతపు లాక్‌డౌన్ అమలవుతోంది.

త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం 1.03 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా గత 24 గంటల్లో 2,300 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా ఈ రోజు 2,71,202 కొత్త కేసులు నమోదు కాగా 314 మంది మరణించారు.

మొత్తం 7,743 ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు వెలుగుచూశాయి.

ప్రస్తుతం దేశంలో 15,50,377 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)