వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం

పార్లమెంట్

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి.

వాయిదా అనంతరం 12 గంటలకు లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది.

అనంతరం స్పీకర్ లోక్‌సభను తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో కూడా నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టినప్పటికీ.. ఎలాంటి చర్చ లేకుండానే రాజ్యసభ ఈ బిల్లులను ఆమోదించింది.

అనంతరం సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది.

అయితే.. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చ జరపాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చ జరగాలని టీఎంసీ కోరింది. కానీ రైతుల పరిస్థితులపై చర్చించటానికి ప్రభుత్వం భయపడుతోంది. రైతుల తరఫున మాట్లాడటానికి ప్రతిపక్షానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు" అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు.

దానికిముందు కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ట్వీట్ చేస్తూ.. పార్లమెంటులో చర్చించకుండానే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.

16 నెలల కిందట వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో చర్చ లేకుండానే చాలా అప్రజాస్వామికంగా ఆమోదించారని, ఇప్పుడు అదే తరహాలో వాటిని ఉపసంహరించుకుంటున్నారని మండిపడ్డారు.

పార్లమెంట్

ఫొటో సోర్స్, loksabha tv

అంతకుముందు, ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఇటీవల చనిపోయిన సభ్యుల కోసం లోక్‌సభ స్పీకర్ బిర్లా సంతాప సందేశం చదివారు.

సభా కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. శాంతించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.

నినాదాలు కొనసాగటంతో సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు.

దేశం చాలా సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిపై సీరియస్ చర్చ జరగాల్సిన అవసరముందని, సభ సాఫీగా సాగటానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నానని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చెప్పారు.

రైతుల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై కాంగ్రెస్ నాయకుడు మాణిక్కం టాగూర్ వాయిదా నోటీసు ఇచ్చారు.

మొత్తం 25 రోజుల పాటు సాగే ఈ భేటీల్లో వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు సహా 36 బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రతి ప్రశ్నకూ బదులిస్తాం: నరేంద్ర మోదీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతి అంశం మీద చర్చించటానికి, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సమావేశాలు వాయిదాలతో సమయం వ్యర్థమవటానికి బదులుగా.. అర్థవంతమైన చర్చలతో సాగాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

సభ ముందుకు కీలక బిల్లులు

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును (ఫామ్ లాస్ రిపీల్ బిల్లు) ఈ సమావేశాల తొలి రోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ తమ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ సోమవారం సభకు హాజరు కావాలని విప్‌లు జారీ చేశాయి.

కీలకమైన క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

దీనితో పాటు ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్ట్సీ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లులు కూడా ముఖ్యమైనవి.

వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో మళ్లీ తిరిగి తెచ్చే అవకాశంతో పాటు.. పెగాసస్ వివాదం, ధరల పెరుగుదల అంశాలను ప్రతిపక్షం ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)