అమూల్ మిల్క్ కంపెనీలో లక్షమందికి పైగా ముస్లింలను ఉద్యోగాల నుంచి తొలగించారా? - Fact Check

అమూల్ కంపెనీలో పెద్ద ఎత్తున ముస్లిం ఉద్యోగులను తొలగించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమూల్ కంపెనీలో పెద్ద ఎత్తున ముస్లిం ఉద్యోగులను తొలగించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది
    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

"హిందువుల ఐక్యత సాధించే దిశగా మరో అడుగు.. అమూల్ మిల్క్ అధిపతి ఆనంద్ సేథ్ తమ కంపెనీ నుంచి 1 లక్ష 38 వేల మంది ముస్లింలను ఉద్యోగాల నుంచి తొలగించారు. దేశం మీద ఉమ్మేసే జిహాద్‌ను పెట్టుకుని మేము ప్రజలకు మురికి పాలు, పెరుగు, నెయ్యి అందించలేం అని ఆ సంస్థ తెలిపింది. సీఈఓ ఆనంద్ సేథ్ మాట్లాడుతూ, ఆవు మనకు పాలిస్తుంది. దానితోనే మా వ్యాపారం నడుస్తుంది. కానీ, మరో వర్గం ప్రజలు ఆవును కోసుకుని తింటారు. అది మాకు సిగ్గుచేటు. అలాంటి హంతకులను మా సంస్థలో ఉంచలేం అని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అమూల్ పాలకు హృదయపూర్వక ధన్యవాదాలు."

ఈ సందేశం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో పై ఈ మధ్య చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సీఈవో పేరు కరెక్ట్ కాదని బీబీసీ పరిశీలనలో తేలింది
ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సీఈవో పేరు కరెక్ట్ కాదని బీబీసీ పరిశీలనలో తేలింది

ఫ్యాక్ట్ చెక్

భారతదేశంలో అమూల్ పాల గురించి తెలియని వారుండరు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న అమూల్ సంస్థ పాల ఉత్పత్తులు దేశంలోని ప్రతీ మూలకు వెళతాయి.

ఈ సంస్థకు సంబంధించిన పై సందేశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీనిలో నిజానిజాలను పరిశీలించమని అనేకమంది వాట్సాప్ ద్వారా బీబీసీని అడిగారు.

నిజంగానే అమూల్ సంస్థ అలాంటి నిర్ణయం తీసుకుందో లేదో తెలుసుకునేందుకు ఆ సంస్థ ట్విట్టర్ ఖాతా, వెబ్‌సైట్లను క్షుణ్ణంగా పరిశీలించాం.

అలాంటి సమాచారమేమీ బీబీసీకి కనబడలేదు. తర్వాత, నేరుగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధీని సంప్రదించాం.

"ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో మాకు అర్థం కాదు. గత రెండేళ్లల్లో ఒక్క ఉద్యోగిని కూడా మా సంస్థ నుంచి తొలగించలేదు. ఎందుకంటే మా వ్యాపారం అభివృద్ధి పథంలో సాగుతోంది. ఒకవేళ మేము ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసేసినా, అది మతం ప్రాతిపదికన మాత్రం ఎప్పటికీ జరగదు" అని సోధీ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా అమూల్ ఫ్యాక్టరీలలో 16,000 నుంచి 17,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వారందరినీ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేశారు తప్ప సామాజిక, మత ప్రాతిపదికన కాదని సోధీ చెప్పారు.

ఇటీవలి కాలంలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించ లేదని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆర్.ఎస్.సోథీ వెల్లడించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించ లేదని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఆర్.ఎస్.సోథీ వెల్లడించారు

ఆనంద్ సేథ్ ఎవరు?

వైరల్ అయిన సందేశంలో ఆనంద్ సేథ్‌ను అమూల్ సీఈవోగా చెబుతున్నారు. ఇంతకూ ఆనంద్ సేథ్ ఎవరు?

"అమూల్ యజమాని పేరు ఇది కాదు. అమూల్ కంపెనీలో ఈ పేరు గల వాళ్లు ఎవరూ లేరు. అమూల్‌తో కలిసి 36,000 మంది రైతులు పని చేస్తున్నారు. వారంతా వివిధ సామాజిక నేపథ్యాల నుంచి, వివిధ మతాల నుంచి వచ్చినవారు. మా సంస్థ మేనేజ్‌మెంట్‌లో ఆనంద్ సేథ్ పేరు గల వాళ్లెవరూ లేరు" అని సోధీ చెప్పారు.

వాస్తవంలో ఆనంద్ సేథ్ పేరు గల సీఈఓ ఏ కంపెనీకీ లేరని బీబీసీ దర్యాప్తులో తేలింది.

అమూల్ సహకార సంస్థను 1950లో డాక్టర్ వర్గీస్ కురియన్ స్థాపించారు. ఈరోజు ఈ సంస్థ టర్నోవర్ 52 వేల కోట్ల రూపాయలు.

ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 17వేల మంది పని చేస్తున్నారని, గత రెండేళ్లల్లో ఏ ఒక్కరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని అమూల్ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ సందేశం అబద్ధం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)