సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ – ప్రెస్‌రివ్యూ

సంజయ్ దత్

ఫొటో సోర్స్, AFP

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు ఊపిరితత్తుల క్యాన్సర్‌తో సోకినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

శ్వాస సంబంధిత ఇబ్బందితో సంజయ్‌ ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. ఒక రోజు తర్వాత ఇంటికి వచ్చేశారు. పరీక్షల్లో కరోనావైరస్ నెగిటివ్‌ వచ్చిందని మాత్రమే బయటకు తెలిపారు.

అయితే, మంగళవారం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యిందని తెలిసింది.

సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంజయ్‌ ట్వీట్‌ చేశారు. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళే అవకాశం ఉంది.

భార్య హసిన్‌ జహాన్‌‌తో మహ్మద్‌ షమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భార్య హసిన్‌ జహాన్‌‌తో మహ్మద్‌ షమి

అయోధ్యలోని రామ మందిరం భూమి పూజపై హిందువులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో అత్యాచారం చేస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు క్రికెటర్‌ మహ్మద్‌ షమి భార్య హసిన్‌ జహాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

'అయోధ్యలో రామమందిర భూమి పూజ సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు'అని సోషల్‌ మీడియాలో ఇటీవల ఆమె పోస్ట్‌ చేశారు.

'కొందరు ఉద్దేశపూర్వకంగా హింసిస్తున్నారు. దూషిస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. మరికొందరు అత్యాచారం చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుతం నేను నిస్సహాయంగా ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్లో బెదిరింపులు రావడంతో భయంగా ఉంది. దయచేసిన వెంటనే చర్యలు తీసుకోండి'అని కోల్‌కతా సైబర్ నేర‌ పోలీసులకు జహాన్‌ ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై షమీ స్పందించలేదు. ప్రస్తుతం వీరు విభేదాల కారణంగా విడివిడిగా ఉంటున్నారు.

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్ భారీ పెట్టుబడులు

వైద్య పరికరాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

అమెరికా అవతల తన అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించాలని సంస్థ నిర్ణయించింది. ఈ పెట్టుబడులతో హైదరాబాద్‌ మెడికల్‌ డివైజెస్‌ హబ్‌గా కూడా మారే అవకాశముంది.

తెలంగాణ ప్రభుత్వం, మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఈ ప్రాజెక్టుపై రెండేండ్లుగా చర్చలు జరుపుతున్నాయి.

2016లో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించినప్పుడు మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మంగళవారం మంత్రి కేటీఆర్‌తో జరిగిన వర్చువల్‌ సమావేశంలో తమ పెట్టుబడికి సంబంధించి మెడ్‌ట్రానిక్‌ సంస్థ ప్రకటన చేసింది.

మెడ్‌ట్రానిక్‌ ప్రకటనపై కేటీఆర్‌ స్పందించారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతోపాటు ఈ రంగంలో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్‌లో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెలుగు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు.

ఈ నెల 12వ తేదీన మొదటి విడతగా పంజాబ్ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో ప్రారంభించబోతున్నారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.

పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి చదవుతున్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందిస్తామని పంజాబ్ సర్కారు గతంలోనే ప్రకటించింది.

కరోనా సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)