నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష

ఫొటో సోర్స్, DELHI POLICE
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు కొత్తగా డెత్ వారెంట్ జారీ చేసింది.
ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకూ మరణశిక్షను అమలు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఇంతకుముందు వారెంట్ జారీ చేసింది. ఆ ఆదేశాలు వెలువడిన అనంతరం దోషి వినయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
మొదట జనవరి 8న వినయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ కూడా ఆ పిటిషన్ వేశారు.
జనవరి 22న ఉరి శిక్షను అమలు చేయట్లేదని బుధవారంనాడు దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురిలో ఒక దోషి క్షమా భిక్ష కోసం చేసుకున్న అర్జీ ఇంకా రాష్ట్రపతి దగ్గరే ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
నిబంధనల ప్రకారం డెత్ వారెంట్ను అమలు చేయడానికి ముందు క్షమాభిక్షపై తుది నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉందని దిల్లీ ప్రభుత్వం, జైలు యాజమాన్యం కలిసి కోర్టుకు వివరించాయి.
రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించాక కూడా దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి 14 రోజుల గడువు ఇవ్వాలని 2014లో ఒక తీర్పులో భాగంగా సుప్రీం కోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
అసలు నిర్భయ కేసులో ఏం జరిగింది?
దిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి 11 గంటల తర్వాత ఒక యువతి తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. బస్సులో అయిదుగురు పురుషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో ఉన్న స్నేహితుడిని కొట్టారు.
చావుబతుకుల మధ్య ఉన్న వారిద్దరినీ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తీవ్రంగా గాయపడిన నిర్భయ మరణించింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి కోలుకోలేకపోయినా గాయాల నుంచి కోలుకున్న ఆ స్నేహితుడు బతికాడు.
దేశవ్యాప్తంగా స్పందన
నిర్భయకు జరిగిన అన్యాయానికి యావద్దేశం తల్లడిల్లింది. నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.
వారిని ఎప్పుడు ఉరి తీస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ అందుకోసం ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?
2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.
2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.
2012 డిసెంబర్ 29: సింగపూర్లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.
2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.
2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.
2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.
2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

ఫొటో సోర్స్, Getty Images
2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.
2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.
2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.
2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.
2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.
2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.
ఇవి కూడా చదవండి.
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- రేపిస్టులను ఉరి తీయాలనే వాదనలు సరే... బాధితుల బాగోగుల సంగతేమిటి...
- ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ’‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








