సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన

నిరసనలు
    • రచయిత, దీప్తి బత్తిని, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. కొందరు మహిళలు శుక్రవారం రాత్రి మెహదీపట్నంలో ఒక కూడలి వద్దకు చేరుకుని రోడ్డు పక్కనే బైఠాయించారు.

వారికి మద్దతుగా వందలాది యువకులు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకున్నారు.

వారంతా అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, మోదీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్‌ఎస్, ఏబీవీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసులు

ఈ ఆందోళనలకు అనుమతులు లేవని, వెంటనే విరమించాలనీ పోలీసులు వారికి సూచించారు. అయినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు.

రాత్రి 12 గంటల తరువాత పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు కానీ సగానికిపైగా ఆందోళనకారులు అక్కడి నుంచి కదల్లేదు. రోడ్డుపైనే బైఠాయించారు.

మహిళలకు అండగా వారి చుట్టూ వలయంగా నిల్చున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరు పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.

ఆందోళనలో పాల్గొన్న యువతలో చాలామంది అప్పటికీ నినాదాలు చేశారు.. నిర్వాహకులు, పోలీసులు చెప్పినా వినకుండా వారు నినదించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పోలీసు బృందాలు దాదాపు కిలోమీటర్ దూరం వరకు వారిని తరిమేశాయి.

నిరసన

''నేను నా పిల్లల కోసం ఇక్కడకు వచ్చాను. మాకు నిద్ర పట్టడం లేదు. ఈ హిందూ- ముస్లిం వివక్ష మధ్య మా పిల్లలు ఎలా పెరుగుతారు? ఎలా బతుకుతారు వాళ్లు? వాళ్ల భవిష్యత్తుపై భయంతోనే ఇక్కడకు వచ్చాను'' అన్నారు నిర్వాహకుల్లో ఒకరైన మహిళ.

మేం ఎవరికీ పత్రాలు ఇవ్వక్కర్లేదు. ఈ నేలపైనే పుట్టాం. రోజుకు ఐదుసార్లు మా తలను ఇదే నేలకు ఆనించి ప్రార్థనలు చేస్తాం. మేం ఇక్కడ వారిమేనని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నారు సిద్ధిఖ్ అనే వ్యక్తి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)