అబ్దుల్లాపూర్‌మెట్: ‘భూ వివాదంతోనే తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్

ఎమ్మార్వో విజయా రెడ్డి

ఫొటో సోర్స్, UGC

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దారు విజయ రెడ్డిపై ఒక వ్యక్తి పెట్రోలు పోసి, నిప్పంటించాడు.

సోమవారం మధ్యాహ్నం తహశీల్దారు కార్యాలయంలో, ఆమె ఛాంబర్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ విజయ మృతి చెందారు.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి అదే మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు కూర సురేశ్‌ అని పోలీసులు చెబుతున్నారు.

మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దారును కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేశ్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దారు ఛాంబర్‌కు వెళ్లాడని, తలుపులు వేసి, విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో సురేశ్‌తో పాటు తహశీల్దారు డ్రైవర్, మరొక వ్యక్తికి కూడా మంటలు అంటుకుని, గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్ సింగ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తహశీల్దార్ కుటుంబం ఇదీ..

  • తహశీల్దార్ పూర్తిపేరు పుట్టా విజయ రెడ్డి.
  • భర్త సుభాష్ రెడ్డి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్.
  • వీరికి ఇద్దరు పిల్లలు.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
  • స్వగ్రామం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి.
  • 2009 సంవత్సరం గ్రూప్ 2 నియామకాల్లో విజయ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దారు కార్యాలయం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దారు కార్యాలయం

‘భూ వివాదంతోనే హత్య’ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్

ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. భూ వివాదం వల్లనే సురేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు.

‘ప్రాణాలు తీయడం దుర్మార్గం’ - రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విజయ రెడ్డి సజీవ దహనంపై రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. రెవెన్యూ అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప ప్రాణాలు తీయడం దుర్మార్గమని అన్నారు.

ఎమ్మార్వో విజయా రెడ్డి

ఫొటో సోర్స్, UGC

తీవ్రంగా ఖండించిన డిప్యూటీ కలెక్టర్స్, తహశీల్దార్స్ అసోసియేషన్

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయ రెడ్డిది దారుణ హత్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి లచ్చిరెడ్డి, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్ రాములు తెలిపారు.

ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయంలోనే తహశీల్దార్‌ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణమైన సంఘటన అని, విధి నిర్వహణలో తోటి ఉద్యోగిని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని పేర్కొన్నారు.

తహశీల్దారును హత్య చేయడం అమానుషం అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యన్నారాయణ ఒక ప్రకటనలో ఖండించారు.

ఇది ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)