జీడీపీ వృద్ధిరేటు ప్రకారం గత ఆరేళ్లలో అత్యంత దిగువ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీ, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే బలహీనంగా ఉంది.
2019-20 మొదటి త్రైమాసిక గణాంకాలను శుక్రవారం వెల్లడించారు. దాని ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంది.
అదే, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే ఈ వృద్ధిరేటు 5.8 శాతం ఉంది.
ఇది గత 25 త్రైమాసికాల కంటే అత్యంత నెమ్మదిగా ఉన్న త్రైమాసిక వృద్ధి. మోదీ పాలనాకాలంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థికవేత్త వివేక్ కౌల్ చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా అలాగే జరుగుతోందని అంటున్నారు.
పరిశ్రమల్లోని చాల రంగాల్లో అభివృద్ధి రేటు చాలా సంవత్సరాల్లో అతి తక్కువ స్థాయికి చేరుకుంది. దేశం మాంద్యం వైపు వెళ్తోంది.

ఫొటో సోర్స్, Pti
మందగమనమా, మాంద్యమా?
భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలో మందగమనంలో వెళ్లింది.
అంటే వరసగా రెండో త్రైమాసికంలో కూడా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో వెళ్లడం అంటే, మనం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్ట్టే భావించవచ్చా?
ఆర్థిక అంశాల నిపుణుడు, ముంబై వాసి వివేక్ కాల్ "భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగంలో మందగమనం కచ్చితంగా వచ్చింది, కానీ దానిని మాంద్యం అనరు. మాంద్యం లేదా రెసిషన్ అంటే వరుసగా రెండు త్రైమాసికాలు ప్రతికూల వృద్ధి ఉండడం. భారత ఎకానమీలో మందగమనం వచ్చింది. కానీ నెగటివ్ గ్రోత్ అనేది జరగదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ "జూన్లో ముగిసే ఏడాది మొదటి త్రైమాసిక వృద్ధి రేటులో పతనం ఉందంటే, అంతమాత్రాన దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురైందని అనుకోకూడదు" అన్నారు.
"భారత్లో వృద్ధి వేగం నెమ్మదిగా ఉండడానికి చాలా కారణాలు ఉండచ్చు. వాటిలో ప్రపంచంలోని అన్ని ఆర్థికవ్యవస్థల్లో వచ్చిన మందగమనం ఒక పెద్ద కారణం" అని ఆయన చెప్పారు.
భారత ఆర్థికవ్యవస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని కుమార్ తెలిపారు. "ఆర్థిక మంత్రి గత వారం చాలా చర్యలు ప్రకటించారు. పెట్టుబడిదారులు, వినియోగదారుల మూడ్పై దాని సానుకూల ప్రభావం ఉంటుంది. మనం పండుగల సీజన్లలోకి అడుగుపెడుతున్నాం. రెండో త్రైమాసికం నాటికి వృద్ధి రేటులో పెరుగుదల కనిపిస్తుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాంద్యం నిర్వచనం?
ఇది ఒక చికాకు పుట్టించే ప్రశ్న. దీనిపై నిపుణులు ఇప్పటికీ పూర్తిగా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.
టెక్నికల్గా భారత ఆర్థికవ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలో మందగమనంతో ముందుకెళ్తోంది. అంటే వరుసగా ఆరు నెలలుగా అభివృద్ధి వేగంలో తగ్గుదల వచ్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరిగితే, అప్పుడు దీనిని మాంద్యం అనరు.
మాంద్యానికి విభిన్న రూపాలు ఉన్నాయా?
కచ్చితంగా. ఆర్థికవ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో కుంచించుకుపోవచ్చు. కానీ తర్వాత ఆర్థిక సంవత్సరం మిగతా రెండు త్రైమాసికాల్లో రికవర్ కావచ్చు. అప్పుడు నిజానికి మొత్తం ఏడాదికి వృద్ధి రేటులో అభివృద్ధి వస్తుంది.
పశ్చిమ దేశాల్లో దీనిని 'తేలికపాటి మాంద్యం'గా చెబుతున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరం వరుసగా ఆర్థిక వృద్ధి పూర్తిగా పతనమైతే అప్పుడు దానిని 'తీవ్ర మాంద్యం'గా చెబుతారు.
ఇంతకంటే పెద్ద మాంద్యం డిప్రెషన్. అంటే ఏళ్లపాటు ప్రతికూల వృద్ధి
అమెరికా ఆర్థికవ్యవస్థ 1930వ దశకంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంది. దానినే ఇప్పుడు డిప్రెషన్ అనే రూపంలో గుర్తుచేసుకుంటారు. డిప్రెషన్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం తీవ్ర స్థాయికి చేరుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక మాంద్యం
ఆర్థికవ్యవస్థ మానసిక మాంద్యానికి కూడా గురికావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
"ఒకవేళ వినియోగదారుడు అప్రమత్తమై, కొనుగోళ్లు వాయిదా వేస్తే, దానివల్ల డిమాండ్ తగ్గుతుంది. దాని వల్ల ఆర్థిక వృద్ధి రేటులో తగ్గుదల రావచ్చు. ధరలు పెరిగితే, అనిశ్చితి పరిస్థితి ఏర్పడితే తాము మాంద్యంలో ఉన్నామనే విషయం ప్రజలకు తెలిసొస్తుంది" అని వివేక్ కాల్ అంటారు.
భారత్లో మాంద్యం ఎప్పుడొచ్చింది?
భారత ఆర్థికవ్యవస్థలో అతిపెద్ద సంక్షోభం 1991లో వచ్చింది. అప్పుడు దిగుమతుల కోసం దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి 28 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు ఆ మొత్తం 491 బిలియన్ డాలర్లు.
2008-09లో ప్రపంచ మాంద్యం వచ్చింది. ఆ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ 3.1 శాతం వృద్ధి రేటుతో ముందుకు నడిచింది.
"అది అంతకు ముందు ఏళ్లతో పోలిస్తే తక్కువే. కానీ భారత్ ఆ సమయంలో కూడా మాంద్యానికి గురికాలేదని" వివేక్ కాల్ చెబుతారు.
ఇవి కూడా చదవండి:
- విపిన్ సాహు పారాగ్లైడింగ్: ‘రూ.500 ఎక్కువ ఇస్తా, కిందకు దించు బాబోయ్’
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








