'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తెలుగు డెస్క్
- హోదా, బీబీసీ
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రస్తుతం తిత్లీ తుపాను వణికిస్తోంది. ఈ తుపానుకు ‘తిత్లీ’ అనే పేరును పెట్టింది పాకిస్తాన్. ఆ పేరుకు అర్థం... సీతాకోక చిలుక.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఉత్తరాంధ్రను కుదిపేసిన ‘హుద్హుద్’ తుపానుకు ఓమన్ దేశం నామకరణం చేసింది. ‘హుద్హుద్’ అనేది ఓ పక్షి పేరు. ఫైలిన్, నిలోఫర్, లెహర్, దాయె... ఇవన్నీ ఇటీవలి కాలంలో ఆసియాలోని వివిధ ప్రాంతాలను వణికించిన తుపాన్లు. వీటికి ఆ పేర్లను ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలు పెట్టాయి.
నిజానికి ఇలా తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయం అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 1953 నుంచే ఉంది. ఐరాసకు చెందిన ‘వరల్డ్ మెట్రొలాజికల్ ఆర్గనైజేషన్’ ఈ పని చేస్తుంది. కానీ, దక్షిణాసియాలో, మధ్య ప్రాచ్యంలో తుపాన్లకు పేర్లు పెట్టడం ఇటీవలే మొదలైంది. గతంలో చాలా ఏళ్ల పాటు హిందూ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో తుపాన్లు ఏ పేరూ లేకుండా అనామకంగానే మిగిలిపోయాయి.
తుపాన్లకు పేర్లు లేకపోతే వాటి గురించి వివరించడం, విశ్లేషించడం, చర్చించడం కాస్త గందరగోళంగా ఉంటుందని వాతావరణ నిపుణులు భావించారు. మీడియాలో ప్రసారం చేసేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా వాటికి పేర్లు పెట్టడం సమంజసమని నిర్ణయించారు. అందుకే 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ పేర్లపై సమావేశాన్ని నిర్వహించారు.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్... ఈ ఎనిమిది దేశాలూ ఆ సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో అన్ని దేశాలకూ సమ ప్రాధాన్యం లభించింది. ప్రతి దేశం తలా 8 పేర్లను కమిటీకి సమర్పించింది. అలా మొత్తంగా 64పేర్లతో ఓ జాబితా సిద్ధమైంది. ఆ పేర్లను భవిష్యత్తులో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలో రాబోయే తుపాన్లకు పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పేరు ఎప్పుడు పెట్టాలి?
ఏ తుపానుకు ఏ పేరు ఎప్పుడు పెట్టాలనే దానిపైన కూడా కమిటీ ఓ పద్ధతిని రూపొందించింది. దీని కోసం ఇంగ్లిష్ వర్ణమాల ఆధారంగా దేశాల పేర్లను ఒక క్రమంలో పెట్టారు. అంటే... ఇంగ్లిష్ అక్షరం ‘బి’ తో మొదలయ్యే బంగ్లాదేశ్ ఆ జాబితాలో మొదటి స్థానంలో, ‘టి’ అనే అక్షరంతో మొదలయ్యే థాయిలాండ్ ఆ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.
2004లో ఈ సమావేశం అనంతరం అక్టోబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన తుపానుకు ‘ఒనిల్’ అనే పేరును పెట్టారు. ఈ పేరును జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ సూచించింది. అదే ఏడాది నవంబరులో అరేబియా సముద్రంలో సంభవించిన తుపానుకు ‘అగ్ని’ అనే పేరు పెట్టారు. ఆ పేరును జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్ సూచించింది.
అలా ఇప్పటిదాకా జాబితాలో ఉన్న దేశాలు వరసగా సూచించిన పేర్లనే ఒక్కో తుపానుకు పెడుతూ వచ్చారు. గతంలో భారత్ను వణికించిన ‘హుద్హుద్’ తుపాను పేరును ఒమన్, ‘ఫైలిన్’ తుపాను పేరును థాయిలాండ్, ‘వర్ధ’, ‘నర్గిస్’ పేర్లను పాకిస్తాన్ సూచించాయి.
ఎనిమిది దేశాలూ సూచించిన 64పేర్లలో ఇప్పటిదాకా 54 పేర్లను వాడేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చెలరేగిన తుపానుకు పెట్టిన ‘తిత్లీ’ పేరు జాబితాలో 54వ స్థానంలో ఉంది.
‘తిత్లీ’ తరువాత ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే తుపానుకు ‘గజా’ అనే పేరు పెడతారు. ఈ పేరును శ్రీలంక సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ సూచించిన 8 పేర్లు
2004లో జరిగిన సమావేశంలో భారత్ తన వంతుగా 8 పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థకు సూచించింది. అవి: 1. అగ్ని 2. ఆకాశ్ 3. బిజ్లి 4. జల్ 5. లెహర్ 6. మేఘ్ 7. సాగర్ 8. వాయు
ఇప్పటిదాకా ఈ ఎనిమిది పేర్లలో ఏడింటిని ఉపయోగించారు. వాడాల్సిన పేర్ల జాబితాలో ‘వాయు’ ఒక్కటే మిగిలుంది. తుపాన్లు సంభవించినప్పుడు దిల్లీలోని వాతావరణ విభాగం అధికారికంగా ఈ పేర్లను ప్రకటిస్తుంది.
అట్లాంటిక్ మహా సముద్రం పరిధిలో సంభవించే తుపాన్ల పేర్లను ఒక విడత ముగిశాక, మళ్లీ వాటినే పునరావృతం చేసే అవకాశం ఉంది. కానీ హిందూ మహా సముద్రం పరిధిలో వచ్చే తుపాన్ల విషయంలో అలా చేయరు. ‘తుపాన్ల వల్ల చాలా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఒక తుపానుకు పెట్టిన పేరును మరోసారి మరో తుపానుకు పెట్టడం సమంజసం కాదు’ అని భారత వాతావరణ విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తుపాను పేర్లు - వివాదాలు
ఈ ఎనిమిది దేశాలూ తుపాన్లకు సూచించిన పేర్లు వివాదాస్పదమైన సందర్భాలూ ఉన్నాయి. 2013లో వచ్చిన తుపానుకు శ్రీలంక సూచించిన ‘మహాసేన్’ అనే పేరు పెట్టారు. కానీ తన రాజ్యంలో శాంతి, సుస్థిరతను నెలకొల్పిన ఓ రాజు పేరు ‘మహాసేన్’ అని, ఆ పేరును ఓ విపత్తుకు పెట్టడం సరికాదని శ్రీలంకలో ప్రజలు, కొందరు అధికారులు నిరసన తెలిపారు. దాంతో ఆ పేరును ‘వియరు’గా మార్చారు.
ఈ 64 పేర్లూ అయిపోయే లోగానే తరువాతి తుపాన్లకు కొత్త పేర్లతో జాబితాను రూపొందించే అవకాశం ఉంది. ఈ ఎనిమిది దేశాలకు చెందిన వాతావరణ నిపుణులు ఏటా సమావేశమవుతారు. అవసరానికి అనుగుణంగా వాళ్లు కొత్త జాబితాను రూపొందిస్తారు.
ఏ దేశ ప్రజలైనా తుపాన్లకు కొత్త పేర్లను ప్రభుత్వానికి సూచించొచ్చు. కాకపోతే, ఆ పేర్లు కొన్ని నియమాలకు లోబడి ఉండాలి.
- పేరు చిన్నగా, సులువుగా ఎక్కువమందికి అర్థమయ్యేలా ఉండాలి.
- ఏ సంస్కృతికీ, మనోభావాలకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు.
- ఇతరులకు ఇబ్బంది కలిగించే అర్థాలు ఆ పదానికి ఉండకూడదు.
అలా పేర్లను సూచించాలనుకునేవారు దిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీ కార్యాలయానికి వాటిని పంపొచ్చు.
ఇవి కూడా చదవండి
- పందొమ్మిది గంటల పాటు ఎక్కడా ఆగకుండా విమాన ప్రయాణం
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- బ్రిటన్ కంటే భారత్లోనే బిలియనీర్లు ఎక్కువ: అయితే సామాన్యులకు లాభమేంటి?
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








