ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: ఇంటి ముంగిట్లోకి బ్యాకింగ్ సేవలు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్

ఫొటో సోర్స్, TWITTER.COM/PIB_INDIA

తపాలా విభాగంలో గత ఏడాది జనవరిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రారంభించింది.

శనివారం దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.

ఈ పేమెంట్స్ బ్యాంక్ సామాన్యులకు అందుబాటులో ఉండే చౌక, విశ్వసనీయ బ్యాంక్‌గా ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది.

ఐపీపీబీ ఎందుకంత ప్రత్యేకం? ఈ బ్యాంక్ ద్వారా ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)ని భారత సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా విభాగం కింద ప్రారంభించారు. దీనిని పూర్తిగా భారత ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
  • ఈ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు 2017 జనవరి 30 నుంచి కొనసాగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా ఈ బ్యాంక్ రెండు శాఖలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాంచీలో, ఇంకొకటి రాయ్‌పూర్‌లో ఉన్నాయి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్

ఫొటో సోర్స్, TWITTER.COM/PIB_INDIA

  • ఐపీపీబీ సాయంతో బ్యాంకులు లేని గ్రామీణ ప్రాంతాలను బ్యాంకింగ్‌తో జోడించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో పోస్ట్ మ్యాన్‌లు బ్యాంకర్ పనిచేస్తారు. తపాలా విభాగంలో 3 లక్షల మందికి పైగా పోస్ట్ మ్యాన్‌లు, తపాలా ఉద్యోగులు ఉన్నారు. వారంతా మొబైల్, బయోమెట్రిక్ పరికరాలు తీసుకుని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు అందిస్తారు.
  • పోస్టాఫీసుల్లో మొదటి నుంచీ నడుస్తున్న 17 కోట్ల పోస్టాఫీసు పొదుపు ఖాతాలను తమతో జోడించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు అనుమతి లభించింది.
  • డిసెంబర్ నాటికి దేశంలోని లక్షా 55 వేల పోస్టాఫీసులను ఐపీపీబీ సిస్టమ్‌తో జోడించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో తెరిచే పొదుపు ఖాతాలకు 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

  • నిబంధనల ప్రకారం పేమెంట్స్ బ్యాంక్‌లో గరిష్ఠంగా లక్ష రూపాయల వరకూ జమ చేయవచ్చు. వాటిని ఎవరికైనా రుణం ఇచ్చే హక్కు ఈ బ్యాంకుకు ఉండదు. కానీ మిగతా బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. రుణాలు కావాలంటే ఇతర బ్యాంకుల ద్వారా తీసుకునేందుకు సహకారం అందిస్తుంది.
  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో తెరిచే పొదుపు లేదా కరెంట్ అకౌంట్లకు మిగతా బ్యాంకుల్లాగే ఎన్నో సదుపాయాలు లభిస్తాయి. వీటిలో మనీ ట్రాన్స్‌ఫర్, ప్రభుత్వ పథకాల నగదు నేరుగా ఖాతాలో జమ కావడం, బిల్లుల చెల్లింపులు, కొనుగోళ్ల చెల్లింపులు లాంటి సదుపాయాలు ఉంటాయి.
  • ఈ సదుపాయాలన్నింటినీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఎస్ఎంఎస్ ఐవీఆర్ లాంటి వాటి ద్వారా అందిస్తారు.
  • ప్రస్తుతం ఉన్న ప్రత్యర్థి బ్యాంకులతో మొదటి నుంచే పోటీపడేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యయ పరిమితి కూడా పెంచింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)